బోల్డ్ హర్రర్ మూవీతో ఓవర్ నైట్ స్టార్డమ్... అండర్ వరల్డ్ డాన్కు భయపడి అమెరికాకు... ఇప్పటికీ ఈ హీరోయిన్ లైఫ్ ఓ మిస్టరీ
Jasmin Dhunna: బోల్డ్ హర్రర్ మూవీతో ఓవర్ నైట్ స్టార్ డమ్ సంపాదించిన ఓ హీరోయిన్ అండర్ వరల్డ్ డాన్ కు భయపడి అదృశ్యం అయ్యింది. ఇప్పటికీ ఆమె ఎక్కడ ఉంది? అన్న విషయంపై సస్పెన్స్ వీడలేదు.

కేవలం మూడు సినిమాలలో నటించిన ఓ హీరోయిన్ బోల్డ్ హర్రర్ సినిమాతో అండర్ వరల్డ్ డాన్ దృష్టిలో పడింది. ఆమెతో ప్రేమాయణం నడపాలని కలలు కన్న ఆ డాన్ నుంచి తప్పించుకోవడానికి కొన్నేళ్ళ క్రితం అదృశ్యమైన ఈ హీరోయిన్ జాడ ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఆ హీరోయిన్ ఎవరో ఇప్పటి తరం ప్రేక్షకులకు తెలిసే ఛాన్సే లేదు. ఆమె మరెవరో కాదు ఒకప్పటి హీరోయిన్ జాస్మిన్.
బోల్డ్ మూవీతో పాపులర్
1970 - 1980లలో బాలీవుడ్ లో రమేష్ రామ్సే, కేషు రామ్సే, కమల్ రామ్సే, తులసి రామ్సే, శ్యామ్ రామ్సే, అరుణ్ రామ్సే, గురుప్రీత్ రామ్సే అనే చిత్ర నిర్మాతలు ఉండేవారు. వీరిని రామ్సే బ్రదర్స్ అని పిలిచేవారు. వీళ్లు బి-గ్రేడ్ హర్రర్ సినిమాలతో చిత్ర పరిశ్రమలో అప్పట్లో సంచలనం సృష్టించారు. అలా వాళ్ళు చేసిన దో గజ్ జమీన్ కే నీచే, పురాణ మందిర్, పురాణి హవేలి, షైతాని ఇలాకా వంటి సినిమాలు కల్ట్ క్లాసిక్లుగా నిలిచాయి. రామ్సే బ్రదర్స్ దర్శకత్వం వహించిన మరో సూపర్ హిట్ మూవీ 'వీరనా'. 1988లో రిలీజ్ అయిన ఈ ఎరోటిక్ సూపర్ నేచురల్ హర్రర్ థ్రిల్లర్ లో ప్రముఖ నటీనటులు నటించారు. కానీ హీరోయిన్ జాస్మిన్ దున్నాకు మాత్రం ఊహించని పాపులారిటీ తెచ్చిపెట్టింది ఈ సినిమా.
ఈ సూపర్ హిట్ సినిమాలో జాస్మిన్ దెయ్యం ఆవహించిన అమ్మాయి పాత్రలో నటించింది. ఆమె 1979లో 13 సంవత్సరాల వయసులోనే వినోద్ ఖన్నా నటించిన 'సర్కారి మెహమాన్' సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 1984లో వచ్చిన 'డివోర్స్', 1988లో వచ్చిన హర్రర్ సినిమా 'వీరనా' అనే మరో రెండు సినిమాలు మాత్రమే చేసింది. వీరనా ఆమెకు ఓవర్ నైట్ స్టార్ గుర్తింపు ఇచ్చింది. కానీ ఈ మూవీ తరువాత విచిత్రంగా జాస్మిన్ ఇండస్ట్రీ నుండి అదృశ్యమైంది. ఆమె ఎక్కడికి వెళ్లిందో ఇప్పటికీ ఎవరికీ తెలియదు.
అండర్ వరల్డ్ డాన్ వేధింపులే కారణమా ?
'వీరనా' మూవీ విడుదలయ్యాక జాస్మిన్ దున్నా రాత్రికి రాత్రే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అదే ఆమెకు లేనిపోని చిక్కులను తెచ్చి పెట్టింది. ఎందుకంటే జాస్మిన్ అందంపై అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కన్ను పడింది. ఆమెతో ప్రేమాయణం నడపాలని దావూద్ చాలా ప్రయత్నించాడు అనే కథనాలు ఇప్పటికీ విన్పిస్తాయి. స్వయంగా దావూద్ జాస్మిన్ కు ఫోన్లు చేసి తెగ విసిగించే వాడట. కానీ ఆమె తగ్గకపోవడంతో దావూద్ బెదిరించాడని, ఆమె ఎక్కడికి వెళ్ళినా అతని మనుషులు వెంబడించేవారని అంటారు.
అతని వేధింపులకు భయపడ్డ జాస్మిన్ ఎవ్వరికీ తెలియకుండా అమెరికా పారిపోయింది అనే వార్తలు కూడా వచ్చాయి. ఆ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందనేది ఎవ్వరికీ తెలియదు. అలా ఆ హీరోయిన్ అదృశ్యమై 36 సంవత్సరాలు గడుస్తోంది. ఇప్పటికీ ఆమె అజ్ఞాతంగా జీవిస్తోంది. అయితే 2017లో ఒక ఇంటర్వ్యూలో రామ్సే బ్రదర్స్కు చెందిన శ్యామ్ రామ్సే జాస్మిన్ ఇప్పటికీ ముంబైలోనే నివసిస్తున్నారని, ఆమె తల్లి మరణం తర్వాత స్వచ్ఛందంగా సినిమాల నుండి రిటైర్ అయ్యారని వెల్లడించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

