Tirupati News: తిరుపతిలో చిరుత సంచారంతో కలకలకం, వేదిక్ వర్సిటీలో కనిపించడంతో టెన్షన్ టెన్షన్
Cheetah Spotted in Tirupati | వేదిక విశ్వవిద్యాలయంలో చిరుతలు సంచరించడం కలకలం రేపుతోంది. కుక్కలు, జింకలు దొరుకుతాయని చిరుతలు యూనివర్సిటీ పరిధిలోని స్థలంలో సంచరిస్తున్నాయి.

తిరుపతి: తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర, వేదిక్, అగ్రికల్చర్ యూనివర్సిటీలలో చిరుతల సంచారం కలకలం రేపుతోంది. సీసీ కెమెరాలు, రెండు బోన్లు ఏర్పాటు చేసి నెలలు గడుస్తున్నా చిరుతలను బంధించకపోవడం ఆందోళన పెంచుతోంది. రాత్రి వేదిక్ యూనివర్సిటీలో ఓ చిరుత సేదతీరుతూ విద్యార్థుల కంటపడింది. 3 నెలలు అవుతున్నా చిరుతలను పట్టుకోలేకపోతున్నారని.. విద్యార్థులు, ఉద్యోగులు, సిబ్బంది తరచూ భయం గుప్పిట్లో బిక్కుబిక్కు మంటూ తిరుగుతున్నారు. కుక్కలు, దుప్పిలు, జింకలు కోసం చిరుతలు ఈ ప్రాంతంలో సంచరిస్తున్నాయని సమాచారం. అటవీ శాఖ అధికారులు, ఇతర శాఖల సిబ్బంది మరింత చొరవ తీసుకుని చిరుతలను బంధించి తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని విద్యార్థులు, సిబ్బంది కోరుతున్నారు.
గాలిగోపురం సమీపంలో చిరుత సంచారం..
అలిపిరి నుంచి తిరుమలకు ఉన్న కాలినడక మార్గం మధ్యలో ఇటీవల చిరుత సంచరించడం కొందరు చూశారు. అర్ధరాత్రి సమయంలో గాలిగోపురం సమీపంలోని దుకాణం ఎదురుగా రోడ్డుపై చిరుత కనిపించింది. చిరుత సంచరిస్తున్న దృశ్యాలు ఆ షాపులోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఆ ప్రాంతంలోని దుకాణదారులను అప్రమత్తం చేశారు. అంతకుముందు ఇదే నెలలో ఏడో మైలు వద్ద చిరుత సంచారాన్ని గుర్తించి దానిని తిరిగి అడవిలోకి పంపించేశారు. తిరుమలకు వచ్చే కాలినడక భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నిత్యం పర్యవేక్షిస్తున్నామని అటవీ అధికారులు తెలిపారు.
ఎస్వీ యూనివర్సిటీలో చిరుతపులి సంచారంపై హెచ్చరిక
శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో చిరులపులి సంచరిస్తోంది. కనుక రాత్రిపూట ఎస్వీ యూనివర్సిటీ ఆవరణలో విద్యార్థులు, ఉద్యోగులు, సిబ్బంది, పాదచారలు, సందర్శకులు జాగ్రత్తగా ఉండాలి. యూనివర్సిటీ ఆవరణలో వ్యర్థ ఆహార పదార్థాలు వేయడం వలన కుక్కలు, అటవి జంతువులు జింకలు, దుప్పిలు లాంటివి వస్తున్నాయి. వీటి కోసం చిరుత పులులు వస్తున్నాయి. కనుక రాత్రి 8 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు వర్సిటీ రోడ్డుపైన సంచరించడంపై నిషేధం ఉంది. ఇది అతిక్రమిస్తే జరిగే పరిణామాలకు ఎస్వీ యూనివర్సిటీ యాజమాన్యం ఎలాంటి బాధ్యత వహించదని హెచ్చరికలో బోర్డులో పేర్కొన్నారు. అత్యవసరమైతే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ను, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ను సంప్రదించాలని వారి కాంటాక్ట్ నెంబర్స్ ఫ్లెక్సీలో ఇచ్చారు.
భక్తులకు టీటీడీ కీలక సూచనలు, జాగ్రత్తలు..
వారంలో రెండు, మూడుసార్లు చిరుతలు కనిపిస్తున్నాయని ఎస్వీ యూనివర్సిటీ విద్యార్థులు, సిబ్బంది భయం గుప్పిట్లో బతుకుతున్నారు. చిరుతల సంచారంరతో తిరుమల నడకమార్గంలో టీటీడీ విజిలెన్స్ సిబ్బంది గస్తీని పెంచింది. నడకమార్గంలో తిరుమలకు వచ్చే భక్తులకు టీటీడీ జాగ్రత్తలు సూచించింది. అలిపిరి నుంచి తిరుమలకు నడక మార్గంలో వెళ్లే భక్తులను ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అనుమతిస్తున్నారు. ఆ తరువాత భక్తులను గుంపులు గుంపులుగా దర్శనానికి అమనుతిస్తున్నారు.
12 ఏళ్ల లోపు చిన్నారులను మధ్యాహ్నం నుంచి దర్శనానికి అనుమతించడం లేదని సమాచారం. భక్తులను ఒక్కసారి 70, 80 మందిని, లేక 100 మంది వరకు దర్శనానికి అనుమతిస్తున్నారు. గుంపులుగా ఉంటే చిరుత దాడి చేసే అవకాశాల తక్కువ ఉంటాయని టీటీడీ అధికారులు, అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. అలిపిరి నడక మార్గాన్ని రాత్రి 9.30 గంటల తర్వాత మూసివేయనున్నారు. భక్తులు ఈ విషయాలు తెలుసుకుని తిరుమల శ్రీవారి దర్శనానికి ప్లాన్ చేసుకోవాలని సూచించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

