Visakha Mayor: విశాఖ మేయర్ పై అవిశ్వాసం - పదవి కాపాడుకోవడం వైసీపీకి కష్టమేనా ?
Vizag Mayor: విశాక మేయర్ పై కూటమి కార్పొటర్లు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారు. సమావేశానికి కలెక్టర్ నోటీసు ఇవ్వనున్నారు.

Vizag Mayor: గ్రేటర్ విశాఖ మేయర్ పీఠం కైవసం చేసుకోవడానికి కూటమి నేతలు స్కెచ్ వేశారు. కలెక్టర్ ను కలిసి మేయర్ హరి కుమారిపై అవిశ్వాస నోటీసు ఇచ్చిన కూటమి ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు వెంటనే సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. వైసీపీ తరపున మేయర్ గా ఉన్న గొలగాని వెంకట హరికుమారిపై అవిశ్వాసం పెట్టేందుకు కూటమి కార్పొరేటర్లు కొంత కాలంగా సన్నాహాలు చేసుకుంటున్నారు. వైసీపీకి చెందిన కనీసం ముఫ్పై మంది కార్పొరేటర్లు ఇప్పటికే పార్టీ ఫిరాయించారు. మొత్తం 99 మంది కార్పొరేటర్లు ఉన్న కార్పొరేషన్ లో ఇప్పుడు వైసీపీకి పాతిక మంది కార్పొరేటర్లు కూడా లేరు. అయినా మేయర్ పీఠాన్ని నిలబెట్టుకుంటామని కొత్త ఇంచార్జ్ కన్నబాబు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ధీమాగా ఉన్నారు.
మున్సిపల్ చట్టం ప్రకారం మొదటి సారి ఎన్నికైన తర్వాత నాలుగేళ్ల వరకూ అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం లేదు. ఇప్పుడు మేయర్ పదవి కాలం నాలుగేళ్లు పూర్తయింది ఇప్పటికే పార్టీలో చేరిన వారు.. కూటమి కార్పొరేటర్లు కలిసి మేయర్ ను దింపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ప్రస్తుత మేయర్ పై అనేక ఆరోపణలు ఉన్నాయి. మేయర్ అభ్యర్థిగా కూటమి తరపున ఎవరిని ఖరారు చేయాలన్నదానిపై చర్చలు జరుపుతున్నారు.
గ్రేటర్ విశాఖ మేయర్ పీఠం కైవశానికి కూటమి స్కెచ్. కలెక్టర్ ను కలిసి మేయర్ హరి కుమారిపై అవిశ్వాస నోటీసు ఇచ్చిన కూటమి ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు. రేపో, మాపో కౌన్సిల్ లో వైసీపీకి ఎదురుదెబ్బ.#AndhraPradesh #Vizag #Visakhapatnam #VizagNews #TeluguNews #GVMC pic.twitter.com/O5NpS57JcT
— Vizag News Man (@VizagNewsman) March 22, 2025
విశాఖ మేయర్ పీఠం వైసీపీ నుంచి జారిపోవడం ఖాయంగా ఉంది. అయితే అమర్నాథ్, కన్నబాబులకు పార్టీ హైకమాండ్ మాత్రం వార్నింగ్ ఇచ్చింది. కార్పొరేటర్లను జారిపోకుండా చూసుకుని కూటమికి షాక్ ఇవ్వాలని ఆదేశించింది. దాంతో వారిద్దరూ తమ శక్తికి మించి ప్రయత్నిస్తున్నారు. కానీ వారి మాటల్ని కార్పొరేటర్లు వినే అవకాశం కనిపించడం లేదు. ప్రస్తు బలం ప్రకారం శాఖపట్నం, అనకాపల్లి కూటమి తరపున గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కలుపుకుని 109 ఓట్లకుగాను, కూటమి బలం 73కు చేరింది. సీపీఐకి చెందిన స్టాలిన్, ముత్తంశెట్టి కూతురు కూటమికే మద్దతు ఇచ్చే అవకాశం ఉంది.
విశాఖలో వైసీపీకి ముఖ్య నేతలు ఉన్నారు. మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ ఇంచార్జ్ గా లేకపోయినా ఉత్తరాంధ్ర సీనియర్ నేతగా... విశాఖ ఎంపీ స్థానానికి ఆయన భార్యతో పోటీ చేయించిన వ్యక్తిగా ఆయన బాధ్యత తీసుకుని మేయర్ పీఠం చేజారకుండా చేయాల్సి ఉంది. అలాగే విజయసాయిరెడ్డి రాజీనామాతో కొత్తగా ఇంచార్జ్ గా నియమితులైన మాజీ మంత్రి కన్నబాబు కూడా ప్రయత్నిస్తున్నారు. గుడివాడ అమర్నాథ్ .. పార్టీ మారిన కార్పొరేటర్లతోనూ చర్చలు జరుపుతున్నారు. వీరి ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో చూడాల్సి ఉంది. వచ్చే వారం కౌన్సిల్ సమావేశం నిర్వహించి అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ పెట్టే అవకాశాలు ఉన్నాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

