SLBC Tunnel Updates: ఎస్ఎల్బీసీ టన్నెల్లో మరో మృతదేహం గుర్తింపు..!
SLBC Tunnel Collapse | శ్రీశైలం ఎడమ గట్టు కాలువ టన్నెల్ ప్రమాదంలో లోపల చిక్కుకున్న వారిలో రెండో మృతదేహం ఆనవాళ్లను గుర్తించారు. సమాచారం అందుకున్న అధికారులు టన్నెల్ లోపలికి వెళ్లి పరిశీలిస్తున్నారు.

SLBC Tunnel Rescue operation | అమ్రాబాద్: శ్రీశైలం ఎడమ గట్టు కాలువ టన్నెల్ (SLBC) రెస్క్యూ ఆపరేషన్ లో పురోగతి లభించింది. ఎస్ఎల్బీసీ టన్నెల్ లోపల రెస్క్యూ టీమ్ మరో మృతదేహం ఆనవాళ్లు గుర్తించినట్లు సమాచారం. నాగర్కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ మండలం దోమలపెంట సమీపంలోని ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఫిబ్రవరి 22న ప్రమాదం జరిగింది. ఇప్పటివరకూ టన్నెల్ బోరింగ్ మేషిన్ ఆపరేటర్ మృతదేహం మాత్రమే లభ్యమైంది. తాజాగా మరో మృతదేహం ఆనవాళ్లు గుర్తించినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో టన్నెల్ లోపల మొత్తం 8 మంది చిక్కుకుపోగా, రెండు వారాల తరువాత టీబీఎం ఆపరేటర్ డెడ్ బాడీ లభ్యమైంది. మరో 3 వారాల తరువాత రెండో మృతదేహాన్ని రెస్క్యూ టీమ్ గుర్తించింది.
లోకో ట్రాక్ వద్ద దుర్వాసన వస్తున్నట్లు సిబ్బంది గుర్తించారు. అక్కడ తవ్వకాలు చేపట్టగా రెండో మృతదేహం ఆనవాళ్లు లభించినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. అనుమానిత ప్రాంతాలు డీ1, డీ2లలో తవ్వకాలు చేపట్టిన రెస్క్యూ టీమ్, మరోచోట తవ్వకాలు జరుపుతుండగా మృతదేహం ఆనవాళ్లు కనిపించాయి. అధికారులు దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. మృతదేహం ఆనవాళ్లు సమాచాంతో అధికారులు టన్నెల్ లోపలికి వెళ్లి పరిశీలిస్తున్నారు.
సహాయక చర్యలపై సీఎం రేవంత్ రెడ్డి
ఎస్ఎల్బీసీ టన్నెల్ లో సహాయక చర్యలు వేగవంతం చేయాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికారులను సోమవారం నాడు ఆదేశించారు. కార్మికుల మృతదేహాలను వీలైనంత త్వరగా టన్నెల్ నుంచి వెలికితీయాలని సూచించారు. తాత్కాలిక సహాయక చర్యలతో పాటు భవిష్యత్తులో ఏ ప్రమాదం జరగకుండా శాశ్వత చర్యలపైనా దృష్టి పెట్టాలని సూచించారు. అవసరమైతే ఎస్ఎల్బీసీ ఎన్జీఆర్ఐ (NGRI), జీఎస్ఐతో అధ్యయనం చేయించాలని అధికారులకు రేవంత్ రెడ్డి చెప్పారు.
బాధితుల కుటుంబాలకు పరిహారం
కేంద్ర హోంశాఖ మార్గదర్శకాల ప్రకారం బాధితుల కుటుంబాలకు పరిహారం అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుందని సమాచారం.
సొరంగం నుంచి కార్మికుల మృతదేహాలను వెలికితీసే ప్రక్రియలో భాగంగా డ్రిల్ అండ్ బ్లాస్ట్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఉన్నత స్థాయి కమిటీ సూచనల మేరకు చర్యలు తీసుకోనున్నారు.






















