Revanth Reddy: వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ - ప్రత్యేక కోటాలో ఇందిరమ్మ ఇండ్లు: సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy Gets invitation for Nagoba Jatara | కేస్లాపూర్ గ్రామంలో జరగనున్న నాగోబా జాతరకు రావాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని మెస్రం వంశీయులు ఆహ్వానించారు.

Indiramma houses will be allotted to tribals under a special quota | హైదరాబాద్: ఆదివాసీ ప్రాంతాలు, ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అధికారులను ఆదేశించారు. హైదారాబాద్ లోని డా. బీ.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఆదివాసీ సంఘాలు, ప్రజా ప్రతినిధులతో శుక్రవారం సీఎం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో ఘనంగా నిర్వహించనున్న గిరిజన వేడుక నాగోబా జాతర (Nagoba Jatara)కు రావాలని నాగోబా ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్ రావ్ సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వాన పత్రిక అందించారు.
అధికారిక ఉత్సవంగా కుమ్రం భీమ్ జయంతి, వర్ధంతి
ఈ సందర్భంగా ఆదివాసీ సంఘాల ప్రతినిధులు విద్య, ఉద్యోగావకాశాలు, రోడ్లు, రవాణా, సాగు, తాగునీటి వంటి పలు అంశాలు, సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆదివాసీల కోసం ఇప్పటికే చేపట్టిన పలు విషయాలను సీఎం ప్రస్తావించారు. వారి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశాలిచ్చారు. కుమ్రం భీమ్ జయంతి, వర్ధంతిలను అధికారిక ఉత్సవంగా నిర్వహించాలని, అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. అలాగే పలు అంశాలపై అధికారులకు సూచనలిచ్చారు.
ప్రత్యేక కోటాలో ఇందిరమ్మ ఇండ్లు
ఐటీడీఏ ప్రాంతాలకు జనాభా ప్రాతిపదికన ప్రత్యేక కోటాలో ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపునకు చర్యలు తీసుకోవాలన్నారు. స్పెషల్ డ్రైవ్ కింద ఇందిర జలప్రభ ద్వారా ఉచితంగా బోర్లు వేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఆదివాసీ రైతుల వ్యవసాయ బోర్లకు సోలార్ పంపుసెట్లు ఉచితంగా అందించేందుకు చర్యలు తీసుకోవాలని, ఆదివాసీ గూడాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఆదివాసీల మాతృ భాషలో విద్య
‘ఇంద్రవెల్లి అమరుల స్తూపాన్ని స్మృతి వనంగా మార్చాలని, అమరుల కుటుంబాలకు ఇండ్లు మంజూరు చేయడం వంటి చర్యలు ఇప్పటికే తీసుకున్నాం. రాజకీయంగానూ ఆదివాసీలకు న్యాయం చేస్తూ ముందుకు వెళుతున్నామనీ, అలాగే ఆదివాసీల విద్య, ఉద్యోగ, ఆర్ధిక అభివృద్ధికి చర్యలు చేపడుతున్నాం. ఆదివాసీల మాతృ భాషలో విద్యను అందించడం, గోండు భాషలో ప్రాథమిక విద్యను అందించే అంశంపై అధ్యయనం చేసి నివేదిక అందించాలి. ఆదివాసీల కోసం ప్రత్యేకంగా స్టడీ సర్కిల్, మౌలిక సదుపాయాలను వెంటనే మంజూరు చేస్తున్నాం.
నాగోబా జాతరకు నిధులపై ఆదేశాలు
విదేశాల్లో చదువుకునే ఆదివాసీ విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్ షిప్పులకు సంబంధించి పెండింగ్ బిల్స్ క్లియర్ చేయాలి. అలాగే ఇప్పటికే మంజూరైన బీఈడీ కళాశాలకు టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలి. ఆదివాసీ రాయి సెంటర్లకు భవనాలు నిర్మించేందుకు అధ్యయనం చేసి నివేదిక రూపొందించండి. ఈ నెల 28న ప్రారంభమయ్యే కేస్లాపూర్ నాగోబా జాతరకు నిధుల మంజూరుకు చర్యలు తీసుకోవాలి. అలాగే ఉద్యమాల్లో ఆదివాసీలపై పెట్టిన కేసులు తొలగించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని’ అధికారుకుల సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రి సీతక్క, తెలంగాణ సీఎం సలహాదారు వేమ్ నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, ఇతర ఉన్నతాధికారులు, మాజీ ఎంపీ సోయం బాపురావ్, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఆదివాసి సంఘాల నాయకులు గోడం గణేష్, మేస్రం మనోహర్, టేకం భాస్కర్, జుగున్క దేవురావ్ సార్మేడి, సిడాం అర్జు, మర్సుకోల తిరుపతి, మేస్రం మోతీరాం, కొడప హన్నుపటేల్, ఆడ అమృతరావు, ఆత్రం సుగుణ, ప్రొ. రేగ రాజేందర్, ప్రొ. సిడాం కిశోర్, ప్రొ. గుమ్మడి అనురాధ, ప్రొ. అప్క నాగేశ్వర రావు, సిడాం జంగు, ఆత్రం లక్ష్మణ్, మేస్రం గంగారాం, సోయం భీంరావు, బుర్స పోచయ్యతో పాటు పలువురు ప్రతినిధులు హాజరయ్యారు.
Also Read: Nagoba Jatara 2025: ఆదివాసీలకు పవిత్రమైన పుష్య మాసం - ఈ నెలంతా వారికి పండుగలు, జాతరలే
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

