Hyderabad Metro Rail Corridor: ఎయిర్ పోర్ట్ నుంచి 40 నిమిషాల్లో ఫ్యూచర్ సిటీకి... గ్రీన్ కారిడార్ లో మెట్రో ఎండీ క్షేత్ర స్థాయి పరిశీలన
Hyderabad Metro Rail | ఫ్యూచర్ సిటీకి అనువుగా గ్రీన్ కారిడార్ లను అభివృద్ధి చేసి, విమానాశ్రయం నుండి వేగంగా ఫ్యూచర్ సిటీకి చేరుకునే ప్రణాళిక ఉండాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.

కాలుష్యరహిత నగరంగా ఫ్యూచర్ సిటీ
ఫ్యూచర్ సిటీకి అనువుగా గ్రీన్ కారిడార్ లను అభివృద్ధి చేసి, అంతర్జాతీయ విమానాశ్రయం నుండి వేగంగా, సులభంగా ఫ్యూచర్ సిటీకి చేరుకునే ప్రణాళిక ఉండాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. అది వాస్తవరూపం దాల్చేందుకు కసరత్తు చేస్తున్నామని, దాదాపు పదిహేను వేల ఎకరాలలో విస్తరించనున్న ఫ్యూచర్ సిటీని కాలుష్యరహిత నగరంగా రూపొందించడంలో, దానికి అంతర్జాతీయ స్థాయి ప్రయాణ సౌకర్యాలు కల్పించడంలో మెట్రో రైలుతో కూడిన ఈ గ్రీన్ కారిడార్ ప్రముఖ పాత్ర వహిస్తుందని హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో లిమిటెడ్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఎయిర్ పోర్ట్ నుండి మీర్ ఖాన్ పేట్ లో నిర్మాణంలో ఉన్న స్కిల్ యూనివర్సిటీ వరకు మెట్రో కారిడార్ డీపీఆర్ తయారీకై జరుగుతున్న సర్వే పనులను మెట్రో ఎండీ ఆదివారం క్షేత్రస్థాయి పర్యటనలో పరిశీలించారు. కొంగర కలాన్ దాటిన తరువాత ప్రస్తుతం రోడ్ లేకపోవడం వల్ల కాలినడకన ఆయన ఈ క్షేత్ర పర్యటన జరిపారు.
ఎయిర్ పోర్ట్ నుండి రావిర్యాల మీదుగా గ్రీన్ కారిడార్ మెట్రో రైల్
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి ఫ్యూచర్ సిటీకి వెళ్లే మెట్రో మార్గం దాదాపు 40 కిలోమీటర్లు ఉంటుంది. ఎయిర్ పోర్ట్ టెర్మినల్ నుండి మొదలై, కొత్త మెట్రో రైల్ డిపో పక్క నుండి ఎయిర్ పోర్ట్ వెంబడి ఎలివేటెడ్ మార్గంగా మన్సాన్ పల్లి గుండా 5 కిలోమీటర్లు ముందుకు సాగాక పెద్ద గొల్కోండ ఓఆర్ఆర్ ఎగ్జిట్ కి చేరుతుందని మెట్రో ఎండీ తెలిపారు. బహదూర్ గుడాలో ఉన్న దాదాపు 1000 నుండి 1500 ఎకరాల ప్రభుత్వ భూమిని ఒక అంతర్జాతీయ స్థాయి కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు తోడ్పడేలా బహదూర్ గుడా, పెద్ద గోల్కొండలలో రెండు మెట్రో స్టేషన్లను అత్యంత ఆకర్షణీయంగా అభివృద్ధి చేస్తామని ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. పెద్ద గోల్కొండ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నుండి తుక్కుగూడ ఎగ్జిట్ మీదుగా రావిర్యాల్ ఎగ్జిట్ వరకు దాదాపు 14 కిలోమీటర్ల పొడవున ఈ మెట్రో మార్గాన్ని ఎలివేటెడ్ మెట్రో మార్గంగా ఓఆర్ఆర్ లో మెట్రో రైల్ కి కేటాయించిన భాగంలో తక్కువ ఎత్తులో నిర్మిస్తామని ఆయన తెలిపారు.
రహదారికి ఇరువైపులా రెండు సర్వీస్ రోడ్లు
రావిర్యాల ఎగ్జిట్ నుండి ఇప్పటికే నిర్మాణంలో ఉన్న స్కిల్ యూనివర్సిటీ వరకు దాదాపు 22 కిలోమీటర్లు కొంగరకలాన్, లేమూర్, తిమ్మాపూర్, రాచలూరు, గుమ్మడవెల్లి, పంజగుడా, మీర్ ఖాన్ పేట్ వరకు హెచ్ఎండీఏ 100 మీటర్లు ( 328 అడుగులు) వెడల్పున నిర్మించే గ్రీన్ ఫీల్డ్ రహదారి మధ్యలో 22 మీటర్లు (72 అడుగులు) మెట్రో రైల్ కి కేటాయించారు. ఈ రోడ్ మధ్య స్థలంలో మెట్రో రైల్ కారిడార్ 'ఎట్ గ్రేడ్' (భూ తలంపై) మెట్రోగా అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు. ఈ రోడ్ మధ్య లో అదే లెవెల్ లో మెట్రో రైల్ ఉంటే దానికి ఇరువైపులా మూడు లేన్ల ప్రధాన రహదారి ఉంటుంది. మెట్రోను, ప్రధాన రహదారిని విభజిస్తూ చెట్లను, గ్రీనరీని అభివృద్ధి చేస్తామని, ప్రధాన రహదారికి ఇరువైపులా రెండు సర్వీస్ రోడ్లను ఏర్పాటు చేస్తామనిఅన్నారు.
డాక్టర్ వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఓఆర్ఆర్ నిర్మిస్తున్నప్పుడు ఓఆర్ఆర్ లో అంతర్భాగంగా భవిష్యత్ లో నిర్మించబోయే మెట్రో కి తగినంత స్థలాన్ని కేటాయించాలన్న అప్పటి తన ప్రతిపాదనతో 20 మీటర్లు మెట్రోకి కేటాయించినట్లు తెలిపారు. ఓఆర్ఆర్, మెట్రో వంటి బృహత్ ప్రణాళికలు కేవలం కాగితాలకే పరిమితమవుతాయని, అప్పట్లో అనేక మంది అపహాస్యం చేసినా.. ఓఆర్ఆర్, మెట్రో రెండూ కూడా కార్యరూపం దాల్చాయన్నారు. వీటివల్ల హైద్రాబాద్ కు మరింత ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని మెట్రో ఎండీ అన్నారు.
Also Read: Revanth Reddy: యాదగిరిగుట్టలో బంగారు విమాన గోపురం ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి, పూర్తి విశేషాలివే
ప్రపంచంలో ప్రప్రథమంగా 22 వేల కోట్ల రూపాయలతో మెట్రో మొదటి దశను 69 కిలోమీటర్ల మేర పీపీపీ పద్ధతిన విజయవంతంగా పూర్తి చేసాం. అదే విధంగా ఈ ప్రణాళికలను కూడా రేవంత్ రెడ్డి దార్శనికతతో కార్యరూపం దాల్చేలా హెచ్ఎండీఏ, టీజీఐఐసి, మెట్రో రైల్ సంస్థలు సంయుక్తంగా కృషి చేస్తాయని అన్నారు. నార్త్ సిటీ లోని మేడ్చల్, శామీర్ పేట్ కారిడార్లతో పాటు, ఈ ఫ్యూచర్ సిటీ మెట్రో కారిడార్ డీపీఆర్ కూడా ఈ మార్చి నెలాఖరుకు పూర్తి చేసి, రాష్ట్ర ప్రభుత్వ ఆమోదంతో కేంద్ర ప్రభుత్వానికి వీటిని సమర్పిస్తామని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

