Andhra Pradesh News: రెండు గ్రూపులుగా సచివాలయాల ఉద్యోగులు- ప్రభుత్వం సంచలన నిర్ణయం
Andhra Pradesh News: ఆంధ్రప్రదేశ్లో గ్రామ, వార్డు సచివాలయాలను ప్రక్షాళన చేసే దిశగా ప్రభుత్వం అడుగుల వేస్తోంది. వాటిని కూడా రియల్టైం గవర్నెన్స్ ఆఫీస్లుగా మార్చాలని చర్యలు చేపట్టింది.

Andhra Pradesh News: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల రేషనలైజేషన్ ద్వారా మరింత మెరుగైన సేవలు పొందేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కొన్ని చోట్ల ఎక్కువగా, కొన్ని చోట్ల తక్కువగా గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఉన్నారు. రేషనలైజేషన్ ద్వారా వీటిని సరిదిద్దేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రస్తుతం రాష్ట్రంలో 11,162 గ్రామ సచివాలయాలు, 3,842 వార్డు సచివాలయాలు ఉన్నాయి. వీటిలో 1,27,175 మంది పని చేస్తున్నారు. ప్రతి సచివాలయంలో 10 మంది ఉద్యోగులు ఉండేలా ఈ విభాగాన్ని డిజైన్ చేయగా... చాలా ప్రాంతాల్లో తక్కువ మంది సిబ్బందితో కార్యకలాపాలు నడిపిస్తున్నారు. కొన్నిచోట్ల 4 నుంచి ఆరుగురితో సచివాలయాలు పని చేస్తున్నాయి.
రెండు విభాగాలుగా సచివాలయ ఉద్యోగులు
రేషనలైజేషన్లో భాగంగా మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీస్గా వీరిని విభజించాలనేది ప్రతిపాదన. మల్టీపర్పస్ ఫంక్షనరీస్ విభాగంలోకి విలేజ్ సెక్రటేరియట్ పరిధిలోని పంచాయతీ సెక్రటరీ, డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, గ్రామ మహిళా పోలీస్ వస్తారు. అలాగే వార్డు సెక్రటేరియట్లో వార్డు అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ, వార్డు ఎడ్యుకేషన్ అండ్ డాటా ప్రాసెసింగ్ సెక్రటరీ, వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ, వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శి వస్తారు.
టెక్నికల్ ఫంక్షనరీస్ విభాగంలోకి గ్రామ సచివాలయం పరిధిలో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, ఎఎన్ఎం, సర్వే అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, అగ్రికల్చర్ సెక్రటరీ, వెటర్నరీ సెక్రటరీ, ఎనర్జీ అసిస్టెంట్ ఉంటారు. టెక్నికల్ ఫంక్షనరీస్ విభాగంలో వార్డు సచివాలయంలో వార్డు రెవెన్యూ సెక్రటరీ, వార్డు హెల్త్ సెక్రటరీ, వార్డు ప్లానింగ్ సెక్రటరీ, వార్డు ఎమినిటీస్ సెక్రటరీ, వార్డ్ శానిటేషన్ సెక్రటరీ, వార్డు ఎనర్జీ సెక్రటరీ వస్తారు.
ఉద్యోగుల విభజన ఇలా..
2500 మంది లోపు జనాభాకు ఇద్దరు మల్టీపర్పస్ ఫంక్షనరీస్, నలుగురు టెక్నికల్ ఫంక్షనరీస్ కలిపి ఆరుగురు ఉంటారు. 2500 నుంచి 3500 మంది జనాభాకు ముగ్గురు మల్టీ పర్పస్ ఫంక్షనరీస్, నలుగురు టెక్నికల్ ఫంక్షనరీస్ కలిపి ఏడుగురు ఉంటారు. 3501 నుంచి ఆపై జనాభాకు నలుగురు మల్టీ పర్పస్ ఫంక్షనరీస్, నలుగురు టెక్నికల్ ఫంక్షనరీస్ కలిపి ఎనిమిది మంది ఉంటారు.
మొత్తం 15,004 గ్రామ వార్డు సచివాలయాలు
ఈ విధంగా రేషనలైజేషన్ చేస్తే 2500లోపు జనాభా కలిగిన ప్రాంతంలో ఆరుగురు సిబ్బందితో 3,562 గ్రామ, వార్డు సచివాలయాలు ఉంటాయి. 2500 నుంచి 3500 మంది జనాభా కలిగిన ప్రాంతంలో ఏడుగురు సిబ్బందితో 5,388 గ్రామ, వార్డు సచివాలయాలు ఉంటాయి. 3500 పైగా జనాభా కలిగిన ప్రాంతంలో 8 మంది సిబ్బందితో 6054 గ్రామ, వార్డు సచివాలయాలు ఉంటాయి. మొత్తం 15,004 గ్రామ వార్డు సచివాలయాలు ఉంటాయి. ఈ అంశాలను సమీక్షలో అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
5 కి.మీ పరిధిలో ఒక సెక్రటేరియట్
అనంతరం సీఎం మాట్లాడుతూ ఒకరిని ఆస్పిరేషనల్ సెక్రటరీగా నియమించాలని సూచించారు. వీరి ద్వారా ఎఐ, డ్రోన్ వంటి కొత్త టెక్నాలజీని గ్రామాల్లోకి తీసుకువెళ్లాలని ఆదేశించారు. ఈ సెక్రటరీ ద్వారా గ్రామాల్లో, వార్డుల్లో టెక్నాలజీపరంగా సేవలు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని సిఎం అధికారులను ఆదేశించారు. ప్రతి ఇంటినీ జియో ట్యాగింగ్ చెయ్యాలని చెప్పారు. కనీసం 2500 జనాభాకు లేదా 5 కి.మీ పరిధిలో ఒక సెక్రటేరియట్ ఉండాలని సిఎం తెలిపారు. ఏజెన్సీల్లో అవసరం అయితే అదనంగా సచివాలయాలు పెంచాలన్నారు.
వాళ్లే యాస్పిరేషనల్ సెక్రటరీ
గతంలో ప్రతిపాదించిన విధానం ప్రకారం మొత్తం 1,61,000 సచివాలయ ఉద్యోగులు ఉండాలి. కానీ ప్రస్తుతం 1,27,000 మందే పనిచేస్తున్నారు. అయితే ప్రస్తుతం కొత్త విధానం వల్ల తక్కువ సంఖ్యతో ఎక్కువ సేవలు పొందే అవకాశం ఉంది. ఉన్నవారిని సమర్థవంతంగా ఉపయోగించుకోవడం ద్వారా మెరుగైన సేవలు అందించనున్నారు. కొత్త విధానం అమల్లోకి వస్తే 15 వేల మంది సెక్రటేరియట్ స్టాఫ్ అదనంగా ఉంటారు. వీళ్లలో సాంకేతికంగా అవగాహన ఉన్న వారిని శిక్షణ ఇచ్చి యాస్పిరేషనల్ సెక్రటరీగా నియమించాలని సీఎం సూచించారు.
రియల్టైమ్ గవర్నెన్స్ కార్యాలయాలు
ప్రజల సమాచారం పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. సమాచారం లేని ప్రజలకు సంబంధించి పూర్తి వివరాలు తీసుకునే పక్రియను ఈ నెలాఖరుకు పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాలు రియల్టైమ్ గవర్నెన్స్ కార్యాలయాలుగా పని చేయాలని సిఎం సూచించారు. సచివాలయాల పనితీరు అంచనా వేసి వారికి తగిన విధంగా బహుమతి ఇవ్వాలన్నారు.
పంచాయతీ కార్యదర్శి/వార్డు పరిపాలనా కార్యదర్శి సచివాలయ విభాగానికి అధిపతిగా ఉంటారు. సచివాలయాలు నైపుణ్య అభివృద్ధి, పరిశ్రమ అభివృద్ధి, ప్రాసెసింగ్, మార్కెటింగ్, ఉపాధి, విలువ జోడింపు వంటి వాటికి కేంద్రంగా ఉండాలన్నారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థల ద్వారా కార్యనిర్వాహకులకు సాంకేతిక శిక్షణ అందించాలన్నారు.
జనవరి 20, 2025 నాటికి గృహాలన్నీ జియో-ట్యాగింగ్ పూర్తి చేయాలని ఆదేశించారు. సచివాలయాల ద్వారా జారీ చేసే సర్టిఫికెట్లపై ముఖ్యమంత్రి ఫోటోలు ముద్రించవద్దని సీఎం స్పషమైన ఆదేశాలు ఇచ్చారు. సర్టిఫికెట్లపై ప్రభుత్వ లోగో మాత్రమే ఉండాలని సీఎం ఆదేశించారు. పిల్లలందరికీ ఆధార్ జారీ ప్రక్రియ ఫిబ్రవరి 15, 2025 నాటికి పూర్తి చెయ్యాలన్నారు. రాష్ట్రంలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న వ్యక్తుల గురించి సర్వే చేయాలని సూచించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

