Ashwin Vs Dhoni: వందో టెస్టుకి ధోనీని రమ్మని పిలిచా.. కానీ రాలేదు.. అంతకంటే మిన్నగా నాకు గిఫ్ట్ ఇచ్చాడు: అశ్విన్
వందో టెస్టు సందర్భంగా ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి, స్పెషల్ మెమెంటోను అశ్విన్ కు బోర్డు అందజేసింది.ఈ మెమెంటోను ధోనీ చేతుల మీదుగా తీసుకోవాలని భావించానని, అయితే ఆ కల నెరవేరలేదని పేర్కొన్నాడు.

Ashwin Comments: భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గురించి ఆసక్తికర విషయం తెలియజేశాడు. గతంలో ఇంగ్లాండ్ తో ధర్మశాలలో జరిగిన టెస్టు తనకు వందోవది కావడంతో, దానికి ప్రత్యేక అతిథిగా ధోనీనీ రమ్మని పిలిచానని, అయితే ఆ వేడుకకు తను రాలేదని పేర్కొన్నాడు. వందో టెస్టు సందర్భంగా ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి, బీసీసీఐ ఒక స్పెషల్ మెమెంటోను అశ్విన్ కు బోర్డు అందజేసింది. అయితే ఈ మెమెంటోను ధోనీ చేతుల మీదుగా తీసుకోవాలని భావించానని, అయితే ఆ కల నెరవేరలేదని పేర్కొన్నాడు. అయితే అంతకన్నా పెద్ద గిఫ్టు తనకు ధోనీ ఇచ్చాడని, గతేడాది జరిగిన మెగా వేలంలో తనను కొనుగోలు చేయడం ద్వారా మళ్లీ చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడే అవకాశాన్ని ధోనీ కల్పించాడని అశ్విన్ చెప్పుకొచ్చాడు. ఇది తనకు చాలా విలువైనదని, మళ్లీ సీఎక్కే తరపున ఆడాలనే తన డ్రీమ్ నెరవేర్చినందుకు ధోనీకి థాంక్స్ చెప్పాడు. తాజాగా చెన్నైలో జరిగిన ఒక బుక్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న అశ్విన్ పై విషయాలు తెలియజేశాడు.
2008లో సీఎస్కే తరపునే..
భారత క్రికెట్లో మేటీ స్పిన్నర్ గా అశ్విన్ ను గుర్తిస్తారు. గతేడాది బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సందర్భంగా తను అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అడిలైడ్ లో పాల్గొన్న టెస్టు మ్యాచే అశ్విన్ కెరీర్లో చివరి అంతర్జాతీయ మ్యాచ్. దీంతో అతను తన 106వ టెస్టులో రిటైర్మెంట్ ప్రకటించాడు. నిజానికి ధర్మశాలలో జరిగిన వందోటెస్టులోనే రిటైర్మెంట్ ప్రకటించాలని భావించినట్లు అశ్విన్ పేర్కొన్నాడు. ఇక ఐపీఎల్లో హోం టౌన్ చెన్నైకి చెందిన సీఎస్కేతో అశ్విన్ కు మంచి సంబంధాలు ఉన్నాయి. 2008లో సీఎస్కే తరపున ఐపీఎల్లో అరంగేట్రం చేసిన అశ్విన్.. 2015 వరకు ఆ టీమ్ తరపున ఆడాడు. అనంతరం వివిధ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడి, ఈ ఏడాది నుంచి మళ్లీ చెన్నై గూటికి చేరాడు.
ప్రాక్టీస్ ప్రారంభించిన చెన్నై..
లీగ్ లో అత్యంత విజయవంతైమన జట్లలో చెన్నై ఒకటి. టోర్నీలో ఐదుసార్లు విజేతగా నిలిచి, ముంబై ఇండియన్స్ సరసన నిలిచింది. మరో టైటిల్ సాధిస్తే, టోర్నీలో అత్యధిక టైటిల్స్ సాధించిన జట్టుగా రికార్డులకెక్కుతుంది. ఈనెల 22న ఐపీఎల్ ప్రారంభమవుతుండగా, 23న చిరకాల ప్రత్యర్థి ముంబైతో చెన్నైలోనే తొలి మ్యాచ్ ఆడుతుంది. చెపాక్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ పై అందరి ఫోకస్ ఉంది. ఈసారి వేలంలో మరింత బలంగా తయారైన చెన్నై, మరో టైటిల్ పై దృష్టి సారించింది. ఇక ఇప్పటికే ట్రైనింగ్ సెషన్లు కండక్టు చేస్తున్న చెన్నై జట్టులో ఆటగాళ్లు ఒక్కొక్కరుగా జాయిన్ అవుతున్నారు. ముఖ్యంగా గత సీజన్లో అదరగొట్టిన ధోనీ.. ఈ సీజన్లో ఇప్పటికే సిక్సర్లతో సత్తా చాటాడు. తను ప్రాక్టీస్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. అభిమానులు లైకులు, షేర్లు, కామెంట్లతో ఆ పోస్టును తెగ వైరల్ చేస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

