Ethanol: పెట్రోల్ తర్వాత డీజిల్పైనా ప్రయోగం.. ఇథనాల్పై కేంద్రం ఎందుకు వెనక్కి తగ్గింది?
డీజిల్లో ఇథనాల్ కలపడం వల్ల ఫ్లాష్ పాయింట్ భారీగా తగ్గుతోంది. దీంతో భద్రత ప్రమాణాలు పాటించడం సాధ్యం కాదని కేంద్రం ఈ విధానాన్ని తిరస్కరించింది.

Ethanol-blended diesel: పెట్రోల్లో ఇథనాల్ కలపడం ఇప్పటికే దేశంలో అమలవుతోంది. ఇప్పుడు ఇతర ఇంధనాల్లోనూ ఇథనాల్ వినియోగాన్ని పెంచాలని కేంద్రం ప్రయత్నిస్తోంది. అయితే డీజిల్ విషయంలో మాత్రం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డీజిల్లో ఇథనాల్ కలపడం వల్ల భద్రత సమస్యలు తలెత్తే అవకాశం ఉందని గుర్తించింది. దీంతో ఇథనాల్-డీజిల్ మిశ్రమాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టింది.
ఫ్లాష్ పాయింట్ తగ్గడమే ప్రధాన సమస్య
డీజిల్లో ఇథనాల్ కలిపితే ఫ్లాష్ పాయింట్ గణనీయంగా తగ్గుతున్నట్లు పరీక్షల్లో తేలింది. ఒక ఇంధనం నుంచి వెలువడే ఆవిరి మండడానికి అవసరమైన కనిష్ఠ ఉష్ణోగ్రతనే ఫ్లాష్ పాయింట్ అంటారు. ఇది తక్కువగా ఉంటే ఇంధనం నిల్వ చేయడం & రవాణా చేయడంలో భద్రత పరమైన ప్రమాదాలు పెరుగుతాయి.
కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేశ్ గోపీ వెల్లడించిన వివరాల ప్రకారం.. డీజిల్లో ఇథనాల్ కలిపిన వివిధ మిశ్రమాలపై ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు (OMCలు) పరీక్షలు నిర్వహించాయి. OMCలకు చెందిన పరిశోధన & అభివృద్ధి కేంద్రాల్లో ఈ పరీక్షలు జరిగాయి. గుర్తింపు పొందిన ప్రయోగశాలలు & వాహన తయారీ సంస్థల సహకారంతో ఈ పరీక్షలు చేపట్టారు.
అయితే ఇథనాల్ కలపడం వల్ల డీజిల్ భద్రత ప్రమాణాలను అందుకోవడం కష్టమైందని ఈ పరీక్షల్లో స్పష్టమైంది. దీంతో ఈ విధానాన్ని కొనసాగించకూడదని కేంద్రం నిర్ణయించింది.
ఇది కూడా చదవండి: E20లో క్లోరైడ్, తేమ నిజంగానే పెరిగాయా? దేశవ్యాప్త తనిఖీల తర్వాత OMCలు ఏం చెప్పాయి?
ఇథనాల్ - డీజిల్ ఎందుకు కలవడం లేదు?
ఇథనాల్ అనేది రెండు కార్బన్లతో కూడిన ఆల్కహాల్. దీని రసాయన నిర్మాణం ధ్రువ స్వభావాన్ని కలిగి ఉంటుంది. డీజిల్ మాత్రం పూర్తిగా భిన్నమైన లక్షణాలు కలిగిన ఇంధనం. అందువల్ల ఈ రెండింటిని కలిపినప్పుడు ఎక్కువ కాలం ఒకే మిశ్రమంగా ఉండటం కష్టం. కొంతకాలం నిల్వ ఉంచిన తర్వాత ఇథనాల్ & డీజిల్ విడిపోయే అవకాశం ఉంటుంది. వీటిని కలిపి ఉంచేందుకు ప్రత్యేక రసాయన బైండర్లు ఉపయోగించాల్సి ఉంటుంది. అయితే వీటి వినియోగం వల్ల ఖర్చు పెరుగుతుంది.
ఫ్లాష్ పాయింట్ విషయంలోనూ పెద్ద తేడా ఉంది. ఇథనాల్ ఫ్లాష్ పాయింట్ సుమారు 12 నుంచి 13 డిగ్రీల సెల్సియస్ మాత్రమే. డీజిల్కు కనీసం 35 డిగ్రీల సెల్సియస్ ఫ్లాష్ పాయింట్ అవసరం. దీంతో రెండు ఇంధనాలు వేర్వేరు పెట్రోలియం భద్రత వర్గాల్లోకి వస్తాయి.
5 శాతానికి మించి సమస్యలు
ప్రత్యేక బైండర్లు ఉపయోగించినప్పటికీ వాహన తయారీ సంస్థలు డీజిల్లో ఇథనాల్ను 5 శాతానికి మించి కలపడానికి సాధారణంగా ఆసక్తి చూపలేదు. ఎక్కువ మోతాదులో ఇథనాల్ కలిస్తే ఇంజిన్ దహన ప్రక్రియలో సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: ఎలక్ట్రిక్ బైక్ లేదా స్కూటర్ కొనేవాళ్లకు పెద్ద శుభవార్త.. రాయితీ గడువు పొడిగించిన కేంద్రం
ఐసోబ్యూటనాల్ను ఉపయోగించి కొత్త ప్రయోగం
ఇథనాల్కు బదులుగా ఐసోబ్యూటనాల్ను డీజిల్లో కలిపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2027 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో 2 శాతం ఐసోబ్యూటనాల్ కలిపిన డీజిల్తో పైలట్ పరీక్షలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ ప్రయోగాన్ని కేంద్ర ప్రభుత్వ టాస్క్ఫోర్స్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. వాహన తయారీ సంస్థలు, చమురు మార్కెటింగ్ సంస్థలు ఇందులో పాల్గొంటాయి. టాటా మోటార్స్ వాణిజ్య వాహన విభాగం హిందుస్థాన్ పెట్రోలియంతో కలిసి ఈ పరీక్షలకు అవసరమైన ప్రత్యేక ఇంధనాన్ని సిద్ధం చేసే పనిలో ఉంది.
ఐసోబ్యూటనాల్ నాలుగు కార్బన్లతో కూడిన ఆల్కహాల్. దీని ఫ్లాష్ పాయింట్ 27 నుంచి 30 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుంది. దీంతో ఇది డీజిల్తో సమానమైన క్లాస్ బి పెట్రోలియం వర్గంలో ఉండే అవకాశం ఉంది.
10 శాతం ఐసోబ్యూటనాల్ కలిపిన డీజిల్ 40 రోజులకు పైగా విడిపోకుండా స్థిరంగా ఉన్నట్లు ప్రాథమిక పరీక్షల్లో తేలింది. 5 శాతం మిశ్రమంతో ఉద్గారాలు తగ్గినట్లు డైనమోమీటర్ పరీక్షల్లో గుర్తించారు. మైలేజీపై ప్రభావం కేవలం 1 నుంచి 2 శాతం మాత్రమే ఉన్నట్లు వెల్లడైంది.
విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించడంలో ఐసోబ్యూటనాల్ ఉపయోగపడే అవకాశం ఉంది. సాధారణ డీజిల్తో పోలిస్తే దీని శక్తి సామర్థ్యం తక్కువే అయినప్పటికీ.. 2 శాతం మిశ్రమంతో వాహన పనితీరుపై ప్రభావం చాలా స్వల్పంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్ని ఫాలో అవ్వండి.
ట్రెండింగ్ వార్తలు





















