Monsoon Mold : ఇంట్లో పెరిగే బూజుతో జాగ్రత్త, ముఖ్యంగా వర్షాకాలంలో.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపొచ్చంటున్న వైద్యులు
Monsoon Mold Alert : వర్షాకాలంలో ఇంట్లో పెరిగే బూజుతో జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఊపిరితిత్తులపై దాని ప్రభావం ఎక్కువై ఆరోగ్య సమస్యలకు కారణమవుతుందట.

- వర్షాకాలపు తేమ ఇంటి గోడలపై బూజును పెంచుతుంది.
- ఈ బూజు స్పోర్లు పీల్చడం శ్వాసకోశ సమస్యలు కలిగిస్తుంది.
- ఆస్తమా రోగులు, పిల్లలు బూజు ప్రభావానికి ఎక్కువ గురవుతారు.
- తేమ నియంత్రణ, సరైన వెంటిలేషన్ బూజు వ్యాప్తిని ఆపుతుంది.
Mold Exposure During Monsoon : వర్షాకాలం వచ్చిందంటే వాతావరణంలో తేమ పెరుగుతుంది. దీనికి తోడు ఇంట్లో సరైన వెంటిలేషన్ లేకపోతే గోడలు, బాత్రూమ్లు, కిచెన్, అల్మారాలు, ఏసీ డక్టులు వంటి ప్రదేశాల్లో బూజు పెరిగే అవకాశం ఉంటుంది. అయితే చాలామంది ఈ బూజును కేవలం ఇంటి అందాన్ని పాడుచేసే సమస్యగా భావిస్తారు. కానీ ఇది గాలి ద్వారా వ్యాపించే సూక్ష్మ స్పోర్లను విడుదల చేస్తుంది. వీటిని పీల్చడం వల్ల కొందరిలో శ్వాసకోశ సమస్యలు తలెత్తవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
హైదరాబాద్లోని యశోద ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ ప్రణయ్ సాయి చంద్రగిరి ప్రకారం.. ఆస్తమా, అలర్జీలు, క్రానిక్ సైనసైటిస్, COPD, హైపర్సెన్సిటివిటీ లేదా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు తేమతో కూడిన బూజు పట్టిన ప్రదేశాల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. దానికి కారణం ఏంటో.. వర్షాకాలంలో బూజు ఏ విధంగా ప్రభావం చూపిస్తుందో తెలుసుకుందాం.
ఇంట్లో బూజు ఎక్కడ పెరుగుతుంది?
వర్షాకాలంలో తేమ ఎక్కువగా ఉండటంతో బూజు పెరగడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. బాత్రూమ్ గోడలు, మూలలు, కిచెన్లో తేమ ఉండే ప్రాంతాలు, నీరు కారే గోడలు, పైకప్పులు, అల్మారాలు, ఫర్నిచర్ వెనుక భాగాలు, ఏసీ డక్టులు, వెంటిలేషన్ ప్రాంతాలు, ఎక్కువసేపు తడిగా ఉండే ప్రదేశాల్లో ఎక్కువగా బూజు పడుతుంది. కొన్నిసార్లు బూజు కంటికి కనిపించకముందే ఇంట్లో వచ్చే తడి లేదా మట్టి వాసన లాంటి వాసన విడుదల చేస్తుంది.
Also Read : వర్షాకాలంలో ఇంట్లో ఈ ప్రదేశాలను తప్పకుండా శుభ్రం చేయండి.. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే
ఊపిరితిత్తులపై బూజు ప్రభావం
బూజు నుంచి సూక్ష్మమైన స్పోర్లు గాల్లోకి విడుదలవుతాయి. అవి మనం శ్వాస తీసుకునేటప్పుడు ముక్కు, గొంతు, శ్వాసనాళాల్లోకి వెళ్లవచ్చు. దీనివల్ల కొందరిలో శ్వాసకోశం ఇరిటేషన్కు గురయ్యే అవకాశం ఉంటుందని డాక్టర్ ప్రణయ్ సాయి తెలిపారు. అలాంటప్పుడు లేదా బూజు ఉన్న ప్రదేశంలో ఎక్కువసేపు ఉన్నప్పుడు కొంతమందికి కొన్ని లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయని తెలిపారు. వాటిని గుర్తిస్తే జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
బూజు వల్ల ఆరోగ్యంపై కనిపించే లక్షణాలు
బూజు ప్రభావం అందరిలో ఒకేలా ఉండదు. కొందరికి ఎలాంటి సమస్యలు కనిపించకపోవచ్చు. మరికొందరిలో తరచూ తుమ్ములు రావడం, ముక్కు మూసుకుపోవడం, దగ్గు తగ్గకపోవడం, శ్వాస తీసుకునేటప్పుడు గురక రావడం, గొంతులో ఇరిటేషన్, కళ్లలో మంట లేదా చికాకు, ఆస్తమా లక్షణాలు తీవ్రం కావడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కనిపించవచ్చు.
బూజు ప్రభావం ఎవరిపై ఎక్కువ ఉంటుందంటే..
ఆరోగ్యంగా ఉన్నవారిలో బూజు వల్ల స్వల్పమైన ఇరిటేషన్ మాత్రమే రావచ్చు లేదా ఎలాంటి లక్షణాలు లేకపోవచ్చు. అయితే కొందరు వ్యక్తులు మాత్రం ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, ఆస్తమా లేదా అలర్జీలు ఉన్నవారు, క్రానిక్ ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారు, ఆటో ఇమ్యూన్ వ్యాధులు ఉన్నవారు, రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారు బూజు వాతావరణానికి దూరంగా ఉండటం మంచిది.
Also Read : ఇంట్లో కారు వాష్ చేస్తున్నారా? అయితే ఈ తప్పులు చేయకండి.. పర్ఫెక్ట్ క్లీనింగ్ ప్రాసెస్ ఇదే
CDC ప్రకారం కూడా తేమ, బూజు ఉన్న వాతావరణంలో ఉండటం వల్ల దగ్గు, గురక, గొంతు ఇరిటేషన్ వంటి సమస్యలు రావచ్చు. ఆస్తమా ఉన్నవారిలో లక్షణాలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలిక ఊపిరితిత్తుల సమస్యలు లేదా బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారిలో మరింత తీవ్రమైన సమస్యల ప్రమాదం ఉండొచ్చు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఇంట్లో బూజు కనిపిస్తే దానిని దులిపేయడమే కాకుండా.. తేమకు కారణాన్ని గుర్తించి నియంత్రించడం అత్యంత ముఖ్యం. పైకప్పు లేదా పైపుల నుంచి నీరు కారుతుంటే వెంటనే మరమ్మతు చేయించాలి. ఇంట్లో తేమ ఎక్కువగా లేకుండా చూసుకోవాలి. కిటికీలు తెరిచి గాలి బాగా ప్రసరించేలా చేయాలి. తడిసిన ప్రదేశాలను వీలైనంత త్వరగా, సాధ్యమైనంత వరకు 24 నుంచి 48 గంటల్లోపు పూర్తిగా ఆరబెట్టాలి.
బూజును శుభ్రం చేసేటప్పుడు గ్లౌజులు, మాస్క్ ఉపయోగించాలి. బూజు పట్టిన ప్రదేశంపై పెయింట్ మాత్రమే వేయడం మంచిది కాదు. ఎందుకంటే తేమకు అసలు కారణం అలాగే ఉంటే.. పెయింట్ వేసిన తర్వాత కూడా బూజు మళ్లీ పెరిగే అవకాశం ఉంటుంది.
డాక్టర్ను ఎప్పుడు సంప్రదించాలి?
ఇంట్లో లేదా తేమతో కూడిన ప్రదేశంలో ఉన్నప్పుడు తరచూ దగ్గు, గురక, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఆస్తమా తీవ్రతరం కావడం వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి. దగ్గు ఎక్కువకాలం కొనసాగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, పదేపదే సైనస్ సమస్యలు రావడం లేదా ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే లక్షణాలు ఎక్కువగా కనిపిస్తే వైద్యుడిని సంప్రదించడం మంచిదని సూచిస్తున్నారు.
వర్షాకాలంలో బయట కాలుష్యం, వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించుకోవడం ఎంత ముఖ్యమో.. ఇంట్లోని గాలి నాణ్యతను కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యమని నిపుణులు చెప్తున్నారు. ఇంట్లో తేమను నియంత్రించడం, సరైన వెంటిలేషన్ ఉండేలా చూసుకోవడం, బూజు కనిపిస్తే వెంటనే చర్యలు తీసుకోవడం ద్వారా శ్వాసకోశ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
Also Read : వరద నీరు తగ్గిన తర్వాత ఇంటిని ఎలా శుభ్రం చేయాలి? తప్పనిసరిగా పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే
గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















