SmartEd Conclave 2026: వంట గది పాఠాలతో కోడింగ్ విప్లవం - 18 ఏళ్ల విజ్ కిడ్ ఆర్యమాన్ సరికొత్త ప్రయోగం!
SmartEd Conclave 2026 Aryaman Maheshwari: స్మార్ట్ ఎడ్ కాంక్లేవ్లో ఎంతో మంది విద్యావేత్తలు తమ అనుభవాలను పంచుకున్నారు. విజ్ కిడ్గా గుర్తింపు పొందిన ఆర్యమన్ మహేశ్వరి వారిలో చాలా ప్రత్యేకం.

Aryaman Maheshwari Coding Revolution with Kitchen Lessons: సాధారణంగా 18 ఏళ్ల వయసులో యువత తమ పైచదువులు లేదా కెరీర్ గురించి ఆలోచనల్లో ఉంటారు. కానీ, ఆర్యమాన్ మహేశ్వరి మాత్రం తన భవిష్యత్తుతో పాటు తెలంగాణలోని వేలాది మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల భవిష్యత్తును మార్చే పనిలో నిమగ్నమయ్యాడు. కోడర్, విద్యావేత్త, ఛేంజ్ మేకర్గా గుర్తింపు పొందిన ఆర్యమాన్ మహేశ్వరి, సాంకేతికతను సామాన్యుడికి చేరువ చేస్తూ విద్యా రంగంలో సరికొత్త ప్రయోగాలు చేస్తున్నాడు. 'ఏబీపీ దేశం స్మార్ట్ ఎడ్ కాంక్లేవ్ 2026'లో పాల్గొన్న ఆయన, తన వినూత్న ఆలోచనలను పంచుకున్నారు.
వంట గది ఉదాహరణలతో కంప్యూటర్ విద్య
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ విద్యను అందించడానికి ఆర్యమాన్ స్మార్ట్ భారత్ అనే ప్రాజెక్ట్ను ప్రారంభించాడు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు ఉన్నప్పటికీ, వాటిని బోధించడానికి సరైన ఉపాధ్యాయులు లేకపోవడాన్ని గమనించిన ఆయన, ఒక వినూత్న పద్ధతిని ఎంచుకున్నాడు. కంప్యూటర్ సైన్స్ వంటి క్లిష్టమైన సబ్జెక్టును వంట గది ఉదాహరణల ద్వారా బోధిస్తున్నాడు. వంట చేసే ప్రక్రియకు, కోడింగ్కు మధ్య ఉన్న సారూప్యతలను వాడుతూ ఆయన రూపొందించిన వీడియోలు విద్యార్థులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తనకు తెలుగు రాకపోయినప్పటికీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో తన గొంతును ఖచ్చితమైన తెలుగులోకి మార్చి పాఠాలు చెబుతుండటం విశేషం. ప్రస్తుతం తెలంగాణలోని 21 మోడల్ స్కూళ్లలో ఈ ప్రాజెక్ట్ విజయవంతంగా నడుస్తోంది.
యువ మేధావుల కోసం బిల్డర్ గ్రూప్
ఆర్యమాన్ ఎనిమిదో తరగతిలోనే బిల్డర్ గ్రూప్ అనే అంతర్జాతీయ కమ్యూనిటీని స్థాపించాడు. ప్రస్తుతం ఇందులో 100 దేశాలకు చెందిన 6,000 మందికి పైగా యువ టెక్నాలజిస్టులు సభ్యులుగా ఉన్నారు. సంప్రదాయ విద్యా విధానం విద్యార్థుల సృజనాత్మకతను అణచివేస్తోందని భావించిన ఆయన, విద్యార్థులు తమకు నచ్చిన రంగాల్లో ప్రయోగాలు చేయడానికి ఈ వేదికను సృష్టించాడు. దీనికి ఉదాహరణగా, కేరళకు చెందిన ఒక 14 ఏళ్ల బాలుడు ఈ గ్రూప్ ద్వారా లభించిన ప్రోత్సాహంతో తన స్టార్టప్ను ప్రతిష్టాత్మక వై కాంబినేటర్ లో చేర్చగలిగాడని ఆర్యమాన్ గర్వంగా చెప్పారు.
ఏకాగ్రతను కొలిచే న్యూరో విజన్
ఆర్యమాన్ రూపొందించిన మరో అద్భుతమైన ఆవిష్కరణ న్యూరో విజన్ . ఇది తరగతి గదుల్లో అమర్చగలిగే ఒక ఏఐ కెమెరా మోడల్. ఇది విద్యార్థుల వ్యక్తిగత వివరాలను సేకరించకుండా , పాఠం జరుగుతున్నప్పుడు తరగతి మొత్తం ఎంత ఏకాగ్రతతో ఉందో విశ్లేషిస్తుంది. పాఠం చెప్పే సమయంలో ఏ ఏ పాయింట్ల వద్ద విద్యార్థుల ఏకాగ్రత పెరిగింది, ఎక్కడ తగ్గింది అనే విషయాలను ఇది ఉపాధ్యాయులకు గ్రాఫ్ రూపంలో చూపిస్తుంది. కేవలం పరీక్షల ఫలితాల ఆధారంగా కాకుండా, లైవ్ ఫీడ్బ్యాక్ ద్వారా బోధనా పద్ధతులను మెరుగుపరచడమే దీని ప్రధాన ఉద్దేశ్యం.
అమెరికా నుండి భారత్కు.. మార్పు దిశగా అడుగులు
అమెరికాలో పుట్టి పెరిగిన ఆర్యమాన్, తన 8వ ఏట భారతదేశానికి మారాడు. ఏడేళ్ల వయసులోనే ఒక రెస్టారెంట్ను నిర్వహించిన అనుభవం ఉన్న ఆయనకు, ఇక్కడి విద్యా విధానంలోని బట్టీ పద్ధతి ఆశ్చర్యానికి గురి చేసింది. అందుకే ఏఐ యుగంలో విద్యార్థులు కేవలం కాపీ-పేస్ట్ చేయడం కాకుండా, విమర్శనాత్మక ఆలోచనను పెంపొందించుకోవాలని ఆయన సూచిస్తున్నారు. పాఠశాలల్లో కేవలం ఎనిమిది సబ్జెక్టులకే పరిమితం కాకుండా, బయోటెక్నాలజీ లేదా రోబోటిక్స్ వంటి నచ్చిన రంగాల్లో పరిశోధన చేసే స్వేచ్ఛ ఉండాలని ఆయన బలంగా వివరించారు.
విద్యార్థులకు స్ఫూర్తిదాయక సూచనలు
యువతకు ఆర్యమాన్ ఇచ్చే సలహా ఒక్కటే. అందరితో మాట్లాడండి, నెట్వర్కింగ్ పెంచుకోండి. విద్యా వ్యవస్థ మన కోసం ఒక ఆదర్శవంతమైన వాతావరణాన్ని సృష్టించే వరకు వేచి చూడకుండా, మనమే అవకాశాలను సృష్టించుకోవాలిలని సలహా ఇస్తున్నారు. చిన్న వయసులోనే సాంకేతికత ద్వారా సామాజిక మార్పును తీసుకువస్తున్న ఆర్యమాన్ కృషి, తెలంగాణ ప్రభుత్వం, వివిధ స్వచ్ఛంద సంస్థల సహకారంతో భవిష్యత్తులో దేశవ్యాప్తంగా విస్తరించాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు.
ఏబీపీ దేశం స్మార్ట్ ఎడ్ కాంక్లేవ్లో ఆర్యమన్ మహేశ్వరి పూర్తి చర్చ ఈ లింక్లో చూడవచ్చు
Before You Go
MLC Kavitha on Dress Sense : హైదరాబాద్ సెయింట్ ఫ్రాన్సిస్ మహిళాకళాశాలలో కవిత
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















