ABP Desam Smart Ed Conclave 2026: స్కిల్ ఉంటే ప్రపంచం నీ జేబులో ఉన్నట్టే: ABP Desam Smart Ed Conclave 2026లో నెక్ట్స్ వేవ్ సీఈవో రాహుల్!
ABP Desam Smart Ed Conclave 2026: వేగంగా మారుతున్న సాంకేతికతను క్యాచ్ చేస్తూ స్కిల్ పెంచుకున్న వాళ్లకే ఎక్కువ అవకాశాలు ఉంటాయని నెక్ట్స్ వేవ్ సీఈవో, సహ వ్యవస్థాపకుడు రాహుల్ అత్తులూరి అభిప్రాయపడ్డారు.

ABP Desam Smart Ed Conclave 2026: నేటి ఆధునిక విద్యా వ్యవస్థ కేవలం తరగతి గదులకే పరిమితం కాకుండా, కెరీర్ ఎదుగుదల, పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా సిద్ధం చేయడం, వాస్తవిక ప్రపంచంలో విజయం సాధించడంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని నెక్ట్స్ వేవ్ సీఈవో, సహ వ్యవస్థాపకుడు రాహుల్ అత్తులూరి స్పష్టం చేశారు. ఏబీపీ దేశం స్మార్ట్ ఎడ్ కాంక్లేవ్2026 వేదికగా జరిగిన చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని మారుతున్న సాంకేతిక ప్రపంచంలో విద్యార్థులు, ముఖ్యంగా టైర్ 2, 3 పట్టణాల విద్యార్థులు ఎదుర్కొంటున్న సవాళ్లు, అవకాశాలపై విశ్లేషణాత్మక ప్రసంగం చేశారు.
నిరుద్యోగం నుంచి ఎంఎస్సీ కొలువుల వరకు
రాహుల్ తన నేపథ్యాన్ని వివరిస్తూ ఐఐటీ హైదరాబాద్లో కంప్యూర్ సైన్స్ పూర్తి చేసిన తర్వాత పారిశ్రామికవేత్తగా మారాలనే లక్ష్యంతో అమెజాన్ వంటి దిగ్గజ సంస్థల్లో సాఫ్ట్వేర్ డెవలపర్గా పని చేశారు. తన సొంత సైబర్ సెక్యూరిటీ స్టార్టప్ కోసం సాఫ్ట్వేర్ ఇంజనీర్లను నియమించుకోవాల్సిన సమయంలో, టైర్ 2, టైర్ 3 కాలేజీల్లోని విద్యార్థుల నైపుణ్యాలకు, ఐఐటీ/ట్రిపుల్ ఐటీ విద్యార్థుల నైపుణ్యాలకు మధ్య ఉన్న భారీ వ్యత్యాసాన్ని ఆయన గమనించారు.
కేవలం ఆరు నుంచి 8 నెలల సరైన శిక్షణ ఇస్తే, నిరుద్యోగులుగా ఉన్న ఈ విద్యార్థులను అగ్రశ్రేణి ఎంఎన్సీ ఉద్యోగాలకు అర్హులుగా మార్చవచ్చని ఆయన నిరూపించారు. ఈ అనుభవమే నెక్ట్స్ వేవ్ స్థాపనకు పునాది వేసింది. నేడు వేలాది మంది విద్యార్థులను నైపుణ్యం కలిగిన సాఫ్ట్వేర్ ప్రొఫెనల్స్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ ఆన్లైన్ లెర్నింగ్ ఎకోసిస్టమ్ పని చేస్తోందని ఆయన వివరించారు.
ఐఐటీ భ్రమల నుంచి బయటకు రావాలి
భారత్లో విద్యార్థులు, తల్లిదండ్రులు ఒక రకమైన బైనరీ ఆలోచనా విధానంలో ఉన్నారని రాహుల్ అభిప్రాయపడ్డారు. అంటే ఐఐటీలో సీటు వస్తేనే భవిష్యత్ ఉంటుందని లేకుంటే అన్ని డోర్స్ క్లోజ్ అయినట్టు భావించడం తప్పు అని పేర్కొన్నారు. ఐఐటీలు మంచివే అయినప్పటికీ అక్కడ సీటు రాని విద్యార్థులకు కూడా అపారమైన ప్రతిభ ఉంటుందని, ఆ ప్రతిభను గుర్తించి సరైన మార్గంలో పెడితే అద్భుతాలు సృష్టించవచ్చని ఆయన నొక్కి చెప్పారు. నేడు సాంకేతికత అందుబాటులో ఉన్నందున ఎక్క ఉన్నా ప్రపంచ స్థాయి అప్లికేషన్లను రూపొందించవచ్చని, మొబైల్ ఫోన్ ద్వారానే ప్రపంచంతో అనుసంధానం కావచ్చని ఆయన విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపారు.
ఏఐ యుగంలో కోడింగ్ ప్రాధాన్యత
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోడ్ను రాస్తున్నప్పుడు విద్యార్థులు ఇంకా ప్రోగ్రామింగ్ నేర్చుకోవాల్సిన అవసరం ఉందా అనే ప్రశ్నకు రాహుల్ ఆసక్తికరమైన సమాధానం చెప్పారు. దీనిని ఆయన శారీరక దృఢత్వంతో పోల్చారు. మనం నిత్యం వేల కిలోమీటర్లు నడవాల్సిన అవసరం లేకపోయినా, బరువులు ఎత్తాల్సిన పని లేకపోయినా జిమ్కు ఎందుకు వెళ్తాం. కేవలం శారీరక దృఢత్వం కోసం. అలాగే ఏఐ అందుబాటులో ఉన్నా ప్రోగ్రామింగ్ నేర్చుకోవడం అనేది మెదడుకు ఒక వ్యాయామం వంటిందని అన్నారు.
ప్రోగ్రామింగ్ నేర్చుకోవడం వల్ల సమస్య పరిష్కార నైపుణ్యం, విశ్లేషణాత్మక ఆలోచన, ఒక సమస్యను చిన్న భాగాలుగా విభజించి పరిష్కరించే మెటా స్కిల్స్ అలవడతాయని ఆయన తెలిపారు. భవిష్యత్లో విద్యార్థులు నేరుగా కోడ్ రాయకపోయినా, ఏఐని సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి ఈ ప్రాథమిక జ్ఞానం తప్పనిసరి అని ఆయన స్పష్టం చేశారు.
విద్యలో మార్పు రావాలి
ప్రస్తుత విద్యా విధానంలో ఉన్న రోట్ లెర్నింగ్పై రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం సమాచారాన్ని గుర్తుంచుకుని పరీక్షల్లో రాయడం వల్ల ప్రయోజనం లేదని ఎందుకంటే సమాచారం , ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఏఐ రూపంలో అందరికీ అందుబాటులో ఉన్నాయని ఆయన అన్నారు.
కరికులమ్ అనేది విద్యార్థులను బిల్డర్స్గా, సమస్య పరిష్కర్తలుగా మార్చే విధంగా ఉండాలని ఆయన సూచించారు. మన దేశంలో ఉన్న అనేక సవాళ్లను అవకాశాలుగా మార్చుకొని, సాంకేతికతను ఒక ఆయుధంగా వాడుతూ పరిష్కార మార్గాలను అన్వేషించేలా విద్యార్థులను ప్రోత్సహించాలని ఆయన కోరారు.
భవిష్య్లో గిగ్ ఎకానమీ విప్లవం
వచ్చే ఐదేళ్లలో ఉద్యోగాల స్వరూపం పూర్తిగా మారిపోనుందని రాహుల్ అంచనా వేశారు. సాంప్రదాయ నెలసరి జీతాల కంటే గిగ్ ఎకానమీ ప్రాధాన్యత పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. నాలెడ్జ్ వర్క్ కూడా గిగ్ ఎకానమీలోకి మారుతుందని, వ్యక్తులు తమ నైపుణ్యాల ఆధారంగా నిర్ధిష్ట పనులను పూర్తి చేస్తూ దాయం పొందే రోజులు వస్తాయని ఆయన వివరించారు. భవిష్యత్లో కంపెనీలు డిగ్రీ కంటే అభ్యర్థి చూపే ఫలితాలు, నైపుణ్యాల ఆధారంగానే పనులను అప్పగిస్తాయని ఆయన స్పష్టం చేశారు.
2030 నాటికి సిద్ధంగా ఉండాలంటే...
ప్రస్తుత తరం విద్యార్థులు తమ కెరీర్ కాలంలో కనీసం ఏడు రకాల విభిన్న వృత్తులను మార్చే అవకాశం ఉందని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ రిపోర్ట్ చెబుతున్నట్టు రాహుల్ వెల్లడించారు. అందుకే కేవలం ఒక నైపుణ్యాన్ని నేర్చుకోవడం కంటే నేర్చుకోవడం ఎలాగో నేర్చుకోవడం అనేది కీలకమని చెప్పారు. కొత్త విషయాలు నేర్చుకునేటప్పుడు కలిగే ఇబ్బందులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. సాంకేతికతను చూసి భయపడకుండా దాన్ని ఎలా అన్వయించాలో నేర్చుకోవాలి. విద్య అనేది డిగ్రీతో ముగిసేది కాదు, అది జీవితాంతం కొనసాగే ప్రక్రియ అని గుర్తించాలి. సమస్యలను గుర్తించి, పరిష్కారాలను నిర్మించి, సోషల్ మీడియా వంటి ప్లాట్ఫామ్ ద్వారా వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
రాహుల్ చెప్పిన విషయాలు విద్యార్థులకు కేవలం ఒక దిశానిర్దేశం చేయడమే కాదు మారుతున్న ప్రపంచంలో నిలదొక్కుకోవడానికి అవసరమైన రోడ్ మ్యాప్ను అందించింది.
ట్రెండింగ్ వార్తలు





















