ABP Desam Smart Ed Conclave 2026: AI యుగంలో డిగ్రీలు ఉంటే సరిపోవు! స్కిల్ ఉన్నోడికే గుర్తింపు! ABP Desam Smart Ed Conclave 2026లో నిపుణుల సూచన!
ABP Desam Smart Ed Conclave 2026: డిగ్రీలకు మించిన నైపుణ్యాలు, సాంకేతికతతో కూడిన నైతికతను పరిశ్రమ కోరుకుంటోందని భవిష్యత్ సవాళ్లను ఎదుర్కోవడానికి విద్యార్థులు సిద్ధపడాలని విద్యా నిపుణుల సూచిస్తున్నారు.

ABP Desam Smart Ed Conclave 2026: సాంకేతిక పరిజ్ఞానం శరవేగంగా దూసుకుపోతున్న తరుణంలో, భారతీయ విద్యావ్యవస్థ ఒక చారిత్రాత్మక మలుపులో ఉంది. కేవలం పుస్తక జ్ఞానం, పరీక్షలు, డిగ్రీలకే పరిమితమైన పాత కాలపు విద్యావిధానం నేడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ధాటికి తన ఉనికి చాటుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో ఏబీపీ దేశం స్మార్ట్ ఎడ్ కాంక్లేవ్ 2026(ABP Desam Smart Ed Conclave 2026) వేదికగా ప్రముఖ విద్యావేత్తలు, నిపుణులు చేసిన చర్చలు భవిష్యత్ విద్యపై సరికొత్త దిశానిర్దేశం చేశాయి.
డిగ్రీ కేవలం ఎంట్రీ టికెట్ మాత్రమే!
ఒకప్పుడు డిగ్రీ ఉంటే ఉద్యోగం గ్యారంటీ అనే నమ్మకం ఉండేది. కానీ 2026 నాటికి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ డైరెక్టర్ డాక్టర్ భరత్ భూషణ్ సింగ్ అభిప్రాయం ప్రకారం, ఒకప్పుడు తెలుసుకోవడం(Knowing), విద్యాభ్యాసంగా ఉండేది.కానీ నేడు చేయడం(Doing) మాత్రమే అసలైన విద్య సమాచారాన్ని నిక్షిప్తం చేసుకునే పనిని ఇప్పుడు చాట్ జీపీటీ వంటి టూల్స్ చేస్తున్నాయని, కాబట్టి విద్యార్థులు ఆ సమాచారాన్ని ఎలా ఉపయోగించాలో నేర్చుకోవాలని ఆయన సూచించారు.
కేఎల్ యూనివర్సిటీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కోటేశ్వరరావు మాట్లాడుతూ... పరిశ్రమలు ఇప్పుడు స్కిల్ ఆధారంగానే నడుస్తున్నాయని, డిగ్రీ అనేది కేవలం పరిశ్రమలోకి ప్రవేశించడానికి ఒక ఎంట్రీ టికెట్ మాత్రమేనని పేర్కొన్నారు. గూగుల్, ఆపిల్, మెటా వంటి దిగ్గజ సంస్థలు ఇప్పుడు అభ్యర్థి స్కిల్ను, అనుభవాన్ని చూస్తున్నాయే తప్ప డిగ్రీ పట్టాలను కాదని ఎంఎస్ ఎడ్యుకేషన్ అకాడమీ డైరెక్టర్ సయ్యద్ హమీద్ వెల్లడించారు.
విలువలు లేని నైపుణ్యం వ్యర్థం
డాక్టర్ భరత్ భూషణ్ సింగ్ ఆసక్తికరమైన ఉదాహరణతో వివరించారు. విద్యను ఒక పిజ్జాతో పోలిస్తే మానవ విలువలు, సంస్కారం అనేవి బేస్ అని, స్కిల్ అనేది పైన వేసిన టాపింగ్స్ లాంటిదన్నారు. బేస్ సరిగా లేకపోతే టాపింగ్స్ ఎంత బాగున్నా ప్రయోజనం ఉందన్నారు. కాలేజీలో గడిపే మూడు నాలుగు ఏళ్లలో విద్యార్థులు జట్టుగా పని చేయడం ఇంటిగ్రిటీ, ఇతరుల పట్ల గౌరవంగా ప్రవర్తించడం వంటి మౌలిక విలువలను నేర్చుకోవాలని ఆయన హితవు పలికారు.
ఏఐతో పోటీ పడొద్దు
ఏఐ అనేది మన ఉద్యోగాలను లాగేసుకోవడానికి రాలేదని, అది మన పనిని పది నుంచి 30 రెట్లు వేగవంతం చేసే ఒక సహాయకారి అని నిపుణులు అభిప్రాయపడ్డారు. గతంలో రీసెర్చ్ పేపర్ రాయడానికి ఒకటిన్నర ఏళ్లు పట్టేదని ఇప్పుడు AI సహాయంతో కేవలం ఒక నెలలోనే పూర్తి చేయవచ్చని డాక్టర్ భరత్ భూషణ్ తెలిపారు.
పాఠశాల స్థాయిలో కూడా మార్పులు మొదలయ్యాయి. సీబీఎస్ఈ ఇప్పటికే AIని ఒక అదనపు సబ్జెక్ట్గా ప్రవేశపెట్టిందని, విద్యార్థులు కోబోట్ వంటి సెన్సార్లతో కూడిన రోబోల ద్వారా బోధన అందుతోందని సయ్యద్ హమీద్ వివరించారు. ఇవి విద్యార్థులకు భయం కలిగించకుండా స్నేహపూర్వక వాతావరణంలో నేర్చుకోవడానికి తోడ్పడతాయి.
తెలంగాణ దేశానికే విద్యా హబ్
విద్య, నైపుణ్యాల విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలుస్తోందని చర్చలో వెల్లడైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో గచ్చిబౌలి వేదికగా యంగ్ స్కిల్ ఇండియా యూనివర్శిటీని అత్యంత వేగంగా అందుబాటులోకి తీసుకురావడం ఒక గొప్ప పరిణామమని నిపుణులు కొనియాడారు. మౌలిక సదుపాయాల కోసం వేచి చూడకుండా, ఉన్న వనరులలో నైపుణ్య శిక్షణన ప్రారంభించడం ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనమని డాక్టర్ భరత్ భూషణ్ పేర్కొన్నారు.
బోధనా పద్ధతుల్లో మార్పు రావాలి
కేవలం సిలబస్ మార్చడమే కాకుండా, బోధించే అధ్యాపకులకు కూడా శిక్షణ ఇవ్వడం అత్యంత అవసరమని ప్రొఫెసర్ కోటేశ్వరరావు అన్నారు. పరిశ్రమల్లో 15-20 ఏళ్ల అనుభవం ఉన్న నిపుణులను ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ గా ఆహ్వానించి వారి ద్వారా విద్యార్థులకు, అధ్యాపకులకు శిక్షణ ఇప్పించడం వల్ల విద్యాసంస్థలు ఆధునిక అవసరాలకు అనుగుణంగా మారుతాయని ఆయన సూచించారు.
ఏఐ వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో, అన్ని ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయని నిపుణులు హెచ్చరించారు. ముఖ్యంగా ఫేస్ రికగ్నిషన్ ద్వారా డేటా దొంగిలించడం, ఆర్థిక మోసాలకు పాల్పడటం వంటి ఘటనలు పెరుగుతున్నాయని సయ్యద్ హమీద్ ఆందోళన వ్యక్తం చేశారు. సాంకేతికతను సామాజిక సమస్యల పరిష్కారానికి, ముఖ్యంగా వ్యవసాయం, వైద్యం వంటి రంగాల్లో బాధ్యతాయుతంగా ఉపయోగించాలని ఆయన విద్యార్థులకు సూచించారు.
జీవితం ఒక మారథాన్
నేటి తరం విద్యార్థులు అత్యంత వేగంగా ఫలితాలను ఆశిస్తున్నారని,కానీ విజయం సాధించాలంటే ఓర్పు చాలా అవసరం అని డాక్టర్ భరత్ భూషణ్ సింగ్ హితవు పలికారు. జీవితం అనేది ఒక మారథాన్ , వంద మీటర్లు పరుగు పందె కాదని, లక్ష్యం వైపు స్థిరంగా ఓర్పుతో సాగితేనే శాశ్వత విజయం లభిస్తుందని విద్యార్థులకు సందేశం ఇచ్చారు.
2026 విద్యాసంవత్సం డిగ్రీలకు మించిన నైపుణ్యాలను, సాంకేతికతతో కూడిన నైతికతను కోరుకుంటోంది. భవిష్యత్ సవాళ్లను ఎదుర్కోవడానికి విద్యార్థులు నిరంతరం నేర్చుకునే తత్వాన్ని అలవరచుకోవడమే ఏకైక మార్గం.























