ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రాజెక్టులకు విఘాతం కలిగించేలా కుట్రలు చేస్తుంటే రేవంత్ రెడ్డి స్పందించడం లేదని హరీష్ రావు ఆరోపించారు. ఆయన చంద్రబాబు నాయుడి పట్ల అభిమానంతో గురుదక్షిణ చెల్లిస్తున్నారని ప్రశ్నించారు.
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
తెలంగాణ ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలనే ఏపీ ప్రతిపాదనను జీఆర్ఎంబీ అజెండాలో పెట్టడంపై హరీశ్ రావు మండిపడ్డారు. నీటి హక్కులను తాకట్టుపెడుతూ రేవంత్ రెడ్డి మౌనంగా ఉన్నారని విమర్శించారు.

- బిఆర్ఎస్ హరీష్ రావు, తెలంగాణ ప్రాజెక్టులకు నష్టంపై మండిపడ్డారు.
- కేంద్రం ఆమోదించిన ఏడు ప్రాజెక్టులు రద్దుకు ఏపీ ప్రతిపాదన.
- ఏపీ అధికారులు తెలంగాణ నీటిపారుదల శాఖలో కీలకంగా ఉన్నారని ఆరోపణ.
- సీఎం రేవంత్ రెడ్డి మౌనం వీడి స్పష్టత ఇవ్వాలని డిమాండ్.
GRMB Meeting Agenda | హైదరాబాద్: తెలంగాణ ప్రాజెక్టులకు, నీటి ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుట్రలు చేస్తుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఉంటే ఏపీ ప్రభుత్వం ఇంత ధైర్యం చేసేదా అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు పట్ల ఉన్న అభిమానంతోనే రేవంత్ రెడ్డి ఈ రకంగా గురుదక్షిణ చెల్లిస్తున్నారా అని ఆయన ప్రశ్నించారు. ఈ నెల 18న జరగబోయే గోదావరి నదీ యాజమాన్య బోర్డు (GRMB) సమావేశపు అజెండాను పరిశీలిస్తే, అది కేవలం ఏపీ ప్రయోజనాల కోసమే సిద్ధం చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. అజెండా వచ్చి వారం రోజులు గడుస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం సోయి లేకపోవడం దారుణం, తెలంగాణ భవిష్యత్తును ఆగం చేసేలా ఈ ఎజెండా ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి ఎందుకు నోరు మెదపడం లేదని మండిపడ్డారు. తెలంగాణ నీటి అవసరాలను కాలరాస్తూ, ఆంధ్రాకు నీళ్లను తాకట్టు పెట్టేలా వ్యవహరించడం వెనుక రేవంత్ రెడ్డి మౌనానికి తెలంగాణ ఆత్మగౌరవం లేకపోవడమే కారణమా అని ఆయన నిలదీశారు.
కేంద్ర ప్రభుత్వం పెద్దదా లేక జీఆర్ఎంబీ పెద్దదా అని ప్రశ్నించిన హరీష్ రావు, కుక్క తోకను ఆడిస్తుందా లేక తోక కుక్కను ఆడిస్తుందా ? అని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని అనుమతులు మంజూరు చేసిన తెలంగాణలోని 7 ప్రాజెక్టుల అనుమతులపై పునఃసమీక్ష (రివ్యూ) జరపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించగానే, దాన్ని జీఆర్ఎంబీ తన సమావేశపు అజెండాలో చేర్చడం దేశ చరిత్రలోనే మొదటిసారి అని అన్నారు. ఇలాంటి అనుచిత ప్రతిపాదనలు అజెండాలోకి వస్తున్నప్పుడు జీఆర్ఎంబీలో ఉన్న తెలంగాణ ఇంజనీర్లు ఎందుకు మౌనంగా ఉన్నారని, వారికి రేవంత్ రెడ్డి పరోక్షంగా సహకరిస్తున్నారా అని హరీష్ రావు ప్రశ్నించారు.
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా...
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంత ధైర్యం చేసేది కాదని, కానీ ఇప్పుడు ఆంధ్రా బంటు ఇక్కడ సీఎంగా ఉన్నారు కాబట్టే వారికి ఇంత ధైర్యం వచ్చిందని హరీష్ రావు ఆరోపించారు. ఆంధ్రా బంటు ఇక్కడ ఉన్నారనే ధైర్యంతోనే జీఆర్ఎంబీ అజెండాలో తెలంగాణ ప్రాజెక్టులకు గతంలో ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలనే ప్రతిపాదనను చేర్చారని ఆయన విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ కేడర్కు చెందిన ఒక అధికారి కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తుండగా, గతంలో ఏపీ చీఫ్ సెక్రటరీగా పనిచేసిన అధికారి ప్రస్తుతం తెలంగాణలో నీటిపారుదల శాఖ సలహాదారుగా ఉన్నారని గుర్తుచేశారు. అంతేకాకుండా, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వద్ద ఆంధ్రప్రదేశ్కు చెందిన అధికారే సలహాదారుగా ఉన్నారని, తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీగా కూడా ఆంధ్రా కేడర్ అధికారే పనిచేస్తున్నారని హరీష్ రావు పేర్కొన్నారు.
తెలంగాణ ప్రజల నోటికాడ కూడు లాక్కుంటున్న చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు మాటలకు, చేతలకు ఎక్కడా పొంతన లేదని, కేంద్ర ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని తెలంగాణ ప్రజల నోటికాడి బుక్కను లాక్కోవాలని చూస్తున్నారని హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గతంలో టీవీల ముందు నిలబడి తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోమని, గోదావరి ప్రాజెక్టులకు తాము వ్యతిరేకం కాదని చెప్పిన చంద్రబాబు, ఇప్పుడు కేంద్రానికి వరుసగా లేఖలు ఎందుకు రాస్తున్నారని ప్రశ్నించారు. గోదావరి నదీ యాజమాన్య బోర్డు (GRMB) సమావేశపు అజెండాలో తెలంగాణ ప్రాజెక్టులకు గతంలో ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపడం వెనుక పెద్ద కుట్ర ఉందన్నారు. తెలంగాణను ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేసి సాధించుకున్నామని, నీళ్ల కోసమే ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చుకున్నామని గుర్తుచేశారు. ఆ నీళ్ల విషయంలోనే తెలంగాణకు అన్యాయం జరిగితే ఇక్కడి ప్రజలు ఎంతమాత్రం ఊరుకోరని హెచ్చరించారు.
తెలంగాణ ప్రాజెక్టులు రద్దు చేయాలని ఏపీ కుట్ర..
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఎంతో శ్రమించి కాళేశ్వరం, సీతారామతో సహా 7 కీలక ప్రాజెక్టులకు అనుమతులు సాధిస్తే, ఇప్పుడు ఆ అనుమతులన్నింటినీ రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ ధైర్యంతో ప్రతిపాదనలు చేసిందో చెప్పాలని నిలదీశారు. తెలంగాణకు ఇచ్చిన అనుమతులను రద్దు చేసి, ఇక్కడి రైతుల నోటికాడ ముక్కను లాక్కోవాలని ఏపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని మండిపడ్డారు. బోర్డులో రెండు రాష్ట్రాల ఇంజనీర్లు ఉంటారని, జీఆర్ఎంబీలో ఇలాంటి తెలంగాణ వ్యతిరేక ఎజెండా తయారవుతుంటే ఇక్కడి ఇంజనీర్లు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఒకవేళ అధికారులే ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినా, ఆయన పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారా అని అనుమానం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ కాలంలో ఒక్క కొత్త ప్రాజెక్టుకు కూడా అనుమతులు తీసుకురాకపోగా, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన అనుమతులు రద్దయ్యే పరిస్థితి తెచ్చారని విమర్శించారు. నేడు ఖమ్మం జిల్లాకు సీతారామ ప్రాజెక్టు నీళ్లు వస్తున్నాయంటే అది ఆనాడు కేసీఆర్ చేసిన కృషి ఫలితమేనని స్పష్టం చేశారు.
అలాగే 47 టీఎంసీల సామర్థ్యం కలిగిన సమ్మక్క సారక్క సాగర్ ప్రాజెక్టును ఏపీ ప్రయోజనాల కోసం సీఎం రేవంత్ రెడ్డి వదులుకోవడానికి సిద్ధపడ్డారా అని హరీష్ రావు సూటిగా ప్రశ్నించారు. బెంగళూరు వేదికగా కర్ణాటక, తెలంగాణ నాయకులు కలిసినప్పుడు దీనిపై ఏమైనా ఒప్పందం కుదిరిందా అని అనుమానం వ్యక్తం చేశారు. బిఆర్ఎస్ హయాంలోనే సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు అవసరమైన అన్ని అనుమతులు తీసుకువచ్చామని, ఈ నీళ్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత నియోజకవర్గానికి కూడా ఉపయోగపడతాయని గుర్తుచేశారు. అలాంటప్పుడు ఈ 47 టీఎంసీల నీటి కేటాయింపులను ఇచ్చేది లేదని జీఆర్ఎంబీ అజెండాలో ఏపీ ప్రభుత్వం పేర్కొంటుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ఎలా వదులుకుంటుందని మండిపడ్డారు. ఈ తీవ్రమైన అంశంపై తెలంగాణ ప్రభుత్వ అధికారిక స్టాండ్ ఏంటో స్పష్టం చేయాలని, సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా నోరు విప్పి మౌనానికి గల కారణాలను ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
Frequently Asked Questions
తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి మౌనంపై హరీష్ రావు ఎందుకు విమర్శలు చేశారు?
గోదావరి నదీ యాజమాన్య బోర్డు (GRMB) సమావేశపు అజెండాపై హరీష్ రావు అభ్యంతరం ఏమిటి?
మే 18న జరిగే జీఆర్ఎంబీ సమావేశపు అజెండా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసమే సిద్ధం చేశారని హరీష్ రావు అన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా ఈ అజెండా ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.
తెలంగాణలోని ఏ ప్రాజెక్టుల అనుమతులను పునఃసమీక్షించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించింది?
కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిన తెలంగాణలోని 7 ప్రాజెక్టుల అనుమతులను పునఃసమీక్షించాలని ఏపీ ప్రభుత్వం జీఆర్ఎంబీకి ప్రతిపాదించింది. ఇది దేశ చరిత్రలోనే మొదటిసారి అని హరీష్ రావు పేర్కొన్నారు.
ఏ ప్రాజెక్టుకు సంబంధించిన నీటి కేటాయింపులను సీఎం రేవంత్ రెడ్డి వదులుకోవడానికి సిద్ధపడ్డారని హరీష్ రావు ప్రశ్నించారు?
47 టీఎంసీల సామర్థ్యం కలిగిన సమ్మక్క సారక్క సాగర్ ప్రాజెక్టు నీటి కేటాయింపులను ఏపీ ప్రయోజనాల కోసం రేవంత్ రెడ్డి వదులుకోవడానికి సిద్ధపడ్డారా అని హరీష్ రావు సూటిగా ప్రశ్నించారు.
ట్రెండింగ్ వార్తలు























