కలుషిత E20 ఇంధనంతో జాగ్రత్త! వెహికల్ ఓనర్లకు SIAM హెచ్చరిక - కేంద్రం కీలక ఆదేశాలు
E20 పెట్రోల్లో క్లోరైడ్ & తేమ కలుషితం వల్ల ఫ్యూయల్ ఇంజెక్టర్లు, ఫ్యూయల్ పంపులు వంటి ఇంజిన్ భాగాలు దెబ్బతింటున్నాయని ఆటోమొబైల్ పరిశ్రమ ఆందోళన వ్యక్తం చేసింది.

E20 Fuel Contamination - Engine Issues: వాహనాల్లో E20 పెట్రోల్ వాడుతున్నవాళ్లకు అలెర్ట్. ఎథనాల్ మిశ్రమ పెట్రోల్లో అధిక స్థాయిలో క్లోరైడ్ & తేమ ఉండటం వల్ల ఇంజిన్లోని కీలక భాగాలు దెబ్బతింటున్నాయని ఆటోమొబైల్ పరిశ్రమ కేంద్ర ప్రభుత్వానికి తెలిపింది. ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్న కేంద్రం, దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో ఇంధన నాణ్యత తనిఖీలను మరింత కట్టుదిట్టం చేయాలని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలను ఆదేశించింది.
ఆటోమొబైల్ కంపెనీలు నిర్వహించిన పరిశీలనల్లో.. ఫ్యూయల్ ఇంజెక్టర్లు, ఫ్యూయల్ పంపులు & ఇంధనంతో నేరుగా సంబంధం ఉన్న ఇతర భాగాల మార్పిడి (రీప్లేస్మెంట్) గణనీయంగా పెరిగినట్లు గుర్తించారు. దెబ్బతిన్న భాగాలను పరిశీలించగా అధిక క్లోరైడ్ కారణంగా తుప్పు పట్టడం, అరిగిపోవడం ప్రధాన కారణంగా కనిపించినట్లు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి.
ఇంజిన్ పనితీరుపై ప్రభావం
నిపుణుల అంచనా ప్రకారం, క్లోరైడ్కు తేమ తోడైతే ఆమ్ల స్వభావం ఉన్న మిశ్రమం ఏర్పడుతుంది. ఇది ఫ్యూయల్ ఇంజెక్టర్ల వంటి అత్యంత సున్నితమైన భాగాలను దెబ్బతీస్తుంది. దీని ప్రభావం వెంటనే కనిపించడమే కాకుండా దీర్ఘకాలంలో కూడా ఇంజిన్ పనితీరుపై ప్రభావం చూపే అవకాశం ఉందని పరిశ్రమ హెచ్చరించింది.
వాహనాల ఫ్యూయల్ ట్యాంకుల నుంచి సేకరించిన కొన్ని నమూనాల్లో క్లోరైడ్ స్థాయి కిలోకు 500 మిల్లీగ్రాముల వరకు నమోదైంది. పెట్రోల్ బంకుల నుంచి తీసుకున్న నమూనాల్లో ఇది కిలోకు 350 మిల్లీగ్రాముల వరకు ఉన్నట్లు గుర్తించారు. మరికొన్ని పరిశీలనల్లో, కొన్ని కేంద్రాల్లో క్లోరైడ్ స్థాయి 300 పీపీఎం వరకు నమోదైనట్లు వెల్లడైంది. అయితే ఇది 10 పీపీఎం కంటే తక్కువగా ఉండాలని పరిశ్రమ సూచిస్తోంది.
ఇది కూడా చదవండి: బీమా లేని వాహనాలకు పెట్రోల్ బంకుల్లో నో పెట్రోల్, భారీ జరిమానాలు! కేంద్రానికి సుప్రీంకోర్టు సంచలన ప్రతిపాదన!
కేవలం క్లోరైడ్ మాత్రమే కాదు, తేమ కూడా ఆందోళన కలిగిస్తోంది. కొన్ని నమూనాల్లో నీటి పరిమాణం కిలోకు 10 వేల మిల్లీగ్రాములకు మించి నమోదైంది. మరికొన్ని పరీక్షల్లో 7 వేల మిల్లీగ్రాముల వరకు తేమ ఉన్నట్లు గుర్తించారు. అనుమతించిన పరిమితి మాత్రం 3 వేల మిల్లీగ్రాములు మాత్రమే. అధిక తేమ వల్ల.. ఎథనాల్ & నీటి మిశ్రమం ఫ్యూయల్ ట్యాంక్ అడుగుభాగంలో చేరే ప్రమాదం ఉంది. అది ఇంజిన్లోకి వెళ్లితే ఇంజిన్ పెర్ఫార్మెన్స్ తగ్గే ప్రమాదం ఉంది.
పరిశ్రమ వర్గాల అంచనా ప్రకారం.. పాతబడిన ఇంధన నిల్వ ట్యాంకులు, పైప్లైన్లు, ఇంధన ట్యాంకర్లు & ఇతర రవాణా వ్యవస్థల ద్వారా ఈ కలుషిత మిశ్రమాలు ఇంధనంలోకి చేరే అవకాశం ఉంది. ఎథనాల్కు సహజంగానే తేమను ఎక్కువగా ఆకర్షించే గుణం ఉండటంతో ఈ సమస్య మరింత పెరుగుతోందని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి.
కొన్ని పెట్రోల్ బంకుల నిర్వాహకులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ముఖ్యంగా.. వర్షాకాలం & తీర ప్రాంతాల్లో పాత భూగర్భ ఇంధన నిల్వ ట్యాంకుల్లోకి తేమ చేరే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం దేశంలోని కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా ఉత్తర భారతంలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: ఈవీ ఛార్జింగ్లో కొత్త విప్లవం.. తెలంగాణలో ఇథనాల్ ఆధారిత ఛార్జర్ ప్రారంభం!
SIAM ప్రతిపాదనలు
ఈ నేపథ్యంలో సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (SIAM) కీలక ప్రతిపాదనలు చేసింది. వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించే E20 & E85 ఇంధనంలో క్లోరైడ్ పరిమితి కిలోకు ఒక మిల్లీగ్రాముకు లోపే ఉండాలని సూచించింది. అలాగే ఎథనాల్ మిశ్రమానికి ఉపయోగించే స్వచ్ఛమైన ఎథనాల్లో కిలోకు మూడు మిల్లీగ్రాముల కంటే తక్కువ క్లోరైడ్ ఉండాలని కోరింది. ఈ అంశంపై రెండేళ్లుగా ప్రతిపాదనలు చేస్తున్నప్పటికీ ఇంకా ప్రమాణాల్లో మార్పులు చేయలేదని అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఇటీవల మీడియాలో వచ్చిన వార్తలపైనా పెట్రోలియం & సహజ వాయువు మంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఇంధన నాణ్యతను ఇప్పటికే నిరంతరం పర్యవేక్షిస్తున్నామని వెల్లడించింది. 87 వేలకు పైగా పెట్రోల్ బంకుల్లో రోజుకు 8 నుంచి 12 సార్లు నీటి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. అలాగే 2 వేలకు పైగా నమూనాలను క్లోరైడ్ & సల్ఫైడ్ కోసం పరీక్షించామని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కేవలం రెండు చోట్ల మాత్రమే క్లోరైడ్ కలుషితం గుర్తించామని, ఆ బంకుల్లో ఇంధన విక్రయాలను వెంటనే నిలిపివేశామని స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఎక్కడైనా కలుషితం లేదా కల్తీ బయటపడితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్ని ఫాలో అవ్వండి.
ట్రెండింగ్ వార్తలు






















