YSRCP MLAs Disqualification: వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హత హెచ్చరికలు - బెదిరింపులేనా.. నిజంగా వేటు వేస్తారా?
YCP MLAs : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేల గైర్హాజరీ, దీనిపై స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి.

Disqualifying YCP MLAs: భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 190(4) ప్రకారం, ఒక శాసనసభ సభ్యుడు సభ అనుమతి లేకుండా వరుసగా 60 పని దినాల పాటు సమావేశాలకు గైర్హాజరైతే, సభ ఆ సభ్యుడి సీటును ఖాళీగా ప్రకటించవచ్చు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఇదే నిబంధనను ప్రస్తావిస్తూ, వైసీపీ ఎమ్మెల్యేలు పూర్తిగా హాజరు కావడంలేదని వారిపై చర్యల విషయంలో త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. గతంలో కొంత మంది అటెండెన్స్ కోసం రిజిస్టర్లో సంతకాలు పెట్టి.. లోపలికి రాకపోవడంతో.. ఇప్పటికే ఏఐ ఆధారిత కెమెరాల ద్వారా డిజిటల్ అటెండెన్స్ ప్రవేశపెట్టారు.
సభకు రాకుండా జీతాలు తీసుకోవడాన్ని ప్రశ్నిస్తున్న స్పీకర్
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. సభలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వరని, అందుకే ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని వారు వాదిస్తున్నారు. స్పీకర్ దృష్టిలో ఇది రాజ్యాంగ విధిని విస్మరించడమే. సభ్యులు సంతకాలు చేసి సభలోకి రాకపోవడాన్ని ఆయన తీవ్రంగా పరిగణిస్తున్నారు. త్వరలోనే చర్యలు తీసుకుంటామన్నరాు. సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఈ వ్యవహారంపై స్పందించారు. రాజ్యాంగ పరిధిలో ఉంటే ఏ నిర్ణయానికైనా సిద్ధమని, కానీ కక్షసాధింపు చర్యలకు దిగితే ఊరుకోబోమని హెచ్చరించారు. 60 రోజుల లెక్కింపులో సభ వాయిదా పడిన లేదా ప్రోరోగ్ అయిన రోజులను మినహాయించాల్సి ఉంటుంది. ఈ సాంకేతిక అంశాలను వైసీపీ ఆయుధంగా చేసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వం గనక వేటు వేస్తే న్యాయపోరాటం చేయాలని అనుకుంటున్నారు.
ప్రభుత్వం ధైర్యం చేస్తుందా?
వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడం అనేది కూటమి ప్రభుత్వానికి రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. ఒకవేళ 11 మంది ఎమ్మెల్యేలపై వేటు వేస్తే, ఆ స్థానాలకు ఉప ఎన్నికలు వస్తాయి. ఇది ప్రభుత్వంపై ఆర్థిక భారం కావడమే కాకుండా, వైసీపీకి సానుభూతి పవనాలు వీచే అవకాశం ఇస్తుందని కొందరు విశ్లేషకుల అభిప్రాయం. ప్రజాప్రతినిధులు బాధ్యతారాహిత్యంగా ఉంటే సహించేది లేదు అనే గట్టి సందేశాన్ని ప్రజల్లోకి పంపడానికి ప్రభుత్వం ఈ సాహసం చేసే అవకాశం లేకపోలేదన్న చర్చ నడుస్తోంది. అసెంబ్లీకి వెళ్లకపోవడాన్ని ప్రజలు కూడా సమర్థించరని అంటున్నారు.
నో వర్క్ - నో పే నినాదం
స్పీకర్ కేవలం అనర్హత గురించి మాత్రమే కాకుండా, పని చేయని వారికి జీతం లేదు అనే విధానాన్ని కూడా తెరపైకి తెచ్చారు. అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేల జీతభత్యాల్లో కోత విధించాలని ఆయన లోక్సభ స్పీకర్కు కూడా లేఖ రాయాలని భావిస్తున్నారు. ఇది దేశవ్యాప్తంగా ఒక చర్చకు దారితీస్తోంది. ప్రజాప్రతినిధుల జవాబుదారీతనంపై వస్తున్న ఈ ప్రతిపాదనలకు ప్రజల నుంచి మద్దతు లభించే అవకాశం ఉంది. అనర్హత వేటు విషయంలో స్పీకర్ నిర్ణయమే అంతిమమైనప్పటికీ, అది న్యాయ సమీక్షకు లోబడి ఉంటుంది. ప్రభుత్వం నిజంగానే వైసీపీ ఎమ్మెల్యేలను ఇంటికి పంపాలని నిశ్చయించుకుంటే, రాజ్యాంగపరమైన లొసుగులు లేకుండా పక్కాగా అడుగులు వేయాల్సి ఉంటుంది. మరోవైపు వైసీపీ కూడా తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతోంది.























