Kerala Assembly Elections 2026: కేరళ ఫలితాలను తేల్చేది గల్ఫ్లో ఉపాధి పొందుతున్న వారే - ఉద్యోగ సంక్షోభం, యుద్ధం ఆగ్రహం ఎవరిపై చూపిస్తారు?
Kerala: కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం స్థానిక అంశాలే కాకుండా, అంతర్జాతీయ పరిణామాలు కూడా తీర్పును ప్రభావితం చేయబోతున్నాయి. ముఖ్యంగా గల్ఫ్ పరిస్థితుల ఆగ్రహం ఎవరిపై పడుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

Gulf War is having an impact on the Kerala Assembly elections: కేరళ రాజకీయాలు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన ఒరవడిని కలిగి ఉంటాయి. ఇక్కడి ఓటరు చైతన్యం దేశానికే ఆదర్శం. అయితే, ఈసారి జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం స్థానిక అంశాలే కాకుండా, అంతర్జాతీయ పరిణామాలు కూడా తీర్పును ప్రభావితం చేయబోతున్నాయి. ముఖ్యంగా కేరళ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే ప్రవాస కేరళీయుల స్థితిగతులు, పెరుగుతున్న వలస కార్మికుల ప్రభావంపై ఈసారి ప్రధాన పార్టీలైన ఎల్డీఎఫ్, యూడీఎ, బీజేపీ తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి.
రెమిటెన్స్ సంక్షోభం
దశాబ్దాలుగా కేరళ అభివృద్ధిలో గల్ఫ్ దేశాల నుంచి వచ్చే నిధులు కీలక పాత్ర పోషించాయి. అయితే, ఇటీవలి కాలంలో గల్ఫ్ దేశాల్లో మారిన నిబంధనలు, అక్కడి స్వదేశీకరణ విధానాల వల్ల వేలాది మంది కేరళీయులు ఉపాధి కోల్పోయి స్వస్థలాలకు తిరిగి వస్తున్నారు. ఒకప్పుడు విదేశీ నగదుతో కళకళలాడిన గ్రామాలు ఇప్పుడు నిరుద్యోగంతో నిశ్శబ్దంగా మారుతున్నాయి. తిరిగి వచ్చిన ప్రవాసుల పునరావాసం కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు అరకొరగానే ఉన్నాయనే విమర్శలు బలంగా ఉన్నాయి. ఈ రిటర్న్ మలయాళీ వర్గం ఈసారి ఎన్నికల్లో ఎటు మొగ్గు చూపుతుందనేది అత్యంత ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు దీనికి యుద్ధ ప్రభావం కూడా తోడైంది.
మారుతున్న జనాభా ముఖచిత్రం
మరోవైపు, కేరళలో కూలీల కొరతను భర్తీ చేసేందుకు పశ్చిమ బెంగాల్, బిహార్, అస్సాం వంటి రాష్ట్రాల నుంచి వస్తున్న వలస కార్మికులు ఇప్పుడు అక్కడి సమాజంలో అంతర్భాగమయ్యారు. వీరి సంఖ్య లక్షల్లో ఉండటంతో, వీరిని ఓటు బ్యాంకుగా మార్చుకునేందుకు రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఈ వలస కార్మికులకు సామాజిక భద్రత కల్పించే అంశంపై పార్టీల మధ్య పోటీ నెలకొంది. వీరి ప్రభావం ముఖ్యంగా ఎర్నాకుళం, పెరుంబావూర్ వంటి పారిశ్రామిక ప్రాంతాల్లో ఫలితాలను తారుమారు చేసే అవకాశం ఉంది. కేరళలో మైనారిటీ ఓట్లు ఎప్పుడూ నిర్ణయాత్మకమే. అయితే, ఈసారి క్రైస్తవ ఓటు బ్యాంకులో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. గతంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్కు కంచుకోటగా ఉన్న ఈ వర్గం, ఇప్పుడు రబ్బర్ ధరల పతనం,మతపరమైన భద్రత' వంటి కారణాలతో ఎల్డీఎఫ్ వైపు , బీజేపీ వైపు చూస్తోంది. ముఖ్యంగా మధ్య కేరళలో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఇది యూడీఎఫ్ మనుగడకు సవాలుగా మారగా, పినరయి విజయన్ నాయకత్వంలోని ఎల్డీఎఫ్ దీనిని అవకాశంగా మలుచుకోవాలని చూస్తోంది.
త్రిముఖ పోరులో మెట్రో వ్యూహం
బీజేపీ ఈసారి కేరళలో తన ఉనికిని కేవలం ఓట్ల శాతానికే పరిమితం చేయకూడదని పట్టుదలతో ఉంది. మోదీ బ్రాండ్ ఇమేజ్, కేంద్ర పథకాల ప్రచారం ,సురేష్ గోపి వంటి సెలబ్రిటీ నేతల చరిష్మాను నమ్ముకుంది. హిందూ ఓట్ల ఏకీకరణతో పాటు, అసంతృప్త క్రైస్తవ వర్గాలను ఆకట్టుకోవడం ద్వారా త్రిముఖ పోటీని సృష్టించాలని యోచిస్తోంది. ఒకవేళ బీజేపీ కొన్ని కీలక స్థానాల్లో గణనీయమైన ఓట్లు సాధిస్తే, అది ఎల్డీఎఫ్, యూడీఎఫ్.. ఎవరి కొంప ముంచుతుందో చెప్పలేము.
ఈసారి కేరళ ఎన్నికలు కేవలం లెఫ్ట్ వర్సెస్ రైట్ మధ్య పోరు మాత్రమే కాదు. ఇది వలస వెళ్ళిన వాడి ఆవేదనకు, వలస వచ్చిన వాడి భవిష్యత్తుకు , నిలదొక్కుకోవాలనుకుంటున్న రాజకీయ సిద్ధాంతాల మధ్య జరుగుతున్న యుద్ధంగా మారుతోంది.
























