Polavaram Banakacherla Project : పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు తిరస్కరణ - రేవంత్ విజయమా? చంద్రబాబు వైఫల్యమా?
Irrigation Projects AP Politics: ఏపీ ప్రభుత్వం తలపెట్టిన పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు ప్రతిపాదనలను కేంద్రం వెనక్కి పంపింది. దీనిపై జోరుగా రాజకీయాలు సాగుతున్నయి. రేవంత్ విజయమని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి.

Polavaram Banakacherla Link Project EAC: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన పోలవరం–బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు ప్రతిపాదనలను కేంద్ర పర్యావరణ శాఖకు చెందిన నిపుణుల అప్రైజల్ కమిటీ వెనక్కి పంపడంతో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వేడి ఒక్కసారిగా రాజుకుంది. ఈ పరిణామాన్ని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తమ నేత రేవంత్ రెడ్డి సాధించిన దౌత్యపరమైన విజయంగా ప్రచారం చేస్తుండగా, ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం ప్రాథమిక దశలోనే విఫలమైందంటూ ప్రతిపక్ష వైఎస్సార్సీపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. అయితే, ఈ రాజకీయ క్రెడిట్ వార్, ప్రతివిమర్శలకు ఆవల సాంకేతిక, చట్టపరమైన కోణాలను క్షుణ్నంగా పరిశీలిస్తే, ఇది ఒకరికి లభించిన విజయమో లేదా మరొకరికి ఎదురైన ఓటమో కాదని.. నదీ జలాల చట్టాలకు అనుగుణంగా జరిగిన ఒక సహజ సిద్ధమైన పరిణామమని స్పష్టమవుతోంది.
చట్ట ప్రకారం అనుమతుల ప్రక్రియ జరగాల్సిందే
పర్యావరణ అనుమతుల ప్రక్రియను పరిశీలిస్తే, ఏ భారీ నదీ అనుసంధాన ప్రాజెక్టుకైనా ఒక స్పష్టమైన చట్టబద్ధమైన కార్యాచరణ ఉంటుంది. కేంద్ర జల సంఘం ద్వారా శాస్త్రీయంగా నీటి లభ్యత ధృవీకరణ పొందకుండానే పర్యావరణ అనుమతుల కోసం వెళ్లడం సాంకేతికంగా సరికాదు. చట్టబద్ధమైన ప్రాథమిక అనుమతులు లేకుండా ముందుకెళితే, భవిష్యత్తులో గ్రీన్ ట్రిబ్యునల్ లేదా సుప్రీంకోర్టు పరిధిలో పిటిషన్లు దాఖలై ప్రాజెక్టుపై శాశ్వత స్టే వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి కేంద్రం ఈ ప్రతిపాదనలను తిరస్కరించి వెనక్కి పంపడం అనేది ప్రాజెక్టుకు మున్ముందు చట్టపరమైన చిక్కులు ఎదురుకాకుండా నిరోధించే ఒక ముందస్తు చర్యగా పరిగణించవచ్చు.
ప్రభావిత రాష్ట్రాల అనుమతి తప్పనిసరి
గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ నిబంధనలు , అంతర్రాష్ట్ర ఒప్పందాల ప్రకారం ఎగువ , దిగువన ఉన్న ప్రతి ఒక్క రాష్ట్ర ప్రయోజనాలను రక్షించాల్సిన రాజ్యాంగ బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. ఏపీ రూపొందించిన ప్రస్తుత ప్రాజెక్టు డిజైన్ ద్వారా తెలంగాణతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు కూడా ముంపు ముప్పు, నీటి కేటాయింపులపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. గోదావరి బేసిన్ నుంచి సముద్రంలోకి వెళ్లే మిగులు, వరద నీటి పరిమాణాన్ని శాస్త్రీయంగా లెక్కించి, వాటాలపై స్పష్టత ఇచ్చే వరకు సీడబ్ల్యూసీ లేదా ఈఏసీ అనుమతులు మంజూరు చేయడం అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టాలకు విరుద్ధమవుతుంది.
అన్ని ఆమోదాలతో వస్తేనే ప్రయోజనం
రాజకీయంగా ఇది కూటమి ప్రభుత్వానికి బ్రేక్ పడటంలా అనిపించినప్పటికీ, సుదీర్ఘ కాలంలో ఈ ప్రాజెక్టుకు లభించే లీగల్ సెక్యూరిటీగా దీన్ని చూడవచ్చు. క్షేత్రస్థాయి ముంపు వివరాలు , నీటి కేటాయింపులపై పక్కా నివేదికలు లేకుండా ముందుకెళ్లడం వల్ల చట్టపరమైన పునాది బలహీనపడేది. పొరుగు రాష్ట్రాలతో సమగ్ర సంప్రదింపులు జరిపి, అంతర్రాష్ట్ర వివాదాలను పరిష్కరించుకున్న తర్వాతే సీడబ్ల్యూసీ నీటి లభ్యత ధృవీకరణ పత్రంతో మళ్లీ పర్యావరణ అనుమతులకు రావాలని కేంద్రం సూచించడం ద్వారా ప్రాజెక్టుకు ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ లభించింది.రాయలసీమ దాహార్తిని తీర్చేలా గోదావరి నుంచి 200 టీఎంసీల వరద నీటిని తరలించి, దాదాపు 80 లక్షల మందికి తాగునీరు, 3 లక్షల హెక్టార్లకు సాగునీరు అందించడం ఏపీకి అత్యంత ప్రాధాన్యమైన అంశం. ఇటువంటి మెగా ప్రాజెక్టు రూపుదిద్దుకోవాలంటే తొందరపాటు నిర్ణయాలు, పొలిటికల్ అజెండాల కంటే చట్టబద్ధమైన అడుగులే శ్రీరామరక్ష. సాంకేతిక లోపాలను సరిదిద్ది, అంతర్రాష్ట్ర సంప్రదింపులు పూర్తి చేసి చట్టబద్ధంగా ముందుకెళ్తేనే ఈ ప్రాజెక్టుకు శాశ్వత మనుగడ సాధ్యమవుతుంది.
సాంకేతిక అడ్డంకి మాత్రమే
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం దీనిని పొలిటికల్ విక్టరీగా చూపుతున్నప్పటికీ, ఏపీ ప్రభుత్వం ఎదుర్కొన్నది సాంకేతిక ప్రతిబంధకాన్ని మాత్రమే గానీ ప్రాజెక్టు, రద్దును కాదు. కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా సీడబ్ల్యూసీ నివేదికను సిద్ధం చేసుకుని, పొరుగు రాష్ట్రాల అభ్యంతరాలను నివృత్తి చేస్తూ ముందుకు సాగితేనే పోలవరం–బనకచర్ల అనుసంధానం సుసాధ్యమవుతుంది. రాజకీయ విమర్శలను పక్కనపెట్టి, నిబంధనల ప్రకారం లీగల్ బ్యాకప్తో ఏపీ ప్రభుత్వం ముందడుగు వేయడమే ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు భవిష్యత్తుకు అత్యంత సురక్షితమైన మార్గం.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















