హైదరాబాద్లోని ఆ కాలనీలకు త్వరలోనే తాగునీరు: మంత్రి కేటీఆర్
తెలంగాణ శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానమిచ్చారు.

ఒక రోజు విరామం తర్వాత తెలంగాణ శాసనసభ సమావేశాలు ఇవాళ జరుగుతున్నాయి. సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానమిచ్చారు. పల్లె, పట్టణ ప్రగతిపై స్వల్పకాలిక చర్చ జరిగింది. మిషన్ భగీరథ పథకం కింద ఎల్బీనగర్ నియోజకవర్గంలోని మిగిలి ఉన్న కాలనీలకు త్వరలోనే తాగునీటి సరఫరా చేసేందుకు కృషి చేస్తామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. నగర శివారులో ఉన్న నియోజకవర్గాల్లోని అనేక కాలనీల్లో భూగర్భ మురుగు నీటివ్యవస్థను మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన శాసనసభలో చెప్పారు.
ఎల్బీనగర్ నియోజకవర్గంలోని చాలా కాలనీల్లో 47.5 ఎంఎల్డీల సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లను నిర్మించామని కేటీఆర్ చెప్పారు. అక్కడక్కడ మిగిలివున్న కాలనీల్లో పనులు చేపట్టడానికి రూ.170 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. భూగర్భ మురుగు నీటి వ్యవస్థకు ఇంతకుముందే సీఎం కేసీఆర్ క్యాబినేట్ సమావేశంలో రూ.1200 కోట్లను మంజూరు చేశారని చెప్పారు. అందులో భాగంగానే వీటి నిర్మాణం చేపడతామన్నారు. నగరంలోని మొత్తం భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలంటే రూ.3,700 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేస్తున్నామని కేటీఆర్ చెప్పారు.
శాసనసభలో పట్టణ ప్రగతిపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా సభ్యులు మాట్లాడిన అనంతరం రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వివరణ ఇచ్చారు. రూ. 500 కోట్లతో ప్రతీ మున్సిపాలిటీలో రెండు ఎకరాలకు తగ్గకుండా వెజ్, నాన్ వెజ్ మార్కెట్లు నిర్మిస్తున్నామని కేటీఆర్ చెప్పారు. 141 మున్సిపాలిటీల్లో వైకుంఠధామాలు కడుతున్నామని తెలిపారు. రూ.850 కోట్లతో నాలాలు అభివృద్ధి చేస్తున్నామన్నారు. యువకుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్లో 74, మున్సిపాలిటీల్లో 369 ఓపెన్ జిమ్స్ ఏర్పాటు చేశామని కేటీఆర్ వివరణ ఇచ్చారు.
హరితహారం కోసం 10 శాతం గ్రీన్ బడ్జెట్ను కేటాయించామని కేటీఆర్ చెప్పారు. భారతదేశంలోనే అతిపెద్ద అర్బన్ ఎకో పార్కు మహబూబ్నగర్లో ఏర్పాటైందని వెల్లడించారు. పేదవారికి రూపాయికే నల్లా కనక్షన్లు ఇస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు. 10 వేలకు పైగా టాయిలెట్లు కట్టామని కేటీఆర్ వెల్లడించారు. గతంలో 68 మున్సిపాలిటీల్లో కేవలం 21 నర్సరీలు మాత్రమే ఉండవని.. ఈ మూడేళ్లలో 141 పట్టణాల్లో 1602 నర్సరీలు ఏర్పాటు చేశామని చెప్పారు.
Also Read: ఎస్బీఐలో 2056 పీఓ జాబ్స్.. నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే..
Also Read: ఐటీఐ విద్యార్హతతో రైల్వేలో 3093 ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి
ట్రెండింగ్ వార్తలు





















