Telangana Economic situation :తెలంగాణ బడ్జెట్ 2026 - అప్పుల సుడిగుండంలో ఆరు గ్యారంటీల పయనం - రేవంత్, భట్టి జోడి మ్యాజిక్ చేస్తారా?
Telangana Budget: తెలంగాణ బడ్జెట్ ప్రభుత్వానికి కత్తిమీద సాములా మారింది. అప్పులు, హామీల మధ్య సమతుల్యం చేసుకోవడం సమస్యగా మారుతోంది.

Budget expectations of the people of Telangana : తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు కేవలం అంకెల గారడీగా కాకుండా, అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ రణక్షేత్రంగా మారబోతున్నాయి. ఒకవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శ్వేతపత్రం డిమాండ్తో సర్కారును కార్నర్ చేస్తుంటే, మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ప్రభుత్వ అప్పుల చిట్టాను విప్పుతూ ఎదురుదాడికి దిగుతున్నారు. సుమారు 3 లక్షల కోట్ల భారీ బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు కసరత్తు జరుగుతున్న వేళ, రాష్ట్ర ఖజానా అసలు స్థితిగతులపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సంక్షేమం స అభివృద్ధి మధ్య సమతూకం పాటించడం ఇప్పుడు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కకు కత్తిమీద సాములా మారింది.
అప్పుల కుప్ప.. వడ్డీల తిప్ప
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అప్పుల ఊబి వేధిస్తోంది. గత పదేళ్లలో అప్పులు రూ.7.5 లక్షల కోట్లకు చేరాయని ముఖ్యమంత్రి ఆరోపిస్తుండగా, అధికారిక లెక్కలు భిన్నంగా ఉన్నాయి. అయితే, ఏ లెక్క చూసినా నెలకు వేల కోట్ల రూపాయలు కేవలం వడ్డీల చెల్లింపులకే వెచ్చించాల్సి వస్తోంది. ఈ డెట్ ట్రాప్ నుంచి బయటపడి, కొత్త ప్రాజెక్టులకు నిధులు మళ్లించడం ప్రభుత్వానికి అతిపెద్ద సవాలు. అప్పు తెచ్చి పప్పు కూడు అన్నట్లుగా కాకుండా, ఆదాయ వనరులను పెంచుకోవడమే ఏకైక మార్గమని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గ్యారంటీల భారం.. ఖజానాకు గండం
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ఆరు గ్యారంటీలు బడ్జెట్లో సింహభాగాన్ని ఆక్రమించనున్నాయి. రైతు భరోసా, మహాలక్ష్మి, గృహజ్యోతి వంటి పథకాల అమలుకు ఏటా రూ. 56,000 కోట్ల పైచిలుకు నిధులు అవసరమని అంచనా. ఎన్నికల వాగ్దానాలను నిలబెట్టుకోవాలనే పట్టుదలతో ఉన్న ప్రభుత్వం, ఈ నిధుల కోసం ఇతర శాఖల కేటాయింపుల్లో కోత విధిస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తూనే, మౌలిక సదుపాయాలను విస్మరించకూడదనే ఒత్తిడి సర్కారుపై ఉంది.
పెట్టుబడి వ్యయంపై విమర్శలు
రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే పెట్టుబడి వ్యయం విషయంలో ప్రభుత్వం కొంత వెనుకబడి ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. బడ్జెట్లో రూ. 36,000 కోట్లు కేటాయించినా, క్షేత్రస్థాయిలో ఖర్చు ఎంత అన్నదే కీలకం. జీతాలు, పెన్షన్లు వంటి రెవెన్యూ వ్యయం భారంగా మారుతున్న తరుణంలో, సాగునీటి ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణం వంటి ఆస్తుల సృష్టికి నిధులు తగ్గిస్తే దీర్ఘకాలంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉంది. సంక్షేమంతో పాటు సంపద సృష్టిని కూడా సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఆదాయ మార్గాలు - ట్రిలియన్ డాలర్ల కల
తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యం నెరవేరాలంటే, ఆదాయ మార్గాలను గణనీయంగా పెంచుకోవాలి. అటవీ, ఎక్సైజ్, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయంతో పాటు కేంద్రం నుంచి రావాల్సిన పన్నుల వాటా, గ్రాంట్లపై రాష్ట్రం ఆశలు పెట్టుకుంది. కేంద్రంతో సఖ్యతగా ఉంటూనే నిధులు రాబట్టుకోవడం రాజకీయంగానూ, ఆర్థికంగానూ ఇప్పుడు అనివార్యం. ఈ బడ్జెట్ సమావేశాలు తెలంగాణ ఆర్థిక దిశను నిర్దేశించనున్నాయి. కిషన్ రెడ్డి డిమాండ్ చేసినట్లుగా ప్రభుత్వం పారదర్శకంగా వివరాలు వెల్లడిస్తుందా? లేక రాజకీయ ఆరోపణలకే పరిమితమవుతుందా అన్నది చూడాలి. సంక్షేమ పథకాల అమలులో వేగం పెంచుతూనే, ఆర్థిక క్రమశిక్షణను పాటించడమే రేవంత్ సర్కార్ ముందున్న అసలైన పరీక్ష.























