Iran War:ఇరాన్ యుద్ధంతో మారుతున్న ప్రపంచ ముఖ చిత్రం! తెర వెనుక లాభపడుతున్నదెవరు? భారత్కు దక్కిన వ్యూహాత్మక ఊరట!

Iran War:ప్రపంచ చరిత్రలో యుద్ధాలు కేవలం రక్తపాతానికి మాత్రమే మిగల్చవు. సరికొత్త భౌగోళిక రాజకీయ సమీకరణాలకు పునాది వేస్తాయి. ప్రస్తుతం అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న సుదీర్ఘ పోరాటం అటువంటి ఒక భారీ మార్పునకు నాంది పలికింది. ఈ యుద్ధంలో తుపాకులు పేలుతున్నది ఒక చోటైనా, దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక వ్యవస్థలపై, ముఖ్యంగా ఇంధన, రక్షణ రంగాలపై తీవ్రంగా పడుతున్నది ఈ మహా సంగ్రామంలో అసలైన విజేతలు ఎవరు? పరాజితులు ఎవరు?
యుద్ధంలో నిశ్శబ్ద విజేతలు
ఏ యుద్ధంలోనైనా మొట్టమొదటి, కచ్చితమైన విజేతలు ఎవరైనా ఉన్నారంటే అది ఆయుధ సరఫరాదారులు, రక్షణ సంస్థలే. అమెరికా, యూరప్, ఇతర దేశాల రక్షణ పరిశ్రమలు ప్రస్తుతం బిలియన్ల కొద్దీ డాలర్లు లాభాలను ఆర్జిస్తున్నాయి. అత్యాధునిక యుద్ధ విమానాలు, క్షిపణులు, యుద్ధ నౌకల విక్రయాలు మూడు బాంబులు ఆరు పేలుళ్లుగా సాగుతున్నాయి. యుద్దం ముగిసిన కాల్పుల విరమణ ప్రకటించినా, ఆ తర్వాత ఏర్పడే అభద్రతా భావం వల్ల దేశాలు తమ రక్షణ బడ్జెట్ను పెంచుకుంటూనే ఉంటాయి. ఇది రక్షణ రంగ సంస్థలకు దీర్ఘకాలిక లభాలను చేకూరుస్తుంది.
రష్యాకు కలిసొచ్చే కాలం- ఉక్రెయిన్కు అదనపు మద్దతు
ప్రస్తుత పరిస్థితుల్లో రష్యా అతి పెద్ద లబ్ధిదారుగా మారింది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఆకాశాన్నంటుతుండటంతో రోజుకు 11 మిలియన్ బారెళ్లు ఉత్పత్తి సామర్థ్యం ఉన్న రష్యా ఆదాయం భారీగా పెరిగింది చమురు విక్రయాల ద్వారా రష్యాకు రోజుకు సుమారు 1 బిలియన్ డాలర్ల ఆదాయం సమకూరుతోంది. ఇది ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఏర్పడిన ఆర్థిక ఒత్తిడిని అధిగమించడానికి ఆ దేశానికి ఎంతగానో సహాయపడుతుంది.
మరోవైపు ఇరాన్కు రష్యా సహాయం చేస్తుండటంతో, పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్కు తమ మద్దతును మరింత పెంచాయి. డ్రోన్లు, క్షిపణులను ఎదుర్కోవడంలో ఉక్రెయిన్ వద్ద ఉన్న నైపుణ్యాన్ని గల్ఫ్ దేశాలు, అమెరికా ప్రస్తుతం వాడుకుంటున్నాయి. తద్వారా ఉక్రెయిన్ కూడా ఈ యుద్ధం వల్ల పరోక్షంగా లాభపడుతోంది.
చైనాకు చుక్కలు... ఇంధన భద్రతపై ఆందోళన
ఇరాన్ యుద్ధం వల్ల అత్యంత నష్టపోతున్న దేశాల్లో చైనా అగ్రస్థానంలో ఉంది. ఇరాన్ నుంచి తక్కువ ధరకు చమురును దిగుమతి చేసుకునే చైనాకు ఇప్పుడు ఆ మార్గం మూసుకుపోయింది. భారీ స్థాయిలో ఇంధనాన్ని వినియోగించే చైనా, ఇప్పుడు అధిక ధరల చమురును కొనాల్సి వస్తోంది. ఇది ఆ దేశ ఆర్థిక వృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
అంతేకాకుండా ఇరాన్ వంటి మిత్ర దేశానికి ఆపద సమయంలో చైనా అండగా నిలబడలేకపోవడం, దాని దౌత్యపరమైన బలహీనతను బయటపెట్టింది. 1979లో వియాత్నాంతో యుద్ధం తర్వాత చైనా నేరుగా ఏ యుద్ధంలోనూ పాల్గొనలేదు. ఇరాన్ పరిస్థితిని చూసిన తర్వాత తైవాన్ లేదా భారత్తో నేరుగా ఘర్షణకు దిగడం ఎంత ప్రమాదకరమో చైనాకు అర్థమైంది.
అరబ్-ఇరాన్ సంబంధాల్లో బీటలు
ఈ యుద్ధం ముస్లిం ప్రపంచంలో ఇరాన్ విశ్వసనీయతను దెబ్బతీసింది. అనేక ముస్లిం దేశాలపై ఇరాన్ నేరుగా దాడులకు దిగడంతో , అరబ్ దేశాలు ఇప్పుడు ఇరాన్ను నమ్మడం మానేశాయి. తమ భద్రత కోసం ఈ దేశాలు భవిష్యత్లో అమెరికాతో మరింతగా చేతులు కలిపే అవకాశం ఉంది. అరబ్ రాజ్యాలను కూల్చివేసి ఇస్లామిక్ ప్రభుత్వాలను స్థాపించాలని ఇరాన్ చేస్తున్న ప్రయత్నాలు ఈ సంబంధాలను మరింత క్లిష్టతరం చేశాయి.
భారత్కు దక్కిన ఊర
ఆశ్చర్యకరంగా భారత్కు ఈ యుద్ధం వల్ల వ్యూహాత్మక ప్రయోజనాలు కలుగుతున్నాయి. భారత్కు ప్రధాన శత్రువులైన చైనా, పాకిస్తాన్ ప్రస్తుతం ఇరాన్ సంక్షోభం వల్ల ఇబ్బందుల్లో ఉన్నాయి. పాకిస్థాన్ ఈ యుద్ధంలో ఎటు తేల్చుకోలేని స్థితిలో ఉంది. అమెరికా నేతృత్వంలోని సెంటకామ్లో సభ్యురాలిగా ఉండి కూడా అమెరికాకు సహాయం చేయలేక, అటు ఇరాన్కు అండగా ఉండలేక నిరుపయోగమైన మిత్రదేశంగా ముద్ర వేయించుకుంది. చైనా తన సొంత ఇంధన సమస్యల్లో బిజీగా ఉండటంతో భారత్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గే అవకాశం ఉంది. భారత్ పట్ల శత్రుత్వంతో వ్యవహరించే టర్కీ ప్రస్తుతం ఇరాన్తో ఘర్షణల వల్ల తన అంతర్జాతీయ స్థాయిని కోల్పోతుంది. డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం ఇరాన్ వ్యవహారాల్లో తలమునకలై ఉండటంతో భారత్పై అమెరికా ఒత్తిడి తాత్కాలికంగా తగ్గింది.
చమురు ధరలు పెరగడం వల్ల భారత్కు స్వల్పకాలిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సుమాుర 30 రోజుల్లో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఇంధనాన్ని పొందే అవకాశం ఉండటంతో భారత్ ఈ నష్టం నుంచి త్వరగా కోలుకుంటుంది.
భవిష్యత్లో ఇంధన మార్పులు
ఈ యుద్ధం వల్ల ప్రపంచ దేశాలు ఒక పాఠాన్ని నేర్చుకున్నాయి. మధ్య ప్రాచ్యంపై ఆధారపడటం ప్రమాదకరమని గ్రహించి, ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వైపు మొగ్గు చూపుతున్నాయి. ఖర్గ్ ద్వీపం వంటి కీలక ఇంధన కేంద్రాలపై దాడులు జరిగే అవకాశం ఉండటంతో, చమురు దిగుమతి చేసుకునే దేశాలు తమ ఇంధన భద్రతను పటిష్టం చేసుకుంటున్నాయి.
ఇరాన్ యుద్ధం ప్రపంచ దేశాల మధ్య అదృశ్య గోడలను నిర్మిస్తోంది. భారత్ వంటి దేశాలు ఈ గందరగోళంలో మౌనంగా ఉంటూనే తమ వ్యూహాత్మక ప్రయోజనాలను కాపాడుకుంటున్నాయి. శత్రువులు తమలో తాము పోరాడుకుంటున్నప్పుడు భారత్ ఒక ప్రేక్షక దేశంగా ఉండి లాభపడుతోంది. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి పాకిస్తాన్, చైనా పెడుతున్న ఇబ్బందుల నుంచి భారత్కు ఇదో ఉపశమనంగా భావించవచ్చు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















