Kaleshwaram issue: కాళేశ్వరంలోకి సీబీఐ దింపడం ఎలా ? - సీఎం రేవంత్ ముందున్న పెద్ద టాస్క్ ఇదే !
Kaleshwaram CBI:కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై సీబీఐ విచారణ జరగాలని రేవంత్ పట్టుదలగా ఉన్నారు. అయితే సీబీఐ నుంచి ఎలాంటి సంకేతాలు రావడం లేదు. మరి ఇప్పుడేం చేయబోతున్నారు?

How to bring CBI to Kaleshwaram: తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన , వివాదాస్పదమైన కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరికొత్త యుద్ధ తంత్రాన్ని సిద్ధం చేశారు. ప్రాజెక్టు వైఫల్యాలపై కేవలం విమర్శలకే పరిమితం కాకుండా, ఈ వ్యవహారాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ ముంగిటకు చేర్చడం ద్వారా అటు బీఆర్ఎస్ను, ఇటు బీజేపీని ఏకకాలంలో ఇరకాటంలో పెట్టే వ్యూహానికి రేవంత్ పదును పెట్టారు. ఇప్పటికే సీబీఐకి సిఫారసు చేశారు. కానీ సీబీఐ మాత్రం అడుగులు వేయడం లేదు. రాజకీయ కక్షసాధింపు అనే ముద్ర పడకుండా, వ్యవస్థాగతమైన దర్యాప్తు ద్వారా బాధ్యులను బోనులో నిలబెట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
విజిలెన్స్ ఆధారంగానే సీబీఐ దర్యాప్తునకు సిఫారసు
న్యాయపరమైన చిక్కులను అధిగమించే క్రమంలో రేవంత్ సర్కార్ అత్యంత చాకచక్యంగా వ్యవహరిస్తోంది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా కఠిన చర్యలు తీసుకోవద్దన్న హైకోర్టు మధ్యంతర ఆదేశాలు ఇప్పుడు వచ్చాయి కానీ ముందుగానే 9 నెలల కిందట సీబీఐ విచారణ కోరుతూ పంపిన సిఫారసులో ఆ కమిషన్ ప్రస్తావన లేకుండా జాగ్రత్త పడ్డారు. దీనికి బదులుగా, గతంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన ప్రాథమిక నివేదికలను, ప్రాజెక్టులో జరిగిన నిధుల మళ్లింపు ఆరోపణలను ప్రధాన ప్రాతిపదికగా చూపారు. తద్వారా సీబీఐ రంగప్రవేశానికి ఉన్న సాంకేతిక అడ్డంకులను తొలగించారు.
స్వయంగా చర్యలు తీసుకుంటే రాజకీయంగా బ్యాక్ ఫైర్
రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా బీఆర్ఎస్ అగ్రనేతలపై చర్యలకు ఉపక్రమిస్తే, అది రాజకీయంగా సానుభూతిని తెచ్చిపెట్టే అవకాశం ఉందని రేవంత్ భావిస్తున్నారు. అందుకే ఈ బంతిని కేంద్రం కోర్టులోకి విసిరారు. వేల కోట్ల ప్రజాధనం వృథా అయిన ఈ భారీ కుంభకోణంపై కేంద్రమే విచారణ జరిపించాలని కోరడం ద్వారా, బీజేపీ చిత్తశుద్ధిని రేవంత్ పరీక్షకు పెట్టారు. ఒకవేళ కేంద్రం సీబీఐ విచారణకు వెనుకాడుతే, మోదీ-కేసీఆర్ ఒక్కటే అనే ప్రచారాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి, బీజేపీని డిఫెన్స్లో పడేయాలన్నది కాంగ్రెస్ వ్యూహంగా కనిపిస్తోంది. రాష్ట్ర బీజేపీ నేతలకు కూడా ఒక సవాల్గా మారింది. సీబీఐ దర్యాప్తునకు పచ్చజెండా ఊపితే ఆ క్రెడిట్ రేవంత్ రెడ్డి ఖాతాలోకి వెళ్తుందన్న ఆందోళన వారిలో ఉంది. ఒకవేళ మౌనంగా ఉంటే బీఆర్ఎస్ను కాపాడుతున్నారన్న విమర్శలు మూటగట్టుకోవాల్సి వస్తుంది. ఒకవేళ విచారణ ప్రారంభమై కేసీఆర్ కుటుంబం చుట్టూ ఉచ్చు బిగుస్తే, బీఆర్ఎస్ బలహీనపడి ఆ ఓటు బ్యాంకు తమ వైపు వస్తుందని కొందరు బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. అయితే, కేంద్రంలోని అగ్రనేతల నిర్ణయంపైనే ఈ విచారణ భవిష్యత్తు ఆధారపడి ఉంది.
సీబీఐ డైరక్టర్ ను కలవాలనుకుంటున్న రేవంత్
కేవలం లేఖలతోనే సరిపెట్టకుండా, స్వయంగా సీబీఐ డైరెక్టర్ను కలవడం లేదా మంత్రుల బృందాన్ని ఢిల్లీకి పంపడం ద్వారా వ్యక్తిగత ఒత్తిడి తేవాలని రేవంత్ భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన ప్రాథమిక ఆధారాలను సీబీఐకి అందజేయడం ద్వారా దర్యాప్తు అనివార్యం చేయాలన్నది వారి ప్లాన్. విచారణ జరిగినా, జరగకపోయినా.. ఈ అంశాన్ని కేంద్రంపైకి నెట్టడం ద్వారా రాజకీయంగా లబ్ధి పొందవచ్చని, ప్రజాధనం విషయంలో తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవచ్చని రేవంత్ సర్కార్ బలంగా నమ్ముతోంది. ఈ వ్యూహం పలిస్తే, తెలంగాణ రాజకీయాల్లో మునుపెన్నడూ లేని విధంగా పెను మార్పులు సంభవించే అవకాశం ఉంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















