Nara Lokesh: మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
Nara Lokesh Foundation Stone Laid for Retaining Wall at Tadepalli | ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో మరో ఎన్నికల హామీని నిలబెట్టుకున్నారు.

మంగళగిరి: మంగళగిరి నియోజకవర్గంలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్నారు ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. తన సొంత నియోజకవర్గంలోని తాడేపల్లి మహానాడు ప్రాంత ప్రజల దశాబ్దాల కలను నారా లోకేష్ నెరవేర్చారు. తాడేపల్లి పట్టణం సీతానగరం మహానాడు వద్ద రిటైనింగ్ వాల్ నిర్మాణానికి మంత్రి లోకేష్ సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. తాడేపల్లిలో ప్రకాశం బ్యారేజీ దిగువన 0.9 కి.మీ నుంచి 2.610 కి.మీల వరకు కృష్ణా నది కుడివైపు రూ.294.20 కోట్లతో వరద రక్షణ గోడ (Retaining Wall)ను నిర్మించనున్నారు.
ఎన్నికల హామీని నిలబెట్టుకున్న నారా లోకేష్
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం మంత్రి లోకేష్ చర్యలు తీసుకుంటున్నారు. దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న ఈ ప్రాజెక్ట్ కు కేవలం ఏడాది కాలంలోనే రూ.294.20 కోట్ల పరిపాలన అనుమతులు సాధించడంతో పాటు టెండర్ ప్రక్రియను కూడా పూర్తిచేశారు. భవిష్యత్ లో భారీ వరదలను దృష్టిలో పెట్టుకుని 15 లక్షల క్యూసెక్కుల ప్రవాహాన్ని సైతం తట్టుకునేలా పట్టిష్టమైన డిజైన్ తో మహానాడులో రిటైనింగ్ వాల్ ను నిర్మించనున్నారు.

కేవలం సాధారణ గోడ కాకుండా భూమి లోపల 26 నుంచి 38 మీటర్ల లోతు వరకు 1,920 పైల్స్ వేయనున్నారు. పైల్- రాఫ్ట్ సాంకేతికతతో భూకంపాలతో పాటు నీటి ధృతిని తట్టుకునేలా నిర్మించనున్నారు. రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తైతే మహానాడు కాలనీ, సుందరయ్య నగర్ వంటి లోతట్టు ప్రాంతాల్లో నివసించే దాదాపు 50వేల మంది ప్రజలు వరద సమస్య నుంచి విముక్తి పొందుతారు. రాజధాని అమరావతి పరిధిలోని కీలక ప్రాంతాలకు, జాతీయ రహదారి-65కు రిటైనింగ్ వాల్ రక్షణగా నిలవనుంది.

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పద్మశాలీ వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ నందం అబద్దయ్య, కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా, గుంటూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, టీటీడీ బోర్డు మెంబర్ తమ్మిశెట్టి జానకీ దేవి, తాడేపల్లి మండల టీడీపీ అధ్యక్షుడు దాసరి కృష్ణ, తాడేపల్లి టౌన్ అధ్యక్షులు వల్లభనేని వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
ట్రెండింగ్ వార్తలు




















