KTR On NSDA Report: ఎన్నికల సమయంలో మేడిగడ్డపై ఎన్ఎస్డీఏ రిపోర్ట్ అంతా బూటకమే: కేటీఆర్
Telangana News | తెలంగాణ ఎన్నికల సమయంలో మేడిగడ్డపై ఎన్ఎస్డీఏ క్షేత్రస్థాయి పరిశీలన చేయకుండానే ప్రాథమిక రిపోర్ట్ ఇవ్వడం దారుణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెట్ కేటీఆర్ అన్నారు.

Kaleshwaram Lift Irrigation Project | హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజీపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధారిటీ (NDSA) ఇచ్చిన నివేదిక అంతా బూటకమని బీఆర్ఎస్ చెబుతున్న మాటే అక్షరాలా నిజమని తేలిపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ప్రాజెక్టుపై కనీస పరీక్షలు నిర్వహించకుండా ఎన్డీఎస్ఏ తుది రిపోర్టు ఎలా ఇస్తుందని ప్రఖ్యాత నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ ప్రశ్నించడంతో ఈ నివేదిక తప్పులతడక అని రుజువైపోయింది అన్నారు. అశాస్త్రీయ నివేదికలతో బీఆర్ఎస్ నేతలపై బురదజల్లే ప్రయత్నం జరుగుతోందని కేటీఆర్ ఎక్స్ వేదికగా ఆరోపించారు. మేడిగడ్డపై ఇచ్చిన నివేదిక ఎన్ఎస్డీఏ నివేదిక కాదని, ఎన్డీయే నివేదిక అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు చెంపపెట్టు
‘క్షేత్రస్థాయిలో కనీస పరీక్షలు చేయకుండానే NDSA ఇచ్చిన నివేదికను ఎల్ అండ్ టీ సంస్థ తిరస్కరించడం రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పూర్తిగా చెంపపెట్టు లాంటిదే. గతంలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ గంటల వ్యవధిలో ఇచ్చిన ప్రాథమిక నివేదిక నుంచి, ఏడాదిన్నర దాకా సాగదీసిన తరువాత ఇటీవల సైతం ఎన్ఎస్డీఏ ఇచ్చిన తుది నివేదిక వరకూ రెండింటిలోనూ అడుగడుగునా వ్యత్యాసాలు ఉన్నాయని, పొంతనలేని అంశాలు ఆ రిపోర్టు డొల్లతనాన్ని బయటపెట్టింది.
రేవంత్ అసమర్థత, చేతకానితనానికి నిదర్శనం
ఈ విధంగా పనికిరాని రిపోర్టును పట్టుకుని ఎన్డీఎస్ఏ నివేదికనే తమకు ప్రామాణికమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం వారి అసమర్థతకు, చేతకానితనానికి నిదర్శనం. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి పేరొస్తుందని.. రాజకీయ కక్షతోనే ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అయిన కాళేశ్వరం (Kaleshwaram Lift Irrigation Project)ను పక్కనపెట్టి సీఎం రేవంత్ రెడ్డి పాపం చేశారు. ఇప్పటికే సీఎం రేవంత్ నిర్వాకం వల్ల ఏడాదిన్నరగా తెలంగాణలో లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. దాంతో 500 మందికి పైగా అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్నారు.
Also Read: NTR Jayanti: ఎన్టీఆర్ ఘాట్ వద్ద తాతకు నివాళి అర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్రామ్
మేడిగడ్డను కోల్డ్ స్టోరేజీలోకి నెడుతున్నారు
పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ కొట్టుకుపోయినా వేగంగా పునరుద్ధరించిన విషయం మరిచిపోయారు. మేడిగడ్డ విషయంలో మాత్రం 18 నెలలుగా మొత్తం ప్రాజెక్టునే కోల్డ్ స్టోరేజీలోకి నెట్టడం దుర్మార్గం. గత అసెంబ్లీ ఎన్నికల వేళ బీఆర్ఎస్ ప్రభుత్వంపై బురద జల్లేందుకు బీజేపీ, కాంగ్రెస్ కుట్రలు చేశాయి. అదే విధంగా ఇటీవల జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభను దెబ్బతీయాలని మేడిగడ్డ బ్యారేజీ తుది నివేదిక పేరిట కొత్త డ్రామాకు తెరతీశారు.
ప్రాజెక్టు ప్లాన్ నుంచి నిర్మాణ నాణ్యత వరకూ అడుగడుగునా ఎక్కడా రాజీ పడకుండా కట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం. ఇకనైనా మేడిగడ్డ బ్యారేజీపై బురదజల్లడం మాని, ఎల్ అండ్ టీ అభ్యంతరాలకు తెలంగాణ ప్రభుత్వంగానీ, ఎన్డీఎస్ఏ సమాధానం చెప్పాలని’ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో మేడిగడ్డ కుంగుబాటు అంశం బయటకు రావడంతో బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల్లో ప్రతికూలంగా మారిందని ఆ పార్టీ నేతలు పలుమార్లు చెప్పారు. సరైన నివేదిక కాదని కేటీఆర్ మరోసారి ఆరోపించారు.
Before You Go
IAS Officers | హిమాచల్లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
ట్రెండింగ్ వార్తలు






















