CM Revanth Reddy: మహిళల్ని రాష్ట్రపతి, ప్రధాని, సీఎంలు చేసి గౌరవించిన పార్టీ కాంగ్రెస్: సీఎం రేవంత్ రెడ్డి
ప్రజా భవన్లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. మహిళలు సాధించిన విజయాలతో పాటు కాంగ్రెస్ పార్టీలో వారికి ఇస్తున్న ప్రాధాన్యతను ఈ సందర్భంగా ఆయన వివరించారు.

Womens Day 2026 | హైదరాబాద్: ప్రతి మహిళా దినోత్సవం సందర్భంగా వేలాది మంది ఆడబిడ్డలను పిలిచి, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించడం మన ఆనవాయితీ అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలో రాష్ట్రపతి, ప్రధాని, లోక్సభ స్పీకర్, ముఖ్యమంత్రులు, పార్టీ అధ్యక్షులుగా మహిళలకు అన్ని ఉన్నత పదవులను కాంగ్రెస్ పార్టీయే ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. ఉక్కు మహిళ సోనియా గాంధీ స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, అందుకే రాష్ట్రంలో మహిళలకు సరైన గుర్తింపు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించుకుందని తెలిపారు.
అవకాశాలు సద్వినియోగం చేసుకుని సత్తా చాటుతున్న మహిళలు
మహిళా అధికారుల సమర్థతపై నమ్మకంతో కలెక్టర్లు, ఎస్పీలుగా ఎక్కడ అవకాశం వచ్చినా వారికి ప్రాధాన్యత ఇస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ లాంటి కీలక జిల్లాకు మహిళా కలెక్టర్ ఉండటం, ఎస్ఐబీలో ఒక మహిళా అధికారి 700 మంది మావోయిస్టులు లొంగిపోయేలా పనిచేయడం వారి నైపుణ్యానికి నిదర్శనమని కొనియాడారు. అవకాశం ఇచ్చినప్పుడు వారి సమర్థత బయటకు వస్తుందని, ఈ ప్రభుత్వం కల్పించే అవకాశాలను సద్వినియోగం చేసుకున్న వారు ఉన్నత శిఖరాలకు ఎదుగుతారని అన్నారు.

మహిళల ఆర్థిక పురోభివృద్ధి కోసం ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని, మహిళా సంఘాలు కార్పొరేట్ కంపెనీలతో పోటీ పడేలా 1000 బస్సులకు వారిని యజమానులను చేశామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అలాగే స్వయం సహాయక సంఘాల మహిళలను 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ల యజమానులను చేయడంతో పాటు, వారు ఉత్పత్తి చేసే వస్తువుల విక్రయం కోసం అమెజాన్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. మహిళల్లోని నైపుణ్యాన్ని గుర్తించి అండగా ఉండటం కోసం హైటెక్ సిటీ పక్కనే 1000 కోట్ల విలువైన మూడున్నర ఎకరాల స్థలంలో 150 స్టాల్స్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. స్థానిక ప్రతిభను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
నగర అభివృద్ధితో పాటు మూసీ ప్రక్షాళనపై రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ను న్యూయార్క్, టోక్యో, దక్షిణ కొరియా నగరాలతో పోటీ పడేలా తీర్చిదిద్దుతాం. 2047 నాటికి తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చడమే లక్ష్యం. అందుకోసం గ్లోబల్ సమ్మిట్ ద్వారా అంతర్జాతీయ సంస్థలను ఆహ్వానిస్తున్నాం. కాలుష్య నివారణలో భాగంగా 2500 ఆర్టీసీ డీజిల్ బస్సులను జిల్లాలకు తరలించి, వాటి స్థానంలో ఈవీ బస్సులను తీసుకువస్తున్నాం. కాలేజీ విద్యార్థినులకు ఈవీ స్కూటీలు అందించబోతున్నాం. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి ప్రతిపక్షాలు సహకరించాలని, బాధితులకు 7 ఎకరాల భూమి కేటాయించి అపార్ట్మెంట్లు కట్టించి ఇస్తామని’ స్పష్టం చేశారు.
జర్నలిస్టుల ఇళ్ల స్థలాల విషయంలో త్వరలోనే శుభవార్త చెబుతామని సీఎం హామీ ఇచ్చారు. చట్టపరమైన ఇబ్బందులు లేకుండా నిర్ణయం తీసుకుంటామని, ఫ్యూచర్ సిటీలో జర్నలిస్టుల కోసం ఒక మంచి కాలనీని డిజైన్ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. సోషల్ మీడియాలో తప్పుడు కథనాలపై ఫిర్యాదు చేయడానికి ప్రత్యేక వేదికను ఏర్పాటు చేస్తామని, జర్నలిస్టుల ముసుగులో అక్రమాలకు పాల్పడే వారిని అరికట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
ట్రెండింగ్ వార్తలు




















