TDP vs YSRCP: కోర్టులు ఆదేశిస్తేనే రెడ్ బుక్ పని చేస్తుందా ? తప్పు చేసిన పోలీసులపై చర్యలెందుకు తీసుకోవడం లేదు?
TDP government: వైసీపీ హయాంలో తప్పులు చేసిన పోలీసులపై కోర్టులు ఆదేశిస్తే తప్పు టీడీపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. అనంతబాబు కేసులో సుప్రీంకోర్టు హెచ్చరికల తర్వాతే చర్యలు తీసుకున్నారు.

YSRCP regime police: వైఎస్ఆర్సీపీ హయాంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందని టీడీపీ ఆరోపణలు చేసింది. నేరస్తులకు కొమ్ము కాశారని,, అసాంఘిక కార్యక్రమాలకు అండగా నిలిచారని తీవ్రమైన అణిచివేతలకు పాల్పడ్డారని ఆరోపించింది. వారందరి పేర్లు రెడ్ బుక్లోరాసుకున్నామని.. చట్ట ఉల్లంఘనలకు పాల్పడిన ఒక్కరిని కూడా వదలబోమని టీడీపీ ప్రకటించింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క పోలీసు అధికారిపై ఆయా ఘటనకు సంబంధించి చర్యలు తీసుకోలేదు. కొంత మందికి పోస్టింగులు ఇవ్వకపోవడం.. కొంత మందిని సస్పెన్షన్ చేయడం మినహా చర్యలు లేవు. కానీ చాలా కేసుల్లో కోర్టులు ఆగ్రహించిన తర్వాతనే పోలీసులపై చర్యలు తీసుకుంటున్నారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసు అలాంటిదే. ఈ కేసులో సుప్రీంకోర్టు హెచ్చరికల తర్వాత పోలీసులపై చర్యలు తీసుకుంటున్నారు. ముందే ఎందుకు తీసుకోలేదన్న ప్రశ్నలు టీడీపీ క్యాడర్ నుంచి కూడా వస్తున్నాయి.
రెడ్ బుక్ ఎందుకు పని చేయడం లేదు ?
ఎన్నికల ప్రచారంలో భాగంగా రెడ్ బుక్ అంశాన్ని టీడీపీ బలంగా వినిపించింది. చట్టాన్ని అతిక్రమించి వ్యవహరించిన అధికారులను వదిలిపెట్టే ప్రసక్తి లేదని కూటమి నేతలు పదేపదే ప్రకటించారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ స్థాయిలో చర్యలు కనిపించకపోవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత కొందరు పోలీసు అధికారులను బదిలీ చేయడం, మరికొందరిని వెయిటింగ్లో ఉంచడం వంటి ప్రాథమిక చర్యలకే పరిమితమైంది. తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్న వారిపై కూడా కఠినమైన విచారణలు లేదా అరెస్టులు జరగకపోవడం గమనార్హం. గతంలో జరిగిన అణిచివేతలపై వెంటనే స్పందించకుండా కేవలం అడ్మినిస్ట్రేటివ్ పరమైన మార్పులతోనే ప్రభుత్వం సరిపెట్టుకుంటోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
కోర్టులు హెచ్చరించిన తర్వాతనే చర్యలు
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య వంటి సంచలన కేసుల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకునే వరకు పోలీసులపై చర్యలు తీసుకోకపోవడం చర్చనీయాంశమైంది. సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి హెచ్చరికలు జారీ చేసిన తర్వాతే యంత్రాంగం కదలికలు మొదలుపెట్టింది. చట్టం తన పని తాను చేసుకుపోతుందని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, కోర్టుల జోక్యం తర్వాతే చర్యలు తీసుకోవడం ప్రారంభించారు.
రాజకీయ కక్ష సాధింపులు అనుకుంటారనే నిదానం
రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారనే ముద్ర పడకుండా ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది. ప్రతీకార రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్న ప్రభుత్వం, నిబంధనల ప్రకారమే ముందుకెళ్లాలని భావిస్తోంది. ఈ సంయమనం పాలన పరంగా మంచిదే అయినప్పటికీ, క్షేత్రస్థాయిలో ఉన్న పార్టీ కార్యకర్తల్లో మాత్రం తీవ్ర అసంతృప్తిని కలిగిస్తోంది. గత ప్రభుత్వంలో వేధింపులకు గురైన తమకు న్యాయం జరగడం లేదని వారు భావిస్తున్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతలు, వాస్తవ పరిస్థితుల మధ్య వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు వ్యవస్థను ప్రక్షాళన చేయాలనే ఆలోచన ఉన్నా, మరోవైపు అది వ్యక్తిగత దాడులుగా మారకూడదని ప్రభుత్వం జాగ్రత్త పడుతోంది. అయితే ఈ తాత్సారం వల్ల బాధ్యులైన అధికారులు తప్పించుకునే అవకాశం ఉందని బాధితులు ఆందోళన చెందుతున్నారు. కేవలం సస్పెన్షన్లు, బదిలీలతోనే సరిపెట్టకుండా బాధ్యులను చట్టం ముందు నిలబెట్టాలని క్యాడర్ కోరుకుంటోంది.
రెడ్ బుక్ ఓపెన్ చేయాలని సూచనలు
రాబోయే రోజుల్లో ఈ తరహా కేసులపై ప్రభుత్వం ఎలాంటి వైఖరి అవలంబిస్తుందనేది కీలకం కానుంది. కేవలం కోర్టుల ఆదేశాల మేరకే చర్యలు తీసుకుంటే అది ప్రభుత్వ బలహీనతగా కనిపిస్తుందనే వాదనలు ఉన్నాయి. అటు పార్టీ వర్గాల అసంతృప్తిని చల్లార్చడం, ఇటు వ్యవస్థలో జవాబుదారీతనం పెంచడం అనే రెండు సవాళ్లను ప్రభుత్వం ఎలా అధిగమిస్తుందో వేచి చూడాలి. ప్రభుత్వం మాత్రం ఆత్మరక్షణ ధోరణికే ప్రాధాన్యం ఇస్తోంది. ఎక్కడ కక్ష సాధింపులు అనుకుంటారోనని వీలైనంత సంయమనం పాటిస్తోంది.























