Revanth Reddy strategy 2026: రేవంత్ సర్కార్ మైలేజీ మ్యాజిక్ - సునీల్ కనుగోలుతో కలిసి కొత్త ప్లాన్ - ఇమేజ్ మారిపోతుందా?
Sunil Kanugolu : తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచార వ్యూహాన్ని మార్చుకుంటోంది. వ్యూహకర్త సునీల్ కనుగోలును ప్రభుత్వ సలహాదారుగా నియమించి, సోషల్ మీడియాలో పట్టు పెంచుకోవడానికి ప్లాన్ చేసుకుంటోంది.

Telangana Congress publicity: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు అవుతోంది. పరిపాలన పరంగా వేగంగా అడుగులు వేస్తున్నప్పటికీ ప్రచార మైలేజీ ఆశించిన స్థాయిలో రావడం లేదన్న ఆందోళన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పార్టీ అగ్రనేతల్లోనూ కనిపిస్తోంది. ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల కంటే, చిన్నపాటి విమర్శలు సోషల్ మీడియాలో ఎక్కువగా హైలైట్ అవుతుండటంతో దీన్ని అధిగమించేందుకు వ్యూహకర్త సునీల్ కనుగోలు సేవలను మరింత అధికారికంగా ఉపయోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.
పథకాలు బాగా అమలు చేశామనుకుంటున్న కాంగ్రెస్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి వచ్చినప్పటి నుంచి రైతు రుణమాఫీ, ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి వంటి కీలక పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోంది. అయితే, క్షేత్రస్థాయిలో ఈ పథకాల వల్ల లబ్ధి పొందుతున్న ప్రజల కంటే, చిన్నపాటి లోపాలను ఎత్తిచూపుతున్న ప్రతిపక్షాల సోషల్ మీడియా ప్రచారమే బలంగా వినిపిస్తోంది. ప్రభుత్వం పని చేస్తోంది కానీ.. చెప్పుకోవడంలో విఫలమవుతోంది అన్న విమర్శ స్వయంగా పార్టీ అంతర్గత సమావేశాల్లోనే వ్యక్తమైంది. ఈ గ్యాప్ను భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు సరికొత్త ప్రచార వ్యూహానికి పదును పెడుతున్నారు.
సునీల్ కనుగోలు - తెరవెనుక నుంచి అధికారిక పదవి వైపు
2023 ఎన్నికల్లో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావడంలో వ్యూహకర్త సునీల్ కనుగోలు పాత్ర అత్యంత కీలకం. ప్రస్తుతం ఆయన బృందం పార్టీ కోసం పని చేస్తున్నప్పటికీ, ప్రభుత్వ పరంగా ప్రచార సమన్వయం లోపించిందని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అందుకే సునీల్ కనుగోలును కేవలం పార్టీ వ్యూహకర్తగానే కాకుండా, ప్రభుత్వ అధికారిక సలహాదారుగా నియమించుకోవాలని యోచిస్తున్నట్లు సమాచారం. దీనివల్ల ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం పెరగడంతో పాటు, పథకాల సమాచారం ప్రజల్లోకి వేగంగా వెళ్తుందని ఆశిస్తున్నారు.
*సోషల్ మీడియాపై సర్జికల్ స్ట్రైక్
బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ను బలంగా నిర్మించుకుంది. ఇప్పుడు అదే వ్యవస్థ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శల దాడి చేస్తోంది. దీన్ని ఎదుర్కోవడంలో కాంగ్రెస్ ఐటీ వింగ్ కొంత వెనుకబడి ఉందన్నది కాదనలేని సత్యం. సునీల్ కనుగోలు పర్యవేక్షణలో ప్రచార వ్యవస్థను ప్రక్షాళన చేసి, ప్రభుత్వ విజయాలను డిజిటల్ మాధ్యమాల్లో వైరల్ చేయడంతో పాటు, ప్రతిపక్షాల విమర్శలను తక్షణమే తిప్పికొట్టేలా వార్ రూమ్ ను బలోపేతం చేయబోతున్నారు. ప్రభుత్వం భారీగా సంక్షేమ పథకాలకు నిధులు వెచ్చిస్తున్నా, ప్రజల్లో పెర్సెప్షన్ మార్చడంలో ప్రచారం లోపిస్తోంది. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా, లబ్ధిదారుల అభిప్రాయాలను వీడియోల రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, ఇన్ఫ్లుయెన్సర్ల ద్వారా ప్రభుత్వ విధానాలను ప్రచారం చేయించడం వంటి ఆధునిక పద్ధతులను సునీల్ కనుగోలు టీమ్ సిద్ధం చేస్తోంది. ముఖ్యంగా యువతను ఆకట్టుకునేలా ఇన్ఫోగ్రాఫిక్స్, షార్ట్ వీడియోలపై దృష్టి సారించనున్నారు. ప్రభుత్వానికి అనుకూలమైన గాలిని సృష్టించడమే సునీల్ కనుగోలు టీమ్ ముందున్న అసలైన టాస్క్. గతంలో కర్ణాటకలో పనిచేసిన అనుభవంతో, ఇక్కడ కూడా ప్రభుత్వానికి ఒక పాజిటివ్ ఇమేజ్ తీసుకురావాలని హైకమాండ్ ఆదేశించినట్లు తెలుస్తోంది.
పరిపాలనలో ఎంత వేగం ఉన్నా, అది ప్రజలకు చేరినప్పుడే రాజకీయంగా ప్రయోజనం చేకూరుతుంది. సునీల్ కనుగోలును అధికారికంగా రంగంలోకి దించడం ద్వారా రేవంత్ రెడ్డి కేవలం పరిపాలనే కాదు, రాజకీయ బ్రాండింగ్లోనూ ముందంజ వేయాలని చూస్తున్నారు. ఈ వ్యూహకర్త అస్త్రం కాంగ్రెస్కు ఏ మేరకు మైలేజీ తెస్తుందో వేచి చూడాలి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















