KCR re entry: జగిత్యాల సభతో కేసీఆర్ రీ ఎంట్రీ - ఇక నుంచి మరో లెక్కనా?
KCR: జగిత్యాల సభతో కేసీఆర్ మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్ లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. ఆయన మళ్లీ మౌన వ్యూహం పాటించకుండా..జోరుగా రాజకీయం చేస్తే తెలంగాణలో పరిస్థితులు మారిపోయే అవకాశం ఉంది.

KCR is re-entering active politics: గులాబీ దళపతి కేసీఆర్ సుదీర్ఘ విరామం తర్వాత గళం విప్పబోతుండటం బీఆర్ఎస్ పార్టీని ఉత్సాహంలో ముంచెత్తుతోంది. గత పార్లమెంట్ ఎన్నికల అనంతరం ఆయన ప్రజల మధ్యకు రాకపోవడం, అటు అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరు కాకపోవడంతో తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ శకం ముగిసిందన్న ప్రచారం జోరుగా సాగింది. ఈ క్రమంలో జగిత్యాల వేదికగా ఆయన నిర్వహించబోయే బహిరంగ సభ తన ఉనికిని చాటుకోవడమే కాకుండా, రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ తన ప్రాధాన్యతను నిరూపించుకునే ప్రయత్నంగా కనిపిస్తోంది.
వెంటనే కౌంటర్ ఇచ్చేందుకు రేవంత్ రెడీ
కేసీఆర్ రీ-ఎంట్రీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత సీరియస్గా తీసుకున్నారు. కేసీఆర్ బహిరంగ సభకు దీటుగా, అదే రోజు కాటారంలో రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమాన్ని రేవంత్ ప్రభుత్వం పక్కా ప్లాన్తో ఏర్పాటు చేసింది. కేసీఆర్ విమర్శలు చేసే సమయంలోనే రైతుల ఖాతాల్లోకి డబ్బులు చేరాలనే వ్యూహం వెనుక బలమైన రాజకీయ సందేశం ఉంది. రాజకీయం ఇప్పుడు స్పష్టంగా కేసీఆర్ వర్సెస్ రేవంత్ అన్నట్లుగా మారుతోంది. ఇది ఇద్దరు నేతలకు తమ బలాలను ప్రదర్శించుకోవడానికి ఒక సువర్ణ అవకాశంగా మారింది.
కేసీఆర్ ఇక కీలకంగా వ్యవహరిస్తారా?
కేసీఆర్ ఈ ఒక్క బహిరంగ సభతోనే సరిపెడతారా లేక తన దూకుడును నిరంతరాయంగా కొనసాగిస్తారా అన్నదే చాలా మందికి ఆన్సర్ తెలియని ప్రశ్న. గతంలో కూడా ఆయన అడపాదడపా మీడియా ముందుకు రావడం, మళ్లీ నెలల తరబడి ఫామ్ హౌస్ కే పరిమితం కావడం వల్ల బీఆర్ఎస్ కేడర్ నైతికంగా దెబ్బతిన్నది. ఈసారి కూడా అదే పునరావృతమైతే, విపక్ష గొంతుక బలహీనపడి అది అంతిమంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే రాజకీయంగా మేలు చేస్తుందని వారు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై ప్రజల్లో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. ఈ సమయంలో ఒక సమర్థవంతమైన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ప్రజల పక్షాన నిరంతరం పోరాడితేనే ఆయన ప్రాధాన్యత నిలబడుతుంది. అలా కాకుండా కేవలం ఒక్క సభ పెట్టి మళ్లీ మౌనం పాటిస్తే, అది కేవలం ఒక ఈవెంట్ గా మిగిలిపోతుందే తప్ప, రాజకీయ సమీకరణాల్లో మార్పు రాదు. రాజకీయ రంగంలో ఔట్ ఆఫ్ సైట్.. ఔట్ ఆఫ్ మైండ్ ' అన్న సూత్రం అక్షరాలా నిజమవుతున్న తరుణంలో కేసీఆర్ తన వ్యూహాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందని బీఆర్ఎస్ శ్రేణులుభావిస్తున్నాయి.
కేసీఆర్ యాక్టివ్గా లేకపోవడంతో రేవంత్ దూకుడు
రేవంత్ రెడ్డి తనదైన శైలిలో పాలనను, రాజకీయాలను దూకుడుగా ముందుకు తీసుకువెళుతున్నారు. కేసీఆర్ విడిచిన ఖాళీని భర్తీ చేస్తూ ప్రజల్లో తన పట్టును పెంచుకుంటున్నారు. ఈ దశలో కేసీఆర్ మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్లోకి రావడం వల్ల ఒక బలమైన ప్రతిపక్షం ఉందని ప్రజలు భావిస్తారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిదే అయినప్పటికీ, కేసీఆర్ కంటిన్యూటీ లేకపోతే మాత్రం అది రేవంత్ రెడ్డికి వాకోవర్ ఇచ్చినట్లే అవుతుందన్న అభిప్రాయం ఉంది. జగిత్యాల సభ తర్వాత కేసీఆర్ అడుగులు ఏ దిశగా పడతాయోనన్నది తెలంగాణ రాజకీయాల భవిష్యత్తును నిర్ణయించనుంది. ఆయన మళ్లీ ఫామ్ హౌస్ కే పరిమితమైతే అది రేవంత్ రెడ్డికి తిరుగులేని అవకాశంగా మారుతుంది. అలా కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటనలు కొనసాగిస్తే మాత్రం రాష్ట్రంలో రాజకీయ సెగలు పుట్టడం ఖాయం. ఒకప్పుడు తెలంగాణను శాసించిన కేసీఆర్, ఇప్పుడు తన రాజకీయ అస్తిత్వం కోసం చేస్తున్న ఈ పోరులో ఎంతవరకు సఫలమవుతారో వేచి చూడాలి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















