Dharani vs Bhubharati: ధరణి పోయి భూభారతి వచ్చినా అవే సమస్యలు - ప్రజాగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం గుర్తించదా?
Bhubharati: భూభారతితోనూ భూసమస్యలు పరిష్కారం కాకపోవడం తెలంగాణ ప్రభుత్వానికి సమస్యగా మారింది. ఈ అంశంపై ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోతోంది.

Bhubharati Failure: తెలంగాణలో భూ సమస్యల పరిష్కారం కోసం గత ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్ స్థానంలో, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ఆశతో భూభారతి వ్యవస్థను ప్రవేశపెట్టింది. భూ రికార్డులను సమూలంగా ప్రక్షాళన చేసి, రైతులకు శాశ్వత పరిష్కారం చూపుతామని చేసిన ప్రకటనలు క్షేత్రస్థాయిలో ఆవిరవుతున్నాయి. భూభారతి అమల్లోకి వచ్చినా సమస్యలు తగ్గకపోగా, సరికొత్త సాంకేతిక, పరిపాలన చిక్కులు తోడై రైతుల పాలిట భూ స్వప్నంగా మారుతోంది.
ప్రక్షాళన పేరిట పెరిగిన పెండింగ్ దరఖాస్తులు
ధరణిలోని లోపాలను సరిదిద్దేందుకు భూభారతిని తీసుకువచ్చినప్పటికీ, దరఖాస్తుల పరిష్కార వేగం మందగించింది. ధరణి కాలం నాటి 2.45 లక్షల పెండింగ్ దరఖాస్తులకు , భూభారతి ప్రారంభమయ్యాక కొత్తగా వచ్చిన దరఖాస్తులు తోడయ్యాయి. ముఖ్యంగా వారసత్వ బదిలీ , భూ విస్తీర్ణంలో వ్యత్యాసాల సవరణకు సంబంధించిన సాఫ్ట్వేర్ మాడ్యూల్స్లో సాంకేతిక లోపాలు ఇంకా వెంటాడుతున్నాయి. ప్రభుత్వం కేవలం పోర్టల్ పేరు మార్చడంపై ఉన్న శ్రద్ధ, క్షేత్రస్థాయిలో దరఖాస్తుల పరిష్కారంపై చూపడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సమగ్ర భూ సర్వే - మూడేళ్ల నిరీక్షణ తప్పదా?
భూభారతిలో భాగంగా ప్రభుత్వం ప్రకటించిన సమగ్ర భూ సర్వే రైతుల్లో కొత్త ఆందోళనలను రేకెత్తిస్తోంది. అత్యాధునిక రోవర్లు, డ్రోన్ల ద్వారా ప్రతి సెంటు భూమిని కొలుస్తామని ప్రభుత్వం చెబుతున్నా, ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కనీసం రెండు నుండి మూడు ఏళ్లు పట్టే అవకాశం ఉంది. ఈ లోపు పెండింగ్లో ఉన్న లక్షలాది సమస్యల పరిస్థితి ఏమిటన్నది ఎవరికీ అర్థం కావడం లేదు. సర్వే పూర్తయ్యే వరకు రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లలో జాప్యం జరిగితే సామాన్య రైతులకు సాగు పెట్టుబడి కోసం రుణాలు పుట్టడం కూడా గగనంగా మారే ప్రమాదం ఉంది.
22A జాబితా ఎమ్మెల్యేల హామీలు.. క్షేత్రస్థాయిలో శూన్యం
నిషేధిత భూముల జాబితా (22A) అంశం భూభారతి వచ్చిన తర్వాత మరింత క్లిష్టంగా మారింది. ఎన్నికల సమయంలో ఈ భూములను జాబితా నుండి తొలగిస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యేలు, ఇప్పుడు నోరు మెదపడం లేదు. అసైన్డ్, దేవాదాయ భూముల సమస్యలపై ప్రభుత్వం నుండి స్పష్టమైన గైడ్లైన్స్ రాకపోవడంతో అధికారులు చేతులెత్తేస్తున్నారు. దీంతో బాధితులు అటు సచివాలయం, ఇటు స్థానిక ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఇచ్చిన హామీలు ఇప్పుడు ప్రభుత్వానికి గుదిబండగా మారాయి. గతంలో కలెక్టర్లకు మాత్రమే ఉన్న అధికారాలను భూభారతి ద్వారా ఆర్డీవోలు, తహశీల్దార్లకు అప్పగించడం అవినీతి కి కొత్త ద్వారాలు తెరిచినట్లయిందని విమర్శలు వస్తున్నాయి. గతంలో కేవలం క్లిక్ 'తో అయ్యే పనులకు కూడా ఇప్పుడు క్షేత్రస్థాయిలో పైరవీలు చేయాల్సి వస్తోంది. రికార్డుల తారుమారు, ఒకరి భూమిని మరొకరి పేరు మీదకు మార్చడం వంటి ఫిర్యాదులు తహశీల్దార్ కార్యాలయాల్లో వెల్లువెత్తుతున్నాయి. భూముల విలువ భారీగా ఉన్న ప్రాంతాల్లో రాజకీయ నాయకుల జోక్యం పెరిగి, అసలైన రైతులు అన్యాయానికి గురవుతున్నారు.
ప్రజల్లో పెరిగిపోతున్న అసంతృప్తి
భూభారతి వ్యవస్థ భూ సమస్యలకు పరిష్కారం కాకపోగా, అదనపు భారంగా మారుతోందనేది క్షేత్రస్థాయి వాస్తవం. ప్రజల నుండి వస్తున్న ప్రజావాణి దరఖాస్తుల్లో అత్యధికం భూ వివాదాలే ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ప్రభుత్వం ఇప్పటికైనా ప్రకటనల మోత తగ్గించి, సాంకేతిక లోపాలను యుద్ధప్రతిపాదికన సరిదిద్దాలి. నిరంతరం తహశీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న రైతులకు భరోసా కల్పించకపోతే, ఈ అసంతృప్తి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వానికి ప్రతికూలంగా మారే అవకాశం ఉంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు




















