Nashik TCS Case: టీసీఎస్ కేసులో పరారీలో ఉన్న నిదా ఖాన్ అరెస్టు.. ఫ్యామిలీతో కలిసి ఫ్లాట్లో దాక్కున్న నిందితురాలు
TCS మత మార్పిడి కేసు దర్యాప్తులో నాసిక్ పోలీసులు పురోగతి సాధించారు. పరారీలో ఉన్న నిందితురాలు నిదా ఖాన్ను అరెస్టు చేశారు. ఛత్రపతి శంభాజీనగర్లోని ఒక ఫ్లాట్లో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

Nashik TCS Case | నాసిక్: మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)లో బలవంతపు మత మార్పిడి, లైంగిక వేధింపులు, మానసిక వేధింపుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఐటీ దిగ్గజం టీసీఎస్లో మత మార్పిడుల కేసులో పరారీలో ఉన్న నిందితురాలు నిదా ఖాన్ను ఛత్రపతి శంభాజీనగర్లో పోలీసులు అరెస్టు చేశారు. నాసిక్ క్రైమ్ బ్రాంచ్, ఛత్రపతి శంభాజీనగర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టి ఆమెను అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటివరకూ ఆరుగుర్ని అరెస్ట్ చేశారు.
పోలీసులు అందించిన సమాచారం ప్రకారం, సంస్థలో మత మార్పిడులు, ప్రమోషన్ల విషయంలో మతపరమైన వేధింపుల విషయం వెలుగులోకి రావడంతో మార్చి 25 నుంచి పరారీలో ఉన్న నిదా ఖాన్ కోసం నాసిక్ పోలీసుల రెండు బృందాలుగా ఏర్పడి నిరంతరం శ్రమించాయి. చివరకు ఆమెను ఛత్రపతి శంభాజీనగర్లోని నారేగావ్ పరిధిలోని కైసర్ కాలనీలో ఉన్న ఒక ఫ్లాట్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కుటుంబంతో కలిసి ఫ్లాట్లో నిందితురాలు
ఛత్రపతి శంభాజీ నగర్లోని ఆ ఫ్లాట్లో ప్రధాన నిందితురాలు నిదా ఖాన్తో పాటు ఆమె తల్లి, తండ్రి, సోదరుడు, పిన్ని సహా మొత్తం ఐదుగురు నివసిస్తున్నారని పోలీసులు గుర్తించారు. అరెస్టు చేసిన తరువాత నిదా ఖాన్ను గురువారం (మే 7న) రాత్రి కోర్టులో హాజరుపరిచారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు కేసులో ఆమెపై తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు.
నిదా ఖాన్ బెయిల్ పిటిషన్ కొట్టివేత
అంతకుముందు స్థానిక కోర్టు నిందితురాలు నిదా ఖాన్ ముందస్తు బెయిల్ పిటిషన్ను రిజెక్ట్ చేసింది. ఇప్పటి వరకు జరిగిన విచారణ నివేదికను సిట్ అధికారులు కోర్టుకు సమర్పించారు. దాంతో కోర్టు నిదా ఖాన్ బెయిల్ను తీవ్రంగా వ్యతిరేకించింది. ఏప్రిల్ 20న నిదా ఖాన్కు మధ్యంతర రక్షణ కల్పించేందుకు కూడా కోర్టు నిరాకరించడం తెలిసిందే
ఈ కేసులో నిదా ఖాన్ కంటే ముందే పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు ఈ వ్యవహారంలో మొత్తం 9 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఒక కేసు దేవ్లాలీ క్యాంప్ పోలీస్ స్టేషన్లో నమోదు కాగా, మిగిలినవి ముంబై నాకాలో రిజిస్టర్ అయ్యాయి. టీసీఎస్ కేసులో ప్రధాన నిందితులుగా సైఫీ షేక్, రజా మెమన్ ఉన్నారు.
టీసీఎస్ కేసుపై సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఫోకస్
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ కేసును అత్యంత తీవ్రమైన అంశంగా పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపై విచారణ జరుపుతోందని, పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసినట్లు తెలిపారు. టెక్ హబ్ టీసీఎస్ సంస్థలో లైంగిక వేధింపులకు పాల్పడుతూ, ప్రజల మతపరమైన భావాలను ఎవరు దెబ్బతీస్తున్నారో తెలుసుకోవడానికి రాష్ట్ర ఏజెన్సీలు దర్యాప్తు చేసి పూర్తి స్థాయిలో నివేదికను సిద్ధం చేస్తున్నాయని సీఎం ఫడ్నవీస్ తెలిపారు.
ట్రెండింగ్ వార్తలు























