బజాజ్ ఫెస్టివ్ ప్లాన్ - కొత్త పల్సర్ 125, పల్సర్ 150తో పాటు 10 కొత్త టూవీలర్ మోడళ్లు
పండుగల సీజన్కు ముందే బజాజ్ ఆటో 10 కొత్త టూవీలర్ మోడళ్లను విడుదల చేయనుంది. ఇందులో కొత్త పల్సర్ 125 & 150 బైక్లు, కొత్త చేతక్ EV వేరియంట్లు కూడా ఉన్నాయి.

Bajaj Pulsar new models: యువత కోసం, బజాజ్ పల్సర్ సిరీస్లో త్వరలోనే రెండు కొత్త మోడళ్లు మార్కెట్లోకి రానున్నాయి. పండుగల సీజన్కు ముందే 125cc & 150cc విభాగాల్లో సరికొత్త పల్సర్ బైక్లను విడుదల చేయనున్నట్లు బజాజ్ ఆటో అధికారికంగా ప్రకటించింది. వీటితో పాటు మొత్తం 10 కొత్త టూవీలర్ మోడళ్లను వచ్చే ఆరు వారాల్లో మార్కెట్లోకి తీసుకురానున్నట్లు వెల్లడించింది.
కంపెనీ తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాల సందర్భంగా జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ రాకేష్ శర్మ ఈ వివరాలను వెల్లడించారు. గత కొంతకాలంగా పలుసార్లు టెస్టింగ్లో కనిపించిన నెక్స్ట్ జనరేషన్ పల్సర్ 125 ఇప్పుడు అధికారికంగా విడుదలకు సిద్ధమవుతోంది. దీనితో పాటు 150సీసీ విభాగంలో కూడా కొత్త పల్సర్ మోడల్ను తీసుకురానున్నారు.
కొత్త పల్సర్ మోడళ్లతో పాటు చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్కు చెందిన మరికొన్ని కొత్త వేరియంట్లను కూడా కంపెనీ విడుదల చేయనుంది. వచ్చే ఆరు నెలల్లో ఇవి ఎంతో ఆసక్తికరమైన ఉత్పత్తులుగా నిలుస్తాయని, కొత్త మార్కెట్ విభాగాల్లోకి ప్రవేశించేందుకు ఇవి దోహదపడతాయని కంపెనీ తెలిపింది.
కొత్త వాహనాల విడుదలకే పరిమితం కాకుండా ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా గణనీయంగా పెంచాలని బజాజ్ ఆటో నిర్ణయించింది. ప్రస్తుతం కంపెనీ ఏడాదికి సుమారు 72 లక్షల వాహనాలను తయారు చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీనిని దశలవారీగా 90 లక్షలకు పైగా పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంటే ప్రస్తుతం ఉన్న సామర్థ్యంతో పోలిస్తే 25 శాతానికి పైగా వృద్ధి సాధించనుంది.
ఇది కూడా చదవండి: నార్టన్ అట్లాస్ ఫస్ట్ రైడ్ - 585cc ట్విన్ ఇంజిన్, ప్రీమియం ఫీచర్లతో ఈ బండి మామూలుగా లేదుగా!
ఈ విస్తరణలో ఇప్పటికే ఉన్న తయారీ కేంద్రాల్లో విస్తరణ చేపట్టడంతో పాటు కొత్త గ్రీన్ఫీల్డ్ ప్లాంట్ను కూడా ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. అయితే కొత్త ప్లాంట్ను ఏ ప్రాంతంలో ఏర్పాటు చేయనున్నారనే విషయాన్ని కంపెనీ ఇంకా వెల్లడించలేదు.
పెరిగే ఉత్పత్తి సామర్థ్యాన్ని ప్రధానంగా ఎలక్ట్రిక్ టూవీలర్లు, ఎలక్ట్రిక్ త్రీ వీలర్లు, ప్రీమియం మోటార్సైకిళ్లు & ఎంపిక చేసిన ICE త్రీ వీలర్ల తయారీకి వినియోగించనున్నట్లు తెలిపింది. దీంతో భవిష్యత్తులో పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా మార్కెట్కు మరిన్ని కొత్త మోడళ్లను అందించే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: ఫుల్ ఛార్జ్పై 683 కిలోమీటర్ల రేంజ్ కారు కొన్న స్టార్ హీరో.. Mahindra BE 6 సేఫ్టీలో ది బెస్ట్
కంపెనీ ఛైర్మన్ నీరజ్ బజాజ్ ఇప్పటికే ప్రకటించిన FY27 వ్యూహంలో 125సీసీకి పైబడిన దేశీయ మోటార్సైకిల్ మార్కెట్పై ప్రత్యేక దృష్టి, చేతక్ EV వ్యాపార విస్తరణ & ఎగుమతుల పెంపు అనే మూడు ప్రధాన లక్ష్యాలను నిర్దేశించారు. తాజా ప్రకటనలు కూడా అదే వ్యూహానికి కొనసాగింపుగా కనిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే, FY27 తొలి త్రైమాసికంలో బజాజ్ ఆటో రికార్డు స్థాయి పనితీరును నమోదు చేసింది. కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం గత ఏడాదితో పోలిస్తే 37 శాతం పెరిగి రూ.17,244 కోట్లకు చేరుకుంది. మొత్తం వాహనాల విక్రయాలు 14.4 లక్షల యూనిట్లకు చేరుకుని కొత్త రికార్డు సృష్టించాయి. అదే సమయంలో ఎగుమతులు కూడా 52 శాతం పెరిగి కంపెనీ చరిత్రలోనే అత్యధిక త్రైమాసిక స్థాయిని నమోదు చేశాయి. ఈ నేపథ్యంలో కొత్త పల్సర్ మోడళ్లపై యువతలో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్ని ఫాలో అవ్వండి.
ట్రెండింగ్ వార్తలు






















