KCR : కేసీఆర్ స్పందనపైనే అందరి చూపు - సిట్ ఎదుట హాజరవుతారా? ఏ ప్లేస్ను ఎంపిక చేసుకుంటారు?
SIT notices to KCR: ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సిట్ నోటీసులు జారీ చేయడం తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. హాజరవుతారా లేదా అన్నదానిపై ఇంకా బీఆర్ఎస్ ప్రకటన చేయలేదు.

What is KCR Plan: తెలంగాణను దశాబ్ద కాలం పాటు పాలించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు జారీ చేయడం రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించింది. ఈ నెల 30న శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరుకావాలని అధికారులు కోరారు. అయితే, ఆయన వయస్సు రీత్యా సెక్షన్ 160 CrPC ప్రకారం విచారణ ఎక్కడ జరగాలనేది ఎంచుకునే వెసులుబాటును పోలీసులు కల్పించారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో గానీ లేదా ఆయనకు అనువైన మరో ప్రదేశంలో గానీ విచారణకు సహకరించవచ్చని ఆఫర్ ఇచ్చారు. ఇప్పుడు అందరి దృష్టి కేసీఆర్ నిర్ణయంపైనే ఉంది. ఆయన స్వయంగా పోలీస్ స్టేషన్కు వెళ్లి తన నిరసనను మౌనంగానే చాటుతారా, లేక ఎర్రవల్లి ఫామ్హౌస్లో అధికారులను కలవాలని నిర్ణయించుకుంటారా అనేది ఉత్కంఠగా మారింది. అయితే హైదరాబాద్ పరిధిలోనే విచారణకు రావాల్సి ఉంటుందికాబట్టి ఫామ్ హౌస్ లో కుదరదని.. బీఆర్ఎస్ భవన్ లేదా ..నందినగర్ నివాసం ఏదైనా ఎంచుకోవచ్చని అంచనా వేస్తున్నారు.
విచారణకు హాజరవుతారా? వాయిదా కోరతారా?
సాధారణంగా ఇలాంటి కీలక కేసుల్లో విచారణకు హాజరై తమకేమీ తెలియదని సమాధానం చెప్పడం ద్వారా ఆ ప్రక్రియను ముగించాలని నాయకులు భావిస్తుంటారు. ఇప్పటికే హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావు వంటి నేతలు సిట్ ముందుకు వెళ్లి సుదీర్ఘంగా సమాధానాలిచ్చారు. అయితే కేసీఆర్ ఒక అడుగు ముందుకు వేసి, పోలీసుల మినహాయింపులను పక్కన పెట్టి నేరుగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కే వెళ్లే అవకాశం లేకపోలేదు. తద్వారా ప్రభుత్వం తనను వేధిస్తోందనే పొలిటికల్ విక్టిమ్ కార్డును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లవచ్చని బీఆర్ఎస్ భావిస్తోంది. ఒకవేళ ఆరోగ్య కారణాలు లేదా ఇతర విచారణల దృష్ట్యా వాయిదా కోరితే, అది ప్రభుత్వం చేతికి అస్త్రం ఇచ్చినట్లవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
మున్సిపల్ ఎన్నికల వేళ ఫోన్ ట్యాపింగ్' అస్త్రం
తెలంగాణలో ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ నడుస్తోంది. ఈ సమయం ఈ నోటీసులు రావడం యాదృచ్ఛికం కాదని బీఆర్ఎస్ నేతల వాదన . గత ప్రభుత్వ హయాంలో వేలాది ఫోన్లు ట్యాప్ అయ్యాయని, ఆ వ్యవహారం వెనుక పెద్దాయన ఉన్నారనే ఆరోపణలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తోంది. ముఖ్యంగా సింగరేణి బొగ్గు కుంభకోణం వంటి ఇతర అంశాలపై ప్రతిపక్షం చేస్తున్న దాడిని తిప్పికొట్టడానికి, ప్రజల దృష్టిని మళ్లించడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ కేసును పదునైన ఆయుధంగా వాడుకుంటోంది. విచారణ పేరుతో కేసీఆర్ను ఇరకాటంలో పెట్టడం ద్వారా బీఆర్ఎస్ క్యాడర్ను నైతికంగా దెబ్బతీయవచ్చనేది అధికార పక్షం వ్యూహంగా కనిపిస్తోంది.
ఆత్మగౌరవ పోరాటంగా బీఆర్ఎస్ కౌంటర్
మరోవైపు, బీఆర్ఎస్ శ్రేణులు ఈ నోటీసులను 'తెలంగాణ ఆత్మగౌరవం'పై జరిగిన దాడిలా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాయి. స్వరాష్ట్ర కాంక్షను నెరవేర్చిన నాయకుడిని నేరస్థుడిలా విచారించడం అంటే తెలంగాణను అవమానించడమేనని హరీష్ రావు వంటి నేతలు గట్టిగా వాదిస్తున్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, ఈ కక్షసాధింపు చర్యలకు ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరిస్తున్నారు. అటు ప్రభుత్వం తన దర్యాప్తు సంస్థల ద్వారా 'కుట్ర కోణాన్ని' బయటపెట్టాలని చూస్తుంటే, ఇటు బీఆర్ఎస్ దీనిని రాజకీయ వేధింపుల పర్వంగా మలిచి సానుభూతి పొందేందుకు సిద్ధమవుతోంది. మొత్తంమీద, జనవరి 30వ తేదీ తెలంగాణ రాజకీయాల్లో ఒక కీలక మలుపు కాబోతోంది
.























