Rinku Singh Replacement: రింకూ సింగ్ జింబాబ్వేతో మ్యాచ్ ఆడకపోతే ఆ ఇద్దరిలో ఒకరికి ఛాన్స్
India vs zimbabwe super 8 | జింబాబ్వేతో సూపర్ 8 మ్యాచ్కు ముందు భారత్కు ఎదురుదెబ్బ తగిలింది. తండ్రికి అనారోగ్యం కారణంగా రింకూ సింగ్ జట్టుకు తాత్కాలికంగా దూరమైన జింబాబ్వేతో మ్యాచ్ అతడు ఆడటం అనుమానమే.

చెన్నై: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో ఇండియా ముందున్న తొలి సవాల్ జింబాబ్వే. ఫిబ్రవరి 26న చెన్నైలోని ఎం.ఏ. చిదంబరం స్టేడియంలో భారత్, జింబాబ్వే జట్లు తలపడనున్నాయి. సూపర్-8లో ఒక ఓటమి తర్వాత భారత్కు ప్రతి మ్యాచ్ ‘డూ ఆర్ డై’ లాంటిదే. దాంతో గురువారం జరగనున్న ఈ మ్యాచ్ టీమిండియాకు అత్యంత కీలకం కానుంది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచులో భారీ తేడాతో ఓటమి చెందడం జట్టుకు మైనస్ అయింది.
ఇదే సమయంలో భారత జట్టుకు మరో షాక్ తగిలింది. బ్యాటర్ రింకూ సింగ్ ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా జట్టుకు తాత్కాలికంగా దూరమయ్యాడు. రింకూ తండ్రి ఆరోగ్యం విషమంగా ఉందని, ఆయనను ఆసుపత్రిలో చేర్పించినట్లు సమాచారం. లివర్ ప్రాబ్లమ్ తో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న తండ్రిని చూసేందుకు, కుటుంబానికి మద్దతుగా నిలిచేందుకు రింకూ సింగ్ తన స్వస్థలానికి వెళ్లిపోయాడు. దాంతో జింబాబ్వేతో జరిగే మ్యాచ్లో రింకూ ఆడటం అనుమానమే. అయితే అతడి స్థానంలో జట్టులోకి ఎవరు వస్తారు అనేదానిపై చర్చ జరుగుతోంది.
ఆప్షన్ నంబర్-1: అక్షర్ పటేల్
ఈ మ్యాచ్కు రింకూ సింగ్ అందుబాటులో లేకపోతే, కచ్చితంగా అక్షర్ పటేల్ అతడికి ప్రత్యామ్నాయం కావచ్చు. దాంతో పాటు బౌలింగ్ కూడా చేస్తాడు. చెన్నై పిచ్ సాధారణంగా స్పిన్ బౌలర్లకు సహకరిస్తుంది. కనుక ఈ పరిస్థితిలో అక్షర్ జట్టుకు అదనపు స్పిన్ ఆప్షన్గా మారతాడు. అక్షర్ను జట్టులోకి తీసుకుంటే భారత్ నలుగురు ఆల్రౌండర్లతో (శివం దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్) బరిలోకి దిగవచ్చు. దీనివల్ల బ్యాటింగ్ డెప్త్ పెరగడమే కాకుండా బౌలింగ్లోనూ బ్యాలెన్స్ వస్తుంది. జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్ ఫాస్ట్ బౌలింగ్ బాధ్యతల్ని కొనసాగిస్తారు. వారికి పాండ్యా తోడవుతాడు.
ఆప్షన్ నంబర్-2: సంజూ శాంసన్
రింకూ లేకపోతే రెండవ ప్రత్యామ్నాయం సంజూ శాంసన్. సంజూ దూకుడుగా ఆడే బ్యాటర్. అవసరమైతే ఇన్నింగ్స్ ప్రారంభించగల ప్లేయర్. మిడిల్ ఆర్డర్లో కూడా బ్యాటింగ్ చేస్తాడు. టీమ్ మేనేజ్మెంట్ బ్యాటింగ్ను మరింత బలోపేతం చేయాలనుకుంటే ఈ మ్యాచులో సంజూకు అవకాశం ఇవ్వవచ్చు. దీనివల్ల భారీ షాట్లు ఆడగల అదనపు బ్యాటర్ భారత్కు అందుబాటులోకి వస్తాడు.
మ్యాచ్ సూర్య సేనకు కీలకం
భారత్కు ఈ మ్యాచ్ కేవలం మరో లీగ్ మ్యాచ్ మాత్రమే కాదు, సెమీఫైనల్ ఆశలు సజీవంగా నిలవాంటే భారీ విజయంతో నెగ్గాలి. నెట్ రన్ రేట్ను మెరుగుపరుచుకోవడానికి భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. అయితే బీసీసీఐ మేనేజ్ మెంట్ బ్యాటింగ్ బలాన్ని నమ్ముకుంటుందా, లేక ఆల్ రౌండర్ అక్షర్ ను జట్టులోకి తీసుకుంటుందా ఇప్పుడే చెప్పలేం. కానీ జింబాబ్వేపై సూర్యకుమార్ సేన అద్భుత విజయాన్ని సాధిస్తే ఆశలు సజీవంగా ఉంటాయి.





















