IPL 2026: ఐపీఎల్ టికెట్ల విక్రయాలు ఎప్పుడు ప్రారంభమవుతాయి? ఎలా బుక్ చేసుకోవాలి
IPL 2026 Ticket Booking: IPLలో మొదటి 20 మ్యాచ్ల షెడ్యూల్ విడుదల కాగా, ఈ టోర్నమెంట్ మార్చి 28న ప్రారంభం కానుంది. టికెట్ బుకింగ్ల ప్రక్రియ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

IPL 2026 Ticket Booking Details: టీ20 వరల్డ్ కప్ ముగిసిన తరువాత క్రికెట్ ప్రేమికులకు ఐపీఎల్ సీజన్ వచ్చేస్తోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ ఎడిషన్ షెడ్యూల్ BCCI విడుదల చేసింది. ఈ సీజన్ మార్చి 28 నుండి ప్రారంభం కానుంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఐపీఎల్ 2026 మొదటి 20 మ్యాచ్ల షెడ్యూల్ను విడుదల చేసింది.
ఐపీఎల్ 2026 సీజన్ తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్రైజర్స్ హైదరాబాద్ (RCB vs SRH) మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో జరుగుతుంది. షెడ్యూల్ ప్రకటించడంతో, టిక్కెట్ల విక్రయం ఎప్పుడు ప్రారంభమవుతుంది. ధరలు ఎలా ఉంటాయో తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఐపీఎల్ 2026 టిక్కెట్లు ఎక్కడ బుక్ చేసుకోవాలి?
ప్రస్తుతానికి టిక్కెట్ల విక్రయానికి సంబంధించి బీసీసీఐ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే Zomato కు చెందిన District యాప్లో ఐపీఎల్ టిక్కెట్ల (IPL Tickets) కోసం ప్రత్యేక సెక్షన్ కేటాయించారు. అక్కడ ప్రస్తుతం Coming Soon అని కనిపిస్తోంది. ఇది గమనిస్తే త్వరలోనే ఐపీఎల్ 2026 టిక్కెట్ల విక్రయ సమాచారం అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. మరోవైపు, BookMyShow ఐపీఎల్ టిక్కెట్ల కోసం ప్రీ-సేల్ రిజిస్ట్రేషన్ను ప్రారంభించింది. క్రికెట్ అభిమానులు ప్రస్తుతం అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే గుజరాత్ టైటాన్స్ మ్యాచ్లు, వాంఖడే స్టేడియంలో జరిగే ముంబై ఇండియన్స్ (Mumbai Indians) మ్యాచ్ల కోసం రిజిస్టర్ చేసుకోవచ్చు.
🚨 News 🚨
— IndianPremierLeague (@IPL) March 11, 2026
Presenting the schedule for the first 20 matches of #TATAIPL 2026, to be played from March 28 to April 12, 2026 🗓️
Full schedule will be announced once poll dates are announced for three states set to undergo State Assembly elections.
More details ▶️… pic.twitter.com/8Iq492v8TE
ఐపీఎల్ 2026 టిక్కెట్ల ధరలు ఎంత ఉంటాయి
ఐపీఎల్ 2026 మ్యాచ్ల టిక్కెట్ల ధరలు రూ. 500 నుండి ప్రారంభమై వేలల్లో ఉంటాయి. ఎం. చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హోమ్ మ్యాచ్ల టిక్కెట్లు సుమారు రూ. 2300 నుండి రూ. 2800 ధరలో ప్రారంభమవుతాయి. మిడ్-రేంజ్ సీట్లు సుమారు రూ. 3500 నుండి రూ. 7500 వరకు ఉంటాయి. ప్రీమియం సీట్లు (పవిలియన్ లేదా టెర్రస్) రూ. 8000 నుండి రూ. 15000 వరకు ఉండే అవకాశం ఉంది. ఎవరైనా లగ్జరీ సీటు కావాలనుకుంటే, టిక్కెట్ ధర రూ. 30000 పైగా ఖర్చు చేయాలి.
ఐపీఎల్ 2026 షెడ్యూల్ రెండు భాగాలుగా ఎందుకు ?
భారత్లోని కొన్ని రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ ప్రస్తుతం ఐపీఎల్ 2026 (IPL 2026)కి సంబంధించి కేవలం 20 మ్యాచ్ల షెడ్యూల్ను మాత్రమే ప్రకటించింది. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ ప్రభావం క్రికెటర్లు, కోచ్, ఇతర సిబ్బంది ప్రయాణాలపై పడింది. ‘భారత్లో జరిగిన టీ20 వరల్డ్ కప్ తర్వాత వెస్టిండీస్ జట్టు స్వదేశానికి తిరిగి వెళ్లడంలో సైతం ఇబ్బందులు ఎదురయ్యాయి. ఎందుకంటే ఆ ప్రాంతంలో పలు విమానాలు రద్దయ్యాయి’ అని ఐపీఎల్ సంబంధిత అధికారి ఒకరు తెలిపారు.
‘మేం ప్రస్తుతం పరిస్థితిని గమనిస్తున్నాం. ఇది ఆందోళన కలిగించే విషయమే. అయితే ప్రస్తుతానికి పరిస్థితులు అదుపులోనే ఉన్నాయి. ఏ హోటల్, ఎయిర్లైన్ లేదా సంబంధిత విభాగం ఇప్పటివరకు ఎటువంటి ఆందోళన వ్యక్తం చేయలేదు. కానీ త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్ సీజన్కు సంబంధించి నిరంతరం యుద్ధం సమాచారంపై నిఘా ఉంచాం’ అని ఆయన పేర్కొన్నారు.





















