YSRCP Kapu Leaders Revolt: వైసీపీలో కాపు సంచలనం - జగన్ బాటకు తోట, బొత్స బైబై? కాపు ఐక్యత వెనుక అసలు కథ!
Kapu Reservation Demand: వైఎస్సార్సీపీకి సొంత కాపు నేతలే షాక్ ఇస్తున్నారా?. కాపు రిజర్వేషన్లను తీసేసిన జగన్ పార్టీలో ఉంటూ.. రిజర్వేషన్లపై పోరాటం సాధ్యమేనా?

Mudragada Memorial Kapu Unity: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కుల సమీకరణాలు ఎప్పుడూ కీలక పాత్ర పోషిస్తూంటాయి. 2024 ఎన్నికల ఘోర పరాజయం తర్వాత తీవ్ర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు స్వపక్షంలోని ప్రముఖ కాపు నాయకుల వైఖరి సరికొత్త గుబులు పుట్టిస్తోంది. పార్టీ అధిష్ఠానంతో, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ వ్యూహాలతో సంబంధం లేకుండా కాపు ఐక్యత జెండాను భుజానకెత్తుకుంటున్న సొంత పార్టీ సీనియర్ల తీరు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో తీవ్ర ఉత్కంఠకు, ఆందోళనకు దారితీస్తోంది.
ముఖ్యంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న సీనియర్ నేత, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అనుసరిస్తున్న స్వతంత్ర వైఖరి వైసీపీ పెద్దలకు ఏమాత్రం మింగుడుపడటం లేదు. ఒకవైపు అంబటి రాంబాబు వంటి నేతలు కాపు ఓట్లతో సంబంధం లేదన్నట్లుగా లేదా పార్టీ అధికారిక లైన్కు అనుగుణంగా మాట్లాడుతుంటే, తోట త్రిమూర్తులు మాత్రం దానికి పూర్తి భిన్నమైన దారిలో పయనిస్తున్నారు. ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలను వేదికగా చేసుకుని, పార్టీలతీతంగా కాపు నేతలందరూ ఒకే వేదికపైకి రావాలని ఆయన బహిరంగంగా పిలుపునిచ్చారు. దానికి తోడు విజయవాడలో టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమ నిర్వహించే కాపుల ఐక్యత సభకు తాను హాజరవుతానని స్పష్టం చేయడం ద్వారా పార్టీ గీతను పూర్తిగా దాటేశారు. పైగా కాపు రిజర్వేషన్ల అంశంలో పార్టీకి పూర్తిగా భిన్నమైన వైఖరి ఎంచుకున్నారు.
రాజకీయ మనుగడ కోసం కొత్తదారి వెదుక్కుంటున్నారా?
ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి గోదావరి జిల్లాల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి వైపు కాపు సామాజికవర్గం ఏకపక్షంగా మొగ్గుచూపింది. జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రభావంతో గోదావరి జిల్లాల్లో వైసీపీ డిపాజిట్లు కూడా కోల్పోయే పరిస్థితి వచ్చింది. కేవలం పార్టీ అధినేత జగన్ నిర్ణయాలపై ఆధారపడి ఉంటే రాబోయే రోజుల్లో తమ రాజకీయ ఉనికికే ప్రమాదమని భావించిన ఈ నేతలు, సామాజిక వర్గ భవిష్యత్తు పేరిట స్వతంత్రంగా అడుగులు వేయాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టమవుతోంది. అధికార కూటమిలోని కాపు నేతలతో చేతులు కలపడం ద్వారా తమ రాజకీయ మనుగడకు కొత్త దారి వెతుక్కుంటున్నారు.
హక్కులను అడుక్కోకూడదు..లాక్కోవాలంటున్న బొత్స !
ఈ అనుమానాలకు మరింత ఆజ్యం పోస్తూ సీనియర్ నేత, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు కూడా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కులానికి మేలు జరగాలంటే హక్కులను అడుక్కోకూడదు.. పోరాడి లాక్కునే శక్తి ఉండాలి అంటూ బొత్స చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు పరోక్షంగా వైసీపీ విధానాలపైనా, భవిష్యత్ రాజకీయ పంథాపైనా బలమైన సంకేతాలు ఇస్తున్నాయనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ముద్రగడ సంస్మరణ వేదికపై బొత్స సత్యనారాయణ, తోట త్రిమూర్తులు, జ్యోతుల నెహ్రూ వంటి విభిన్న పార్టీల నాయకులు ఒకే వేదిక పంచుకోవడం రాబోయే రోజుల్లో ఒక కొత్త కాపు రాజకీయ వేదిక ఏర్పాటుకు పునాది అని భావిస్తున్నారు.
గత ప్రభుత్వ హయాంలో ప్రాధాన్యత లభించినప్పటికీ, సామాజిక వర్గ ప్రయోజనాలు , నియోజకవర్గాల్లో మనుగడ విషయానికి వచ్చేసరికి సొంత పార్టీ నిర్ణయాలు తమకు నష్టం చేకూరుస్తున్నాయని ఈ నేతలు భావిస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి అనుసరిస్తున్న ఏకపక్ష రాజకీయ శైలితో వెళ్తే రాబోయే రోజుల్లో గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో నిలదొక్కుకోవడం అసాధ్యమనే ముగింపునకు వచ్చినట్లుగా చెబుతున్నారు. అందుకే, "కాపు అజెండా"ను ప్రధాన ఆయుధంగా వాడుకుని, త్వరలోనే వైసీపీకి బిగ్ షాక్ ఇచ్చి ప్రత్యామ్నాయ రాజకీయ మార్గాన్ని లేదా కూటమి వైపు మొగ్గు చూపే బాటను సుగమం చేసుకుంటున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైఎస్సార్సీపీలో కాపు నేతల ఈ కొత్త పంథా కేవలం సామాజిక ఆత్మగౌరవ పోరాటమా లేక ముందస్తు రాజకీయ పునరేకీకరణ సంకేతమా అనే చర్చ ఊపందుకుంది. ప్రతిపక్షంగా పార్టీని పునరుద్ధరించడానికి జగన్ మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్న తరుణంలో, కీలకమైన గోదావరి జిల్లాలకు చెందిన కాపు ముఖాలు పార్టీ గీతను పక్కనబెట్టి సొంత అజెండాతో ముందుకు వెళ్లడం వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బగా మారనుంది. రాబోయే రోజుల్లో విజయవాడ సభ వేదికగా ఈ నేతలు వేసే అడుగులు ఏపీ రాజకీయ సమీకరణాలను ఏ విధంగా మారుస్తాయో వేచి చూడాలి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















