TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్ఆర్సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Polavaram Project Completion Date: పోలవరం ప్రాజెక్ట్ పై క్రెడిట్ వార్ ప్రారంభమయింది. టీడీపీ,వైసీపీ తమ ఘనతేనని చెప్పుకుంటున్నాయి. అయితే రైతులు మాత్రం నీళ్లు ఎప్పుడొస్తాయన్నదే చూస్తున్నారు.

Central Govt Polavaram Funds: ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టు మళ్లీ వార్తలకెెక్కింది. కేంద్ర ప్రభుత్వం పోలవరం ఫేజ్-1 నిర్మాణ సవరించిన అంచనా వ్యయానికి రూ.30,436.95 కోట్లు ఆమోదించడం, దాదాపు రూ.12,157 కోట్లకు పైగా బ్యాలెన్స్ గ్రాంట్ను ఖరారు చేయడంతో రాష్ట్రంలో క్రెడిట్ గేమ్ జోరందుకుంది. కేంద్రంలో పట్టుబట్టి, ఎన్డీయే భాగస్వామిగా ఒత్తిడి తెచ్చి పోలవరానికి రూ.12,000 కోట్లకు పైగా ప్రత్యేక నిధులు తీసుకువచ్చామని, ప్రాజెక్టును మళ్లీ పట్టాలెక్కించామని అధికార కూటమి ప్రచారం చేసుకుంటోంది. మరోవైపు, తమ హయాంలోనే ఫేజ్-1 ప్రతిపాదనలను కేంద్రానికి సమర్పించి, 41.15 మీటర్ల పరిమితికి అనుగుణంగా సాంకేతిక అనుమతులు సాధించామని, ఆ కష్టఫలమే నేడు కేంద్రం ఇచ్చిన ఆమోదమని వైఎస్ఆర్సీపీ తమ ఖాతాలో వేసుకునే యత్నం చేస్తోంది.
జగన్ హయాంలో 2 శాతం కూడా పూర్తి చేయలేదన్న టీడీపీ
ఈ పొలిటికల్ డిబేట్లో ఇరుపక్షాలు విసురుకుంటున్న ఆరోపణలు, ప్రత్యారోపణలు క్షేత్రస్థాయి వాస్తవాలను దాచిపెడుతున్నాయి. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం 70 శాతానికి పైగా పనులు పూర్తి చేసిందని, డయాఫ్రమ్ వాల్తో సహా ప్రధాన నిర్మాణాలను వేగవంతం చేసిందని టీడీపీ శ్రేణులు చెప్తున్నాయి. కానీ, 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ రివర్స్ టెండరింగ్ పేరుతో ఏజెన్సీని మార్చడం వల్ల ప్రాజెక్టు ఆలస్యమైందని, 2020 గోదావరి వరదల్లో డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి జగన్ సర్కార్ అజ్ఞానమే కారణమని టీడీపీ తీవ్రంగా కౌంటర్ ఇస్తోంది. దానికి పోటీగా, పోలవరం కాంట్రాక్టులను నాటి టీడీపీ ప్రభుత్వం తమ అనుకూల ఏజెన్సీలకు కట్టబెట్టి అంచనాలు పెంచేసిందని, తాము వచ్చి అవినీతిని అరికట్టి నిధులను సద్వినియోగం చేశామని వైఎస్ఆర్సీపీ కౌంటర్ ఇస్తోంది.
ప్రాజెక్ట్ ఇంకా పూర్తి కావాల్సి ఉంది!
ఈ క్రెడిట్ గేమ్ లో పొలిటికల్ లీడర్లు ఎవరు పైచేయి సాధించినా.. ప్రజా క్షేత్రంలో మాత్రం అసలైన విజేత ప్రాజెక్టు పూర్తయినప్పుడే తేలుతుంది. కేవలం మాటల విన్యాసాల వల్ల ఓటర్లు ఓట్లేయరనేది గత అనుభవాలు నిరూపించాయి. జగన్ హయాంలో రివర్స్ టెండరింగ్ వల్ల ప్రాజెక్టు ఐదేళ్లు వెనక్కి వెళ్లడమే కాకుండా, రూ.15,000 కోట్ల మేర ఆర్థిక నష్టం జరిగిందనే ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్లింది. అందుకే, ఇప్పుడు మళ్లీ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం క్రెడిట్ దక్కించుకోవాలంటే కేవలం వైఎస్ఆర్సీపీపై నిందలు వేస్తే సరిపోదు; అనుకున్న గడువులోగా గ్రావిటీ ద్వారా నీళ్లను అందించాల్సి ఉంటుంది.
పోలవరం ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుంది?
రైతుల్లో అసలు ప్రశ్న.. పోలవరం ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు ఫలాలు ఎప్పుడు అందుతాయి?
కేంద్ర జలశక్తి శాఖ రాజ్యసభ వేదికగా స్పష్టం చేసిన వివరాల ప్రకారం, ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు స్పిల్వే కాంక్రీట్ పనులు 98.84%, ప్రధాన కాలువల తవ్వకం 98.96% వరకు పూర్తయ్యాయి. అయితే, దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ స్థానంలో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం, ఎర్త్-కమ్-రాక్ఫిల్ డ్యామ్ నిర్మాణం పూర్తికావడం అత్యంత కీలకమైన సవాలు. కేంద్ర జలశక్తి శాఖ అంచనాల ప్రకారం తొలి దశ 41.15 మీటర్ల నీటి మట్టం పనులను అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అవసరమైతే మరొక ఏడాది కాలపరిమితి పెరిగినా.. 2027 నాటికి తొలి దశ నీటిని నిల్వ చేసి, కాలువల ద్వారా నీటిని విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది.
రైతుల పునరావాస ప్యాకేజీ అత్యంత కీలకం
అయితే, పోలవరం కేవలం కాంక్రీట్ నిర్మాణం మాత్రమే కాదు, అది వేలాది మంది గిరిజనులు, రైతుల పునరావాస సమస్య. ఫేజ్-1 లో దాదాపు 96,660 నిర్వాసిత కుటుంబాలు ఉండగా, ఇప్పటివరకు కేవలం 17,892 కుటుంబాలకు మాత్రమే పునరావాసం కల్పించారు. నీరు నిల్వ చేయాలంటే మిగిలిన వేలాది కుటుంబాలకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీలు ఇచ్చి ఖాళీ చేయించాలి. కాబట్టి, డ్యామ్ నిర్మాణం 2026-27 నాటికి పూర్తయినా, నిర్వాసితులకు పరిహారం చెల్లించి, నిధుల సమస్య లేకుండా పునరావాసం పూర్తి చేస్తేనే రైతులకు పూర్తిస్థాయిలో నీటి ఫలాలు అందుతాయి. రాజకీయం పక్కనపెట్టి, కేంద్రం ఇచ్చిన నిధులతో యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయడమే ఏపీ భవిష్యత్తుకు శ్రీరామరక్ష.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















