Chandrababu Speech Bhogapuram Airport Inauguration : 2027లో పోలవరం, 2028లో అమరావతి ప్రధాని చేతుల మీదుగానే ప్రారంభం - భోగాపురంలో చంద్రబాబు కీలక ప్రకటన
Bhogapuram Airport Inauguration: భోగాపురం ఎయిర్ పోర్టు తరహాలోనే వచ్చే రెండేళ్లలో పోలవరం, అమరావతి కూడా పూర్తి చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. ప్రధాని మోదీ చేతుల మీదుగానే ప్రారంభోత్సవం చేస్తామన్నారు.

Chandrababu Naidu Speech Bhogapuram Airport: భోగాపురం ఎయిర్ పోర్టును ప్రారంభించినట్లుగానే వచ్చే ఏడాది పోలవరం.. ఆ తర్వాత ఏడాది అమరావతిని ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభింపచేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేసిన చారిత్రాత్మక సందర్భంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యంత భావోద్వేగంతో ప్రసంగించారు. భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవ వేదికగా ఉత్తరాంధ్ర ఆత్మగౌరవాన్ని, ప్రగతి శక్తిని చాటిచెప్పిన సీఎం.. సముద్ర తీరానికి, పచ్చని కొండలకు నడుమ నిర్మితమైన ఈ విమానాశ్రయం విమాన ప్రయాణికులకు ఒక భూతల స్వర్గాన్ని, సరికొత్త అనుభూతిని అందిస్తుందని ఆనందం వ్యక్తం చేశారు.
ఎర్ర బస్ రాదన్నారు..ఎయిర్ బస్ తెచ్చాం!
గత పదేళ్ల విమానాశ్రయ నిర్మాణ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ సీఎం విపక్షాల విమర్శలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. . 2015లో ప్రధాని మోదీ నాయకత్వంలో భోగాపురం ఎయిర్పోర్టును ప్రకటించి, అన్ని అనుమతులు సాధించి 2019లోనే శంకుస్థాపన చేశాం. నాడు ఈ ప్రాజెక్టుకు కొబ్బరికాయ కొట్టింది మనమే, నేడు పనులు పూర్తిచేసి గుమ్మడికాయ కట్టింది మనమే అని చంద్రబాబు గర్వంగా ప్రకటించారు. ఇక్కడ ఎర్రబస్సు కూడా రాదంటూ గతంలో అవహేళన చేసిన వారు ఈరోజు రాజకీయంగా అడ్రస్ లేకుండా పోయారని, ఆటంకాలు సృష్టించిన ప్రతి ఒక్కరి వైఫల్యాన్ని దాటుకుని ఉత్తరాంధ్రకు భారీ ఎయిర్ బస్ తెచ్చామని స్పష్టం చేశారు.
పోలవరం, అమరావతిని పూర్తి చేస్తాం!
ఇదే వేదికపై నుంచి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి రెండు కీలకమైన మైలురాళ్లను సీఎం చంద్రబాబు ప్రకటించి అందరినీ ఆకట్టుకున్నారు. రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేసి, 2027 నాటికి ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగానే జాతికి అంకితం చేస్తామని తెలిపారు. అలాగే, ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి మొదటి దశ నిర్మాణాత్మక పనులన్నింటినీ 2028 నాటికి పూర్తి చేసి, ప్రధాని సమక్షంలోనే అట్టహాసంగా ప్రారంభోత్సవం జరుపుతామని సీఎం పేర్కొన్నారు.
రెండేళ్ల వ్యవధిలోనే ఉత్తరాంధ్రకు 189 భారీ ప్రాజెక్టులు
ఉత్తరాంధ్ర పారిశ్రామిక రూపురేఖలు మార్చడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని వివరిస్తూ.. గడిచిన రెండేళ్ల వ్యవధిలోనే ఈ ప్రాంతానికి 189 భారీ ప్రాజెక్టులను ఆకర్షించామని చంద్రబాబు వెల్లడించారు. రూ.6.13 లక్షల కోట్ల విలువైన ఈ పెట్టుబడులు పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చితే ఉత్తరాంధ్రలోని 5.57 లక్షల మంది నిరుద్యోగ యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని గణాంకాలతో వివరించారు. భోగాపురం ఎయిర్పోర్టుకు భూములిచ్చిన రైతుల త్యాగం అమూల్యమైనదని, వారికి పాదాభివందనం చేస్తున్నానని అన్నారు.
విశాఖ ఎకనామిక్ నోడ్కు ఈ ఎయిర్పోర్టు ఒక గ్రోత్ ఇంజిన్
విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలను కలుపుతూ రూపుదిద్దుకుంటున్న విశాఖ ఎకనామిక్ నోడ్కు ఈ ఎయిర్పోర్టు ఒక గ్రోత్ ఇంజిన్గా మారుతుందని సీనియర్ రాజకీయనాయకులు, ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు. పర్యాటకం, ఐటీ, ఆటోమొబైల్ మరియు ఫార్మా రంగాల్లో గ్లోబల్ పెట్టుబడులను ఆకర్షించే సత్తా భోగాపురానికి ఉందని, కేంద్రంలో నరేంద్ర మోదీ అండదండలతో రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ అమరావతి, పోలవరంతో పాటు ఉత్తరాంధ్రను కూడా దేశంలోనే అగ్రగామిగా నిలబెడుతుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















