Telangana Politics: రేవంత్ ఫ్యామిలీపై బీఆర్ఎస్ ఆరోపణల దాడి - కౌంటర్ ఇవ్వడానికి ముందుకు రాని మంత్రులు- అసలేం జరుగుతోంది?
Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చేందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. రేవంత్ పై.. ఆయన కుటుంబంపై ఎన్ని ఆరోపణలు చేసినా సెలంట్ గా ఉంటున్నారు.

Congress Vs BRS: తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య జరుగుతున్న పొలిటికల్ వార్ రోజురోజుకూ ఉద్రిక్తంగా మారుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ , మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో ప్రతిపక్షం ప్రభుత్వంపై దాడిని పీక్స్కు తీసుకెళ్లింది. టెస్సరాక్ట్ భూ కేటాయింపుల వివాదం, మూసీ ప్రక్షాళన వ్యయం, సీఎం రేవంత్ రెడ్డి సోదరుల ప్రమేయం, లగచర్ల ఘటన, హైడ్రా కూల్చివేతలు తదితర అంశాలను ఆసరాగా చేసుకుని ప్రతిపక్షం రోజుకో ప్రెస్మీట్, సోషల్ మీడియా క్యాంపెయిన్లతో హోరెత్తిస్తోంది. అయితే, ఈ స్థాయి పొలిటికల్ అటాక్ను ఎదుర్కొని, ప్రభుత్వ ఇమేజ్ను కాపాడుకోవడంలో కాంగ్రెస్ పార్టీ వైపు స్పష్టమైన కమ్యూనికేషన్ గ్యాప్ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.
ఏకాకిగా శ్రీధర్ బాబు.. సరిపోని శాంత స్వభావం!
బీఆర్ఎస్ నేతలు గుప్పించే పొలిటికల్ ఆరోపణలను తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున ప్రధానంగా పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఒక్కరే మీడియా ముందుకు వస్తున్నారు. అయితే, శ్రీధర్ బాబు శైలి అత్యంత విద్యావంతమైనది, సాంకేతికాంశాల చుట్టూ తిరిగేది. ఆయన పాలసీ రూల్స్, చట్టపరమైన నిబంధనలను కూలంకషంగా వివరించినప్పటికీ.. బీఆర్ఎస్ నేతలు చేస్తున్న అగ్రెసివ్ , మాస్ పొలిటికల్ అటాక్ను కౌంటర్ చేయడానికి ఆ వివరణలు సరిపోవడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పొలిటికల్ ఆరోపణలకు సమాధానం పొలిటికల్ లాంగ్వేజ్లోనే ఉండాలి తప్ప, కేవలం టెక్నికల్ డిఫెన్స్ ఇవ్వడం వల్ల ప్రతిపక్షాలు సృష్టించే నెరేటివ్ జనాల్లోకి బలంగా వెళ్లే ప్రమాదం ఉందనేది క్యాడర్ భావన.
సైలెంట్ అయిన మంత్రులు.. సమన్వయ లోపమే కారణమా?
రేవంత్ కేబినెట్లో బలమైన వాగ్ధాటి, ప్రతిపక్షాలను ఉతికిఆరేయగల సీనియర్ నేతలు, మంత్రులు ఉన్నప్పటికీ.. ప్రతిపక్ష దాడిని ఎదుర్కొనే విషయంలో వారు మౌనం దాల్చడం గమనార్హం. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడిన పలువురు కీలక నేతలు, ప్రస్తుతం తమ తమ శాఖలకే పరిమితమవుతున్నారు తప్ప, ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణలను తిప్పికొట్టే బాధ్యతను తమ భుజాన వేసుకోవడం లేదు. దీని వెనుక పార్టీలోని అంతర్గత విభేదాలు, సమన్వయ లోపం ఉందా? లేక సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగే వరకు వేచి చూసే ధోరణి ఉందా? అనేది కాంగ్రెస్ వర్గాల్లోనే చర్చనీయాంశంగా మారింది.
సోషల్ మీడియా వార్లో బీఆర్ఎస్ దూకుడు – కాంగ్రెస్ వెనుకబాటు
నేటి రాజకీయాల్లో సోషల్ మీడియానే ప్రధాన ఆయుధం. కేటీఆర్, హరీష్ రావు ప్రతి ఆరోపణను ఎక్స్ , యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లలో ప విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. బిఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ అత్యంత సమర్థవంతంగా ప్రతికూల వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తుంటే.. కాంగ్రెస్ సోషల్ మీడియా వింగ్ మాత్రం దానికి తగిన స్థాయిలో, అంతే వేగంగా డిఫెన్స్ లేదా కౌంటర్ అటాక్ చేయలేకపోతోంది. సాంకేతిక ఆధారాలతో కౌంటర్ వీడియోలు వదలడంలో కాంగ్రెస్ తీవ్రంగా వెనుకబడిపోయింది.
రేవంత్ మార్క్ సింగిల్ హ్యాండ్ ఫైట్
ప్రభుత్వంపై ఆరోపణలు వచ్చిన ప్రతిసారీ సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా బహిరంగ సభల్లో లేదా ప్రత్యేకంగా నిర్వహించే సమావేశాల్లో తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. అయితే, ఒక ముఖ్యమంత్రి ప్రతి చిన్న ఆరోపణకూ సమాధానం చెప్పుకుంటూపోవడం రాజకీయంగా సరైన వ్యూహం కాదనేది పొలిటికల్ ఎక్స్పర్ట్స్ మాట. సీఎంకు మద్దతుగా ద్వితీయామ్నాయ నాయకత్వం , అధికారిక ప్రతినిధులు, మంత్రులు రంగంలోకి దిగి రోజువారీ దాడులను తిప్పికొట్టాలి. కానీ, కాంగ్రెస్లో సీఎం ఒక్కరే మాట్లాడటం, మిగిలిన వారంతా ప్రేక్షక పాత్ర పోషించడం వల్ల కేటీఆర్, హరీష్ రావుల దాడి మరింత పదునెక్కుతోంది. ప్రతిపక్షం చేసే దాడిని తక్కువగా అంచనా వేయడం అధికార పార్టీకి ఎప్పుడూ ప్రమాదకరమే. కేవలం దుద్దిళ్ల శ్రీధర్ బాబు సాంకేతిక వివరణలతో సరిపెట్టకుండా.. అగ్రెసివ్ పొలిటికల్ వాయిస్ ఉన్న నేతలతో ఒక ‘కమ్యూనికేషన్ వార్ రూమ్’ను కాంగ్రెస్ వెంటనే ఏర్పాటు చేయాల్సి ఉంది. కేటీఆర్, హరీష్ రావుల మైండ్ గేమ్కు చెక్ పెట్టాలంటే.. కాంగ్రెస్ తన కమ్యూనికేషన్ గ్యాప్ను భర్తీ చేసుకుని, కలెక్టివ్ అటాక్ మోడ్లోకి రావడం తక్షణ అవసరమని ఎక్కువ మంది భావిస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















