Cases against YSRCP leaders: రోజా , తోపుదుర్తి వంటి వారిపై విచారణలు ఎందుకు ఆలస్యం అవుతున్నాయి? ప్రభుత్వం వారిపై సాఫ్ట్ కార్నర్ చూపిస్తోందా?
Cases On Roja: వైసీపీ హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్రాలో నిధుల గోల్మాల్పై విజిలెన్స్ నివేదిక రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తీసుకునే చర్యలపై ఆసక్తి నెలకొంది.

Cases against YSRCP leaders being delayed : వైఎస్ఆర్సీపీ హయాంలో భారీ అవినీతి జరిగిందని టీడీపీ ఆరోపణలు చేసింది. అధికారంలోకి వచ్చాక విచారణలు చేయించింది. అలాంటి వాటిలో చాలా వరకూ ఇంకా చర్యలు ప్రారంభం కాలేదు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి చెందిన రాక్రీట్ సంస్థ, అలాగే క్రీడల మంత్రిగా రోజా నిర్వహించిన ఆడుదాం ఆంధ్రాలో భారీగా అక్రమాలు జరిగాయన్న రిపోర్టులు ప్ర్భుత్వం వద్ద ఉన్నాయి. కానీ చర్యలు తీసుకోవడం లేదు. ఈ అంశంపై టీడీపీ కార్యకర్తలు కూడా అసంతృప్తితో ఉన్నారు.
ఆడుదాం ఆంధ్రాలో అవినీతి తేల్చిన విజిలెన్స్
వైసీపీ ప్రభుత్వ హయాంలో గ్రామీణ క్రీడలను ప్రోత్సహించే పేరుతో చేపట్టిన ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం చివరకు నిధుల లూటీకి అడ్డాగా మారిందనే ఆరోపణలు ఇప్పుడు నిజమవుతున్నాయి. సుమారు రూ. 125 కోట్ల బడ్జెట్తో నిర్వహించిన ఈ వేడుకల్లో దాదాపు రూ. 40 నుంచి 60 కోట్ల వరకు అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ నివేదిక స్పష్టం చేసింది. ఈ సమగ్ర నివేదిక ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉండగా, ఇందులో మాజీ క్రీడల శాఖ మంత్రి ఆర్కే రోజా, అప్పటి శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి పాత్రపై కీలక ఆధారాలు లభ్యమైనట్లు తెలుస్తోంది. బ్రాండెడ్ కంపెనీల స్టిక్కర్లను వాడి అత్యంత నాణ్యత లేని బ్యాట్లు, బంతులు, టీ-షర్టులను సరఫరా చేశారని, అనేక చోట్ల అసలు కిట్లు పంపిణీ చేయకుండానే బిల్లులు డ్రా చేసుకున్నారని విచారణలో తేలింది. వసతులు, భోజన ఏర్పాట్ల పేరుతో కూడా భారీగా నిధులు దారి మళ్లినట్లు అధికారులు గుర్తించారు. విజేతలకు అందాల్సిన ప్రైజ్ మనీని పక్కదారి పట్టించడం, అర్హులైన క్రీడాకారులను కాదని వైసీపీ కార్యకర్తలను విజేతలుగా ప్రకటించడం వంటి వి ఆధారాలతో సహా వెలికి తీసినట్లుగా చెబుతున్నారు.
తోపుదుర్తి రాక్రీట్ సంస్థపైనా విచారణ పూర్తి
వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకగా చేపట్టిన నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకంలో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి చెందిన రాక్రీట్ సంస్థ భారీ అక్రమాలకు పాల్పడిందని విచారణలో తేలింది. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తన కుటుంబ సభ్యుల పేరిట ఉన్న రాక్రీట్ సంస్థను రంగంలోకి దించారు. సాధారణ పద్ధతిలో ఇళ్ల నిర్మాణం కాకుండా, 'ప్రీ-కాస్ట్' టెక్నాలజీతో వేగంగా ఇళ్లు నిర్మిస్తామని ప్రభుత్వం వద్ద నమ్మబలికారు. ఇందుకు సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా దాదాపు రూ. 100 కోట్లకు పైగా అడ్వాన్సులను ప్రభుత్వం నుండి రాక్రీట్ సంస్థ పొందినట్లుగా తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తే.. అనేక చోట్ల పునాదులు కూడా పడలేదు, మరికొన్ని చోట్ల కేవలం పిల్లర్లు వేసి వదిలేశారు. ఒక్క ఇల్లు కూడా పూర్తిస్థాయిలో నివాస యోగ్యంగా నిర్మించలేదు. రాక్రీట్ సంస్థకు కేటాయించిన పనుల్లో కేవలం అడ్వాన్సుల రూపంలోనే కాకుండా, మెటీరియల్ సప్లై పేరుతో కూడా భారీగా దోపిడీ జరిగినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ప్రభుత్వ ధనాన్ని ముందే డ్రా చేసుకున్న ఈ సంస్థ, ఆ నిధులను ఇళ్ల నిర్మాణానికి కాకుండా ఇతర వ్యాపారాలకు మళ్లించిందనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా తోపుదుర్తి సోదరులు తమ రాజకీయ పలుకుబడిని ఉపయోగించి, అధికారులపై ఒత్తిడి తెచ్చి పని పూర్తి కాకుండానే ఎం.బి రికార్డింగ్ చేయించి బిల్లులు చెల్లించుకున్నట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. ప్రస్తుతానికి నివేదిక ప్రభుత్వం వద్ ఉంది.
ప్రభుత్వం ఎందుకు మెత్తగా ఉంది?
నివేదికలు చేతికి వచ్చినా ప్రభుత్వం చర్యల్లో జాప్యం చేయడంపై టీడీపీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. అక్రమ మద్యం, ఇసుక దోపిడీ వంటి కేసుల్లో వేగంగా స్పందించిన సర్కార్.. ఇలాంటి రాజకీయ ప్రాధాన్యత ఉన్న కేసుల్లో ఎందుకు ఆచి తూచి అడుగులు వేస్తోందన్నది ఇప్పుడు చర్చనీయాంశం. జగన్ మినహా ఇతర నేతలపై ప్రభుత్వం సాఫ్ట్ కార్నర్ ప్రదర్శిస్తోందని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. అయితే, ఏ చిన్న పొరపాటు జరిగినా రాజకీయ కక్ష సాధింపు అనే ముద్ర పడే అవకాశం ఉన్నందున, చట్టపరంగా పక్కా ఆధారాలతో కోర్టు ముందు నిలబడాలనే వ్యూహంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది.
త్వరలో చర్యలు ?
విజిలెన్స్ నివేదికలను ప్రస్తుతం న్యాయ నిపుణులు పరిశీలిస్తున్నారు. కేవలం విచారణ రిపోర్టులతో సరిపెట్టకుండా, బాధ్యులపై ఏసీబీ లేదా సీఐడీ ద్వారా క్రిమినల్ కేసులు నమోదు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ముఖ్యంగా తోపుదుర్తి, రోజా, బైరెడ్డిలపై చర్యలు తీసుకోవడం ఖాయమన్న అభిప్రాయం వినిపిస్తోంది.























