Amaravati Gazette: అమరావతి గెజిట్తోనే అన్నీ అయిపోవు - ప్రభుత్వం మూడేళ్లలో చేయాల్సింది చాలా ఉంది - లేకపోతే?
Andhra Capital: అమరావతి గెజిట్ తర్వాత ప్రభుత్వంపై అసలు బాధ్యత పడింది. మూడేళ్లలో పూర్తి స్థాయిలో పాలనా రాజధానిని నిర్మించడమే కాకుండా పెద్ద ఎత్తున ప్రైవేటు సంస్థల పెట్టుబడుల్ని ఆకర్షించాల్సి ఉంది.

Amaravati: అమరావతికి లభించిన చట్టబద్ధత అనేది కేవలం ఒక పేరు మార్పు మాత్రమే కాదు, అది ఆ ప్రాంత భవిష్యత్తుకు ఒక రక్షణ కవచం వంటిది. రాష్ట్రపతి ఆమోదంతో వెలువడిన గెజిట్ నోటిఫికేషన్ అమరావతికి రాజ్యాంగబద్ధమైన భద్రతను కల్పించింది. దీనివల్ల కలిగే అతిపెద్ద లాభం ఏమిటంటే, భవిష్యత్తులో ఏ ప్రభుత్వం వచ్చినా కేవలం ఒక జీవో ద్వారా రాజధానిని మార్చడం అసాధ్యం. తకంటే ముఖ్యంగా, ప్రపంచ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వంటి అంతర్జాతీయ సంస్థల నుండి అందుతున్న దాదాపు 15,000 కోట్లు రుణాలకు ఈ చట్టబద్ధత ఒక గ్యారెంటీగా పనిచేస్తుంది. కేంద్రం నుండి వచ్చే గ్రాంట్లు, జాతీయ సంస్థల ఏర్పాటుకు ఈ గెజిట్ ఒక బలమైన పునాది.
నిధులు ఉన్నాయి.. మరి పనులు ఎందుకు నత్తనడకన?
ప్రస్తుతం అమరావతిలో రూ.57,821 కోట్ల విలువైన పనులు వివిధ దశల్లో ఉన్నాయి. తాజాగా వెలువడిన నివేదికల ప్రకారం పనుల పురోగతి ఆశించిన స్థాయిలో లేదు. మొత్తం పనుల్లో సగటున 19.6 శాతం పురోగతి సాధించాల్సి ఉండగా, ప్రస్తుతం కేవలం 9.72%మాత్రమే పూర్తయింది. అంటే నిర్దేశించిన లక్ష్యంలో సగం కూడా చేరుకోలేదు. భారీ పనులు చేస్తున్న ఎన్.సి.సి , మేఘా , ఎల్ అండ్ టీ వంటి సంస్థలు తమ షెడ్యూల్ కంటే వెనుకబడి ఉన్నాయి. దీనికి గడచిన ఏడాది కురిసిన భారీ వర్షాలు, ముడి సరుకుల రవాణాలో ఇబ్బందులు ప్రధాన కారణాలుగా అధికారులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల నిర్వహించిన సమీక్షలో ఈ జాప్యంపై అసహనం వ్యక్తం చేశారు. నిధుల కొరత లేనప్పుడు పనులు ఎందుకు ఆగుతున్నాయని ప్రశ్నిస్తూ, కాంట్రాక్ట్ సంస్థలకు వారపు ,నెలవారీ లక్ష్యాలను విధించారు. ప్రస్తుతం సైట్లో సుమారు 20,000 మంది కార్మికులు, వందలాది మంది నిపుణులు పనిచేస్తున్నారు. ఈ సంఖ్యను మరింత పెంచి, పనులను మూడు షిఫ్టుల్లో జరిగేలా చూడాలని ప్రభుత్వం ఆదేశించింది.
ముఖ్య కట్టడాల పరిస్థితి ఏమిటి?
ఐదు ఐకానిక్ టవర్లతో కూడిన సెక్రటేరియట్, హైకోర్టు , అసెంబ్లీ భవనాలు ప్రస్తుతం డయాగ్రిడ్ టెక్నాలజీ తో వేగంగా రూపుదిద్దుకుంటున్నాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు ఐఏఎస్ అధికారుల కోసం నిర్మిస్తున్న సుమారు 3,500 క్వార్టర్లు దాదాపు తుది దశకు చేరుకున్నాయి. సీడ్ యాక్సెస్ రోడ్డుతో పాటు ప్రధాన గ్రిడ్ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. 2028 డిసెంబర్ నాటికి ప్రధాన ఐకానిక్ కట్టడాలన్నీ పూర్తి చేయాలనేది ప్రభుత్వ డెడ్ లైన్.
ట్రాప్ నుంచి అభివృద్ధి పథం వైపు
రాజధానిపై పడిన రాజముద్ర కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కాదు, అది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు ప్రాణం పోసే ప్రక్రియ. వేల కోట్ల పెట్టుబడులు, అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యం ఉన్నప్పుడు దానిని మార్చడం ఏ ప్రభుత్వానికైనా అసాధ్యం. ఇప్పుడు ప్రభుత్వం ముందున్న ఏకైక లక్ష్యం.. ఈ చట్టబద్ధతను సాకుగా చూపి, పనులను పరుగులు తీయించి బ్రాండ్ అమరావతి పై పెట్టుబడిదారులకు నమ్మకం కలిగించడమే. ప్రభుత్వం కాంట్రాక్టర్లపై ఒత్తిడి పెంచి, వర్షాకాలం ప్రారంభం లోపే కీలక మౌలిక సదుపాయాలను పూర్తి చేయగలిగితేనే అమరావతి నిజమైన రాజధానిగా వెలుగులీనుతుంది.























