West Bengal Industrial Revival: పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
BHAVYA Rasayan Chemical Park: బెంగాల్లో సువేందు అధికారి నేతృత్వంలో పారిశ్రామిక విప్లవం? కేంద్రం భవ్య రసాయన్ ప్రాజెక్టుతో గుజరాత్, మహారాష్ట్రలకు ధీటుగా నిలబడాలనుకుంటున్నారు.

Bengal vs Gujarat Dahej Model Industry: ఒకప్పుడు భారత పారిశ్రామిక పటంలో అగ్రస్థానంలో వెలిగిన పశ్చిమ బెంగాల్, గత కొన్ని దశాబ్దాలుగా మౌలిక వసతుల లేమి, భూసేకరణ వివాదాలు , విధానపరమైన నిరోధకత వల్ల తన ఆధిపత్యాన్ని కోల్పోతూ వచ్చింది. హల్దియా, డ్యాంకుణి వంటి ప్రాంతాలు జూట్, ఇంజనీరింగ్, పెట్రోకెమికల్ రంగ్లాలో చరిత్ర సృష్టించినప్పటికీ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఇంటిగ్రేటెడ్ పారిశ్రామిక పార్కులు లేకపోవడం రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి పెద్ద ఆటంకంగా మారింది. బీజేపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన సీఎం సువేందు అధికారి నేతృత్వంలో బెంగాల్ను మళ్లీ పారిశ్రామిక ప్రగతి పథంలోకి తెచ్చేందుకు రూపుదిద్దుకుంటున్న ప్లాన్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయ, ఆర్థిక వర్గాల్లో వేడి పుట్టిస్తోంది.
భవ్య రసాయన్ రసాయన పార్కుల్లో ఒకటి బెంగాల్కు!
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భవ్య రసాయన్ పథకం కింద దేశవ్యాప్తంగా కేవలం మూడు అత్యాధునిక రసాయన పార్కులను నిర్మించాలని నిర్ణయించారు. ఇందులో ఒక పార్కును పశ్చిమ బెంగాల్లోని హల్దియా-నందిగ్రామ్ బెల్ట్లో సాధించుకోవడం ద్వారా రాష్ట్ర రూపురేఖలు మార్చవచ్చని సువేందు వర్గాలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. గతంలో సింగూరు, నందిగ్రామ్ సంఘటనల తర్వాత పశ్చిమ బెంగాల్ పేరు చెప్పగానే పారిశ్రామికవేత్తలు వెనకడుగు వేసే పరిస్థితి ఏర్పడింది. అయితే, గుజరాత్లోని దహేజ్ కెమికల్ కాంప్లెక్స్ తరహాలో ఒకే చోట నీరు, నిరంతర విద్యుత్, ప్లగ్ అండ్ ప్లే మోడల్, గ్రీన్ వేస్ట్ మేనేజ్మెంట్ సదుపాయాలు కల్పిస్తే గ్లోబల్ ఇన్వెస్టర్లను ఆకర్షించడం బెంగాల్కు పెద్ద కష్టమేమీ కాదు. ముఖ్యంగా సువేందు ప్రాతినిధ్యం వహిస్తున్న నందిగ్రామ్, హల్దియా ప్రాంతాలకు ఉన్న సహజసిద్ధమైన పోర్టు కనెక్టివిటీ, సముద్ర మార్గాలు ఈ ప్రాజెక్టుకు అతిపెద్ద ప్లస్ పాయింట్గా మారనున్నాయి.
పారిశ్రామికంగా వెనుకబడిన బెంగాల్
ఈ విప్లవాత్మక కెమికల్ పార్క్ కనుక రూపుదిద్దుకుంటే, కేవలం రసాయన పరిశ్రమలకే పరిమితం కాకుండా ఫార్మా, ప్లాస్టిక్స్, ఆటోమోటివ్ విడిభాగాలు, బ్యాటరీ టెక్నాలజీ, ప్యాకేజింగ్ వంటి అనేక అనుబంధ రంగాలు రూపుదిద్దుకుంటాయి. ఇది జరిగితే, ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్తున్న బెంగాలీ యువతకు స్థానికంగానే వేలాది ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు లభిస్తాయి. గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు వంటి పారిశ్రామిక దిగ్గజ రాష్ట్రాలతో బెంగాల్ పోటీ పడాలంటే ఇలాంటి భారీ మౌలిక వసతుల ప్రాజెక్టులు అత్యంత అవసరం. ఆధునిక పారిశ్రామిక వేగం పర్యావరణ పరిరక్షణను బలికోరకూడదనే స్పష్టమైన విజన్ను ఈ నమూనా ప్రతిపాదిస్తోంది. రసాయన పరిశ్రమల వల్ల వచ్చే వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణ , కఠినమైన కాలుష్య నిరోధక విధానాలు అమలైనప్పుడే ఇది సుస్థిర అభివృద్ధిగా మారుతుంది. పర్యావరణాన్ని కాపాడుకుంటూనే పరిశ్రమలను నడపవచ్చనే ఆధునిక విధానానికే ఈ ప్రతిపాదిత ప్రాజెక్టు ప్రాధాన్యత ఇస్తోంది.
సీఎం సువేందు ప్రత్యేక ప్రయత్నాలు
బెంగాల్ పునర్వైభవం సాధించడానికి ఇప్పుడు అనుకూల పరిస్థితులు ఉన్నాయి. డబుల్ఇంజిన్సర్కార్ ఏర్పడింది. విధానపరమైన పారదర్శకత, సింగిల్ విండో అనుమతులు, పెట్టుబడిదారుల్లో నమ్మకం పెంపొందించడం ద్వారా మాత్రమే బెంగాల్ను మళ్లీ పారిశ్రామిక శక్తిగా మార్చడం సాధ్యమవుతుంది. సువేందు అధికారి ప్రతిపాదిస్తున్న ఈ పారిశ్రామిక విజన్ కనుక క్షేత్రస్థాయిలో ఆచరణలోకి వస్తే, అది బెంగాల్ ఆర్థిక రంగానికి సరికొత్త దిశను నిర్దేశిస్తుదనడంలో సందేహం లేదని అంటున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















