Why TMC MPs Not Joined BJP: బీజేపీలో చేరలేదు - తృణమూల్ను లాక్కోలేదు - బెంగాల్ తిరుగుబాటు ఎంపీల మాస్టర్ ప్లాన్ ఊహించనిదే !
Shiv Sena NCP Vs TMC Legal Case: లోక్సభలో తృణమూల్ ఎంపీలు నేరుగా బీజేపీలో చేరకుండా, అసలైన టీఎంసీ అని క్లెయిమ్ చేయకుండా అనామక NCPI పార్టీలో విలీనం అయ్యారు. దీని వెనుక మాస్టర్ ప్లాన్ ఏంటి?

NCPI Merger Strategy Amit Shah: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తృణమూల్ కాంగ్రెస్ కి చెందిన 20 మంది తిరుగుబాటు ఎంపీలు నేరుగా దేశంలోనే అత్యంత బలమైన అధికార పార్టీ అయిన బీజేపీలో చేరకుండా, ఎవరికీ తెలియని ఎన్సీపీఐ అనే అనామక పార్టీలో విలీనం కావడం వెనుక భారత రాజ్యాంగం, చట్టాల్లోని లూప్హోల్స్తో కూడిన ఒక మైండ్ బ్లోయింగ్ పొలిటికల్ మైండ్ గేమ్ ఉంది. చాలా మందికి బీజేపీలో ఎందుకు విలీనం కాలేదు? లేదా శివసేన, ఎన్సీపీ తరహాలో ‘మాదే అసలైన టీఎంసీ’ అని ఎందుకు క్లేయిమ్ చేసుకోలేదు? అన్న సందేహాలున్నాయి.
నేరుగా బీజేపీలో ఎందుకు చేరలేదు?
తిరుగుబాటు ఎంపీలు నేరుగా బీజేపీలో చేరిపోతే, పశ్చిమ బెంగాల్ సెంటిమెంట్ను మమతా బెనర్జీ సులభంగా వాడుకోగలరు. బీజేపీ భయపెట్టి, మా ఎంపీలను కొనేసింది అంటూ బెంగాలీ ప్రజల్లో ఆమె సానుభూతి పొందే అవకాశం ఉంది. అందుకే, వీరంతా తృణమూల్ కాంగ్రెస్ నుంచి విడిపోయి, బెంగాల్ చిరునామాగా ఉన్న ఎన్సీపీఐ పార్టీని టేకోవర్ చేసుకున్నారు. కాకోలి ఘోష్ దస్తీదార్ వంటి సీనియర్ తిరుగుబాటు నేత ముందే ఎన్సీపీఐ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టడం ఇందులో భాగమే. దీనివల్ల మేము బెంగాల్ ప్రయోజనాల కోసమే ప్రత్యేకంగా నిలబడ్డాం అని చెప్పుకోవడానికి, అదే సమయంలో కేంద్రంలోని ఎన్డీయే కూటమికి మద్దతు ఇవ్వడానికి వీలు పడుతుంది.
శివసేన, ఎన్సీపీ లాగా మాదే అసలైన టీఎంసీ అని ఎందుకు అనలేదు?
మహారాష్ట్రలో ఏకనాథ్ షిండే , అజిత్ పవార్ తరహాలో వీరు క్లెయిమ్ చేయకపోవడానికి ప్రధాన కారణం.. సుప్రీంకోర్టు ఇటీవలి తీర్పులు , ఎన్నికల కమిషన్ నిబంధనలు అనుకోవచ్చు. కేవలం ఎంపీల మెజార్టీ సరిపోదు, శివసేన, ఎన్సీపీ కేసుల్లో కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలు మాత్రమే కాదు, పార్టీ ప్రాథమిక సభ్యులు, జిల్లా అధ్యక్షులు, క్షేత్రస్థాయి క్యాడర్ కూడా తమ వైపు ఉన్నారని వారు నిరూపించుకోగలిగారు. టీఎంసీ విషయంలో పశ్చిమ బెంగాల్లోని అట్టడుగు క్యాడర్, జిల్లా కమిటీలు, మున్సిపల్ కౌన్సిలర్లు ఇప్పటికీ మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీల గుప్పిట్లోనే ఉన్నారు. కేవలం ఢిల్లీలో ఉన్న 20 మంది ఎంపీలు తిరుగుబాటు చేసినంత మాత్రాన మాదే అసలైన టీఎంసీ అంటే ఎన్నికల కమిషన్ ఒప్పుకోదు. పైగా ఆ లీగల్ ఫైట్ తెమలడానికి ఏళ్ల సమయం పడుతుంది. చట్టం ప్రకారం కేవలం ఒక పార్టీకి చెందిన రెండు వంతుల ప్రజాప్రతినిధులు విడిపోతే సరిపోదు. ఆ విడిపోయిన గ్రూప్ ఖచ్చితంగా మరొక రాజకీయ పార్టీలో విలీనం కావాలి. అప్పుడే వారిపై అనర్హత వేటు పడదు.
ఎన్సీపీఐ ను ఒక షెల్ కంపెనీ లా ఎందుకు వాడుకున్నారు?
తిరుగుబాటు ఎంపీలకు తమ పదవులు ఊడిపోకుండా ఉండాలంటే తక్షణమే ఒక రిజిస్టర్డ్ రాజకీయ పార్టీ కావాలి. కొత్త పార్టీ పెట్టాలంటే ఎలక్షన్ కమిషన్ చుట్టూ తిరగాలి, దానికి చాలా సమయం పడుతుంది. ఈ లోగా మమతా బెనర్జీ వీరిపై అనర్హత వేటు వేయించే ప్రమాదం ఉంది. అందుకే, 2023లో రిజిస్టర్ అయ్యి, ఎలాంటి ఆస్తులు లేదా క్రియాశీల క్యాడర్ లేని ఎన్సీపీఐ ని ఒక చట్టపరమైన రక్షణ కవచం లా వాడుకున్నారు. ఒక వ్యాపారవేత్త నష్టాల్లో ఉన్న చిన్న కంపెనీని కొనుగోలు చేసి తన వ్యాపారాన్ని విస్తరించుకున్నట్లు.. ఈ 20 మంది ఎంపీలు ఎన్సీపీఐ లోకి విలీనమై, రాత్రికి రాత్రే ఆ పార్టీని పార్లమెంట్లో 5వ అతిపెద్ద శక్తిగా మార్చేశారు.
మిత్రపక్షంగా ఉంచితేనే బీజేపీకి లాభం!
ఈ మొత్తం డ్రామా వెనుక అమిత్ షా మాస్టర్ ప్లాన్ ఉందని ఎక్కువ మంది నమ్మకం. ఈ 20 మంది ఎంపీలను బీజేపీలో చేర్చుకుంటే లోక్సభలో బీజేపీ బలం 260 కి పెరుగుతుంది. కానీ, దానికంటే వారిని ఎన్సీపీఐ అనే ప్రత్యేక మిత్రపక్షంగా ఉంచడం వల్ల ఎన్డీయే కూటమిలో ఎక్కువ లాభం ఉంది. కూటమిలో చంద్రబాబు , నితీష్ కుమార్ లపైనే పూర్తిగా ఆధారపడకుండా, తమకు విధేయులుగా ఉండే 20 మంది ఎంపీల ఎన్సీపీఐ గ్రూప్ను ఎన్డీయేలో చేర్చడం ద్వారా బీజేపీ తన బేరసారాల శక్తిని పెంచుకుంది. జైరాం రమేష్ విమర్శించినట్లు.. ఎన్డీయేలో టీడీపీ ప్రాధాన్యతను తగ్గించడానికి ఇదొక వ్యూహాత్మక అడుగు అనుకోవచ్చు. సుప్రీంకోర్టు కోరల్లో చిక్కుకోకుండా, మమతా బెనర్జీకి లీగల్ ఛాన్స్ ఇవ్వకుండా, బెంగాల్ సెంటిమెంట్ దెబ్బతినకుండా మరియు కేంద్రంలో బీజేపీకి పూర్తి విధేయులుగా ఉంటూనే సొంత అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఎన్సీపీఐ విలీనం అనేది అత్యంత వ్యూహాత్మకమైన, లీగల్ సేఫ్ రూట్.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















