Nandigram Bypoll: బెంగాల్ రాజకీయాల్లో నందిగ్రామ్ రెండో అంకం - మమతా బెనర్జీ రిస్క్ చేస్తారా?
Bengal Elections2026: ఎమ్మెల్యేగా ఓడిపోయిన మమతా బెనర్జీకి మరో చాన్స్ వచ్చింది. రెండు చోట్ల గెలిచిన సువేందు అధికారి నందిగ్రామ్లో రాజీనామా చేశారు. మరి మమతా ధైర్యం చేస్తారా?

West Bengal Politics: పశ్చిమ బెంగాల్ రాజకీయం ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో సువేందు అధికారి అటు మమతా బెనర్జీ సొంత గడ్డ భవానీపూర్లోనూ, ఇటు తన కంచుకోట నందిగ్రామ్లోనూ ఘనవిజయం సాధించి జెయింట్ కిల్లర్ గా నిలిచారు. అయితే, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సువేందు.. ఏదో ఒక సీటుకు రాజీనామా చేయాల్సి ఉండటంతో, ఆయన భవానీపూర్ను అట్టి పెట్టుకుని నందిగ్రామ్ స్థానాన్ని వదులుకున్నారు. దీంతో ఇప్పుడు నందిగ్రామ్కు ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ స్థానం ఇప్పుడు మమతా బెనర్జీకి రాజకీయ పునర్వైభవం కోసం, మరో అగ్నిపరీక్ష కోసం వేచి చూస్తోంది.
మమతా బెనర్జీ అసెంబ్లీకి వెళ్లడానికి మరో చాన్స్
ఎమ్మెల్యేగా ఓడిపోయిన మమతా బెనర్జీకి, పార్టీని తిరిగి గాడిలో పెట్టాలంటే అసెంబ్లీలో అడుగుపెట్టడం అనివార్యం. ప్రస్తుతం ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఎంపీగా ఉన్నారు. అసెంబ్లీకి వెళ్లలేరు. దీదీ స్వయంగా సభలో ఉంటేనే టీఎంసీ శ్రేణుల్లో ఉత్సాహం పెరుగుతుంది. అయితే, నందిగ్రామ్ నుంచి పోటీ చేయడం ఆమెకు ఒక పెను సవాల్. 2021లో ముఖ్యమంత్రిగా ఉండి కూడా అక్కడ సువేందు చేతిలో ఓటమి పాలైన ఆమెకు, ఇప్పుడు అధికారం లేని స్థితిలో, విపక్ష నేతగా అక్కడికి వెళ్లడం అంటే కత్తి మీద సామే అని భావిస్తున్నారు.
సువేందు కంచుకోట నందిగ్రామ్
నందిగ్రామ్ అనేది కేవలం ఒక నియోజకవర్గం కాదు, అది బెంగాల్ పోరాట పటిమకు చిహ్నం. సువేందు అధికారి అక్కడ తన పట్టును నిరూపించుకున్నారు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉండి, తన అభ్యర్థిని అక్కడ నిలబెడితే ప్రభుత్వం ఉన్న అడ్వాంటేజ్ బీజేపీకి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఈ తరుణంలో మమత అక్కడ పోటీ చేసి మళ్లీ ఓడిపోతే, ఆమె రాజకీయ భవిష్యత్తు , టీఎంసీ మనుగడ మరింత క్లిష్టంగా మారుతుంది. అందుకే ఆమె సేఫ్ సీటు కోసం చూస్తారా లేక నందిగ్రామ్ సవాల్ను స్వీకరిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. మమతా బెనర్జీ సహజంగానే పోరాట యోధురాలు. ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదల ఆమెలో ఉన్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. బీజేపీ 207 సీట్ల భారీ మెజారిటీతో అధికారంలో ఉండటం, రాష్ట్రవ్యాప్తంగా టీఎంసీ క్యాడర్ నైరాశ్యంలో ఉండటం ఆమెకు ప్రతికూలాంశాలు. ఒకవేళ ఆమె నందిగ్రామ్లో రిస్క్ చేయకూడదని భావిస్తే ఆమె పోటీ చేసే అవకాశం ఉండదు.
సువేందు అధికారి తన వ్యూహాన్ని చాలా స్పష్టంగా అమలు చేస్తున్నారు. తాను నందిగ్రామ్ను వదులుకున్నప్పటికీ, అక్కడి ప్రజలకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని, తన వారసుడిని గెలిపించుకోవడం ద్వారా మమతకు మళ్లీ చుక్కలు చూపిస్తానని ఆయన బహిరంగంగానే సవాల్ విసురుతున్నారు. ఆరు నెలల్లో జరగబోయే ఈ ఉపఎన్నిక బెంగాల్ రాజకీయాల్లో కీలక పోరాటంగా మారబోతోంది. మమతా బెనర్జీ అసెంబ్లీలో అడుగుపెట్టకపోతే, బెంగాల్లో టీఎంసీ ప్రాభవం క్రమంగా తగ్గిపోయే ప్రమాదం ఉంది. నందిగ్రామ్ మరోసారి యుద్ధభూమిగా మారబోతోంది. మమతా బెనర్జీ తీసుకునే నిర్ణయం ఆమె పార్టీ భవిష్యత్తును నిర్ణయించనుంది. ఆ బెంగాల్ అసెంబ్లీలో దీదీ గళం వినబడాలంటే ఆమె ఈ గండం గట్టెక్కక తప్పదు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















