Amaravati Central Secretariat: అమరావతిలో మినీ ఢిల్లీ - కేంద్ర సచివాలయ నిర్మాణానికి రంగం సిద్ధం
Amaravati: కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. ఢిల్లీలోని సెంట్రల్ వెస్టా తరహాలో నిర్మాణాన్ని ప్రారంభించనున్నారు.

Mini Delhi in Amaravati: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. దీని కోసం రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు నివేది తుది దశకు చేరుకుంది. ఢిల్లీలోని సెంట్రల్ వెస్టా తరహాలో, సుమారు 20 నుంచి 25 ఎకరాల విస్తీర్ణంలో ఈ అత్యాధునిక సచివాలయ సముదాయాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో అద్దె భవనాల్లో కొనసాగుతున్న సుమారు 50కి పైగా కేంద్ర ప్రభుత్వ విభాగాలు, అనుబంధ సంస్థలు ఈ నూతన భవనంలోకి మారనున్నాయి.
అత్యాధునిక డిజైన్ - గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్
ఈ ప్రాజెక్టును కేవలం కార్యాలయ భవనంగానే కాకుండా, పర్యావరణ హితమైన గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలతో నిర్మించనున్నారు. ఐకానిక్ డిజైన్తో కూడిన ఈ భవన సముదాయంలో సెంట్రలైజ్డ్ ఎయిర్ కండిషనింగ్, అత్యాధునిక ఐటీ మౌలిక సదుపాయాలు, కాన్ఫరెన్స్ హాల్స్ , విశాలమైన పార్కింగ్ సౌకర్యాలు ఉండనున్నాయి. సుమారు 10 నుంచి 12 అంతస్తుల ఎత్తుతో నిర్మించనున్న ఈ భవనం, అమరావతి నగరానికే ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. దీని ద్వారా పాలనలో వేగం పెరగడంతో పాటు, ప్రజలకు అన్ని కేంద్ర సేవలు ఒకే చోట లభించే వెసులుబాటు కలుగుతుంది.
నిధులు , నిర్మాణ బాధ్యతలు
ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను కేంద్ర ప్రజా పనుల శాఖ పర్యవేక్షించనుంది. ప్రాథమిక అంచనాల ప్రకారం, ఈ సముదాయం నిర్మాణానికి సుమారు రూ. మూడు వేల కోట్ల వరకు వ్యయం కావచ్చని భావిస్తున్నారు. రాజధాని ప్రాంతంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన భూములను దీని కోసం వినియోగించుకోనున్నారు. కేంద్ర కేబినెట్ నుంచి తుది ఆమోదం లభించిన వెంటనే టెండర్ల ప్రక్రియను ప్రారంభించి, రాబోయే రెండేళ్లలోపు నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
కేంద్ర, రాష్ట్ర కార్యాలయాలన్నీ పాలనా నగరంలోనే !
కేంద్ర సచివాలయ నిర్మాణం వల్ల అమరావతి ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలు మరింత పుంజుకోనున్నాయి. వేలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఒకే ప్రాంతానికి రావడం వల్ల స్థిరాస్తి రంగానికి ఊతం లభించడమే కాకుండా, స్థానికంగా సేవా రంగంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అమరావతిని కేవలం ఒక పరిపాలనా కేంద్రంగానే కాకుండా, జాతీయ స్థాయిలో ఒక కీలకమైన నగరంగా తీర్చిదిద్దడంలో ఈ ప్రాజెక్టు మైలురాయిగా నిలవనుంది.























