New Governor of Telangana: కొత్త గవర్నర్ అజర్ మంత్రిపదవి కాపాడతారా?
Telangana Azhar: అజహరుద్దీన్ మంత్రి పదవికి గండం ముంచుకొస్తోంది. ఇప్పుడు ఆయన పదవిని కాపాడేది ఒక్కరే.. తెలంగాణకు వస్తున్న కొత్త గవర్నరే.

Azhar ministerial post: తెలంగాణకు కొత్త గవర్నర్ వచ్చారు. ముగ్గురు గవర్నర్లు మారినా ప్రొఫెసర్ కోదండ రాం ఎమ్మెల్సీ పదవి మాత్రం ఇంకా ఊగిసలాటలోనే వుంది. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజారుద్దీన్ కూడా ఎమ్మెల్సీగా ఎన్నికవడానికి గడువు దగ్గరపడుతోంది. వారి పేర్లను గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్రతిపాదిస్తూ రాష్ట్ర క్యాబినెట్ చేసిన సిఫారసులు ఈ గవర్నరైనా ఆమోదించి చట్టసభ సభ్యులయ్యే అవకాశమిస్తారో లేదో అనే టెన్షన్ కాంగ్రెస్లో కనిపిస్తోంది.
త్రిశంఖు స్వర్గంలోనే ప్రొ. కోదండరాం ఎమ్మెల్సీ పదివి...
తెలంగాణ జేఏసీ కన్వీనర్, తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు కోదండరాం శాసన మండలిలో అడుగుపెట్టే అదృష్టం చాలా కాలంగా ఊగిసలాడుతూ వస్తోంది. రెండు సార్లు ప్రభుత్వం ఆయన అభ్యర్దిత్వాన్ని గవర్నర్ కు సిఫారసుచేసినా, గవర్నర్ ఓసారి ఆమోదించినా న్యాయపర చిక్కులు ఆయన ప్రమాణస్వీకారానికి అడ్డుపడుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు గవర్నర్ కోటాలో దాసోజు శ్రవణ్ ను, కుర్ర సత్యనారాయణను ఎమ్మెల్సీలుగా సిఫారసులు పంపింది. అప్పటి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ వారి పేర్లను తిరస్కరించారు. ఇద్దరికీ రాజకీయ పార్టీతో ప్రత్యక్ష సంబందాలున్నాయనీ, ఏ రంగంలోనూ నిష్ణాతులు కాదు కాబట్టి ఆ పేర్లను తాను ఆమోదించలేనని చెప్పారు. ఇంతలో కేసీఆర్ ప్రభుత్వం మారి రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చింది. గవర్నర్ నిర్ణయం పై దాసోజు హైకోర్టును ఆశ్రయించారు. క్యాబినెట్ చేసిన సిఫారసులను తిరస్కరించే అధికారం గవర్నర్ కు ఉండదని హైకోర్టులో పిటిషన్ లో పేర్కొన్నారు.
అప్పట్నుంచీ కోర్టు చిక్కుల్లోనే...
2023 డిసెంబర్ లో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పాత సిఫారసులను వెనక్కు తీసుకుని కొత్తగా ప్రొఫెసర్ కోదండరాం, పాత్రికేయుడు ఆమిర్ అలీ ఖాన్ లను ఎమ్మెల్సీగా ప్రతిపాదించారు. ఈసారి గవర్నర్ వారి పేర్లకు ఆమోదం కూడా తెలిపారు. దాసోజు శ్రవణ్ పిటిషన్ ను విచారించిన హైకోర్టు 2024 మార్చిలో గవర్నర్ తమిళిసై నిర్ణయాన్ని తప్పుపట్టింది. గవర్నర్ కు క్యాబినెట్ సిఫారసులను తిరస్కరించే అధికారం లేదని చెప్తూ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ల నామినేషన్ చెల్లదని చెప్పింది. హైకోర్టు నిర్ణయం పై సుప్రీం కోర్టు మొదట స్టే ఇచ్చింది. దీంతో ప్రక్రియ మళ్లీ మొదలైంది, ఈసారి రాష్ట్ర ప్రభుత్వం కోదండరాం, అజరుద్దీన్ ల పేర్లను గవర్నర్ కోటాకింద సిఫారసు చేసింది. సుప్రీంకోర్టు 2025 ఆగస్టులో మునుపటి వ్యాఖ్యలపై తదుపరి వివరణ ఇస్తూ ప్రభుత్వ సిఫారసు చేసిన పేర్లకు నిబంధనలు పాటిస్తూ గవర్నర్ ఆమోదం తెలిపినా అది కోర్టు తుది తీర్పునకు లోబడే చెల్లుబాటవుతుందని చెప్పింది.
కొత్త గవర్నర్ ఏం చేస్తారు.. గండం నుంచి అజర్ మంత్రి పదవి బయటపడుతుందా.. ?
సుప్రీకోర్టు తుది తీర్పునకు లోబడే అనే నిబంధన నేపధ్యంలో అప్పటి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఏ నిర్ణయం తీసుకోకుండా ఉన్నారు. మరి ఇప్పుడు నూతన గవర్నర్ గా శివ్ ప్రతాప్ శుక్లా ఆధ్యతలు చేపట్టనున్న నేపధ్యంలో ఈయన ఏంచేస్తారు. కొత్త గవర్నర్ ను ఒప్పించి ఆమోదించుకోవడంలో రేవంత్ సఫలీకృతులవుతారా.. లేదా మూడో సారి కోదండరాం పేరును సిఫారసు చేయాల్సుంటుందా. ఇప్పటికే మంత్రి గా ప్రమాణ స్వీకారం చేసి చట్టసభ సభ్యూడయ్యేందుకు నాలుగు నెలలుగా ఎదురుచూస్తున్న అజర్ భవితవ్యం ఏంటనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. దాసోజు శ్రవణ్ మాత్రం మా పిటిషన్ పండింగ్ లో వుండగా కొత్త గవర్నర్ కూడా ఆమోదం తెలపలేరంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదే జరిగితే మంత్రి పదవికి అజర్ అర్హత కోల్పోయే ప్రమాదం పొంచివున్నట్టే.























