Rice Procurement Centres Telangana Delay: తెలంగాణలో వరి యుద్ధం- అన్నదాతల కన్నీళ్లు తుడుస్తారా? లేక రాజకీయాలే మిగులుతాయా?
Telangana Paddy Procurement 2026 : తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై రాజకీయ యుద్ధం జరుగుతోంది. ప్రభుత్వం రికార్డు స్థాయిలో కొనుగోళ్లు చేస్తున్నామని చెబుతుంటే, క్షేత్రస్థాయిలో పరిస్థితులు అలా లేవు.

Agriculture Crisis Telangana May 2026 : తెలంగాణలో ప్రస్తుతం వరి ధాన్యం కొనుగోళ్ల అంశం రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. ఒకవైపు ప్రభుత్వం రికార్డు స్థాయిలో కొనుగోళ్లు చేస్తున్నామని చెబుతుంటే, మరోవైపు క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై విపక్షాలు విమర్శల జడివాన కురిపిస్తున్నాయి.
ప్రభుత్వ క్లెయిమ్ వర్సెస్ విపక్షాల ఆరోపణ
తెలంగాణ ప్రభుత్వం ఈ రబీ సీజన్లో సుమారు 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే 80 శాతానికి పైగా కొనుగోళ్లు పూర్తయ్యాయని ప్రకటిస్తున్నారు. అయితే, బీఆర్ఎస్,బీజేపీ నేతలు ఈ గణాంకాలను సవాల్ చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో కేవలం 25-35 శాతం మాత్రమే కొనుగోలు జరిగిందని, ప్రభుత్వం తప్పుడు లెక్కలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని విమర్శిస్తున్నారు. ఈ పరస్పర విరుద్ధ ప్రకటనలు అన్నదాతల్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి.
కల్లాల్లో రైతుల కష్టాలు
కొనుగోలు కేంద్రాలకు ధాన్యం వచ్చి వారాలు గడుస్తున్నా.. తూకం వేయడంలో జాప్యం జరుగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గడిచిన కొద్ది రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు రైతుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. కళ్ల ముందే ధాన్యం తడిసి ముద్దవుతుంటే, తూకం వేయని ధాన్యాన్ని కాపాడుకోవడానికి పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. ఆరుగాలం శ్రమించి పండించిన పంట వర్షార్పణం అవుతుంటే మా గోడు వినేవారేలేరు అని రైతులు వాపోతున్నారు.
మౌలిక సదుపాయాల కొరత
విపక్షాలు ప్రధానంగా గన్నీ బ్యాగుల కొరత, హమాలీల లేమిర రవాణా సౌకర్యాల జాప్యంపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. ధాన్యం కొన్న తర్వాత మిల్లులకు తరలించడానికి లారీలు సకాలంలో రాకపోవడంతో కేంద్రాల వద్దే రాశులు పేరుకుపోతున్నాయి. ఇది కాక, తరుగు పేరుతో మిల్లర్లు రైతులను దోచుకుంటున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశాలపై పర్యవేక్షణ లోపించడం ప్రభుత్వ వైఫల్యంగా విపక్షాలు అభివర్ణిస్తున్నాయి.
ప్రభుత్వ బాధ్యత - తక్షణ చర్యల ఆవశ్యకత
ప్రభుత్వం కేవలం వీడియో కాన్ఫరెన్స్లకు పరిమితం కాకుండా, ప్రతి కొనుగోలు కేంద్రానికి ఒక స్పెషల్ ఆఫీసర్ను నియమించాల్సిన బాధ్యత ఉంది. తడిసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరకే కొనుగోలు చేస్తామన్న భరోసా రైతులకు కల్పించాలి. మిల్లర్లు తరుగు పేరుతో కోతలు విధించకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. మే నెల ముగిసేలోగా వంద శాతం కొనుగోళ్లు పూర్తి చేయాలని సీఎం జారీ చేసిన ఆదేశాలు క్షేత్రస్థాయిలో అమలు అవుతున్నాయో లేదో కలెక్టర్లు పర్యవేక్షించాల్సి ఉంది.
రైతు సంక్షేమమే ముఖ్యం
రాజకీయాల్లో గెలుపోటములు సహజం, కానీ రైతు సంక్షేమం విషయంలో నిర్లక్ష్యం వహించడం ఏ ప్రభుత్వానికైనా శ్రేయస్కరం కాదు. గతంలో జరిగిన పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకుని, ప్రస్తుత ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని విపక్షాలంటున్నాయి. . విపక్షాలు చేసే విమర్శలను కేవలం రాజకీయాలుగా చూడకుండా, వాటిలో ఉన్న వాస్తవాలను గుర్తించి పరిష్కరించడమే ప్రజాస్వామ్య ప్రభుత్వ లక్షణం కావాలటున్నారు. వర్షాలు పడే అవకాశం ఉన్నందున, మిగిలిన ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపదికన సేకరించాలి. రైతుల ఖాతాల్లో డబ్బులు పడటంలో జరుగుతున్న ఆలస్యాన్ని నివారించాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం బాగా చేశామని మీడియా ప్రకటనల కన్నా.. రైతుల సంతృప్తికే ప్రాధాన్యం ఇవ్వాలి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















