Telangana News: మొక్కజొన్న కొనుగోళ్లపై స్పందించని కేంద్రం.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Telangana Govt | కేంద్రం నుంచి స్పందన లేకపోవడంతో తెలంగాణ ప్రభుత్వమే నేరుగా మొక్కజొన్న కొనుగోలు చేయాలని నిర్ణయించి, సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అదనంగా రూ. 1,800 కోట్లు కేటాయించింది.

Thummala Nageswara Rao | హైదరాబాద్: మొక్కజొన్న రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో పండిన మొక్కజొన్న కొనుగోళ్లపై కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో, రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వమే రంగంలోకి దిగింది. మొక్కజొన్న పంటను ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఈ కొనుగోళ్ల కోసం ఇప్పటికే కేటాయించిన రూ. 4,000 కోట్లకు అదనంగా, సీఎం రేవంత్ మరో రూ. 1,800 కోట్లను ప్రత్యేకంగా కేటాయించారని మంత్రి తెలిపారు.
మొక్కజొన్న కొనుగోళ్లను తక్షణమే..
ఈ ఏడాది రబీ మార్కెటింగ్ సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా మొక్కజొన్న అత్యంత భారీగా దిగుబడి వచ్చింది. ఈ క్రమంలో రైతులు దళారుల చేతిలో మోసపోకుండా ఉండేందుకు, రూ. 1,100 కోట్లతో మొక్కజొన్న కొనుగోళ్లను తక్షణమే ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉందని మంత్రి తుమ్మల ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. కేవలం మొక్కజొన్నే కాకుండా, సన్ఫ్లవర్ పంటను కూడా నిర్దేశిత 25 శాతం పరిమితికి మించి కొనుగోలు చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారని ఆయన తెలిపారు.
రైతులకు కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లాల వారీగా తగిన ఏర్పాట్లు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. అన్నదాతల ప్రయోజనాలను కాపాడటమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, పంట చివరి గింజ వరకు మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని మంత్రి తుమ్మల రైతులకు భరోసా ఇచ్చారు.
🔴వరి కొయ్యలు కాల్చొద్దు – రైతులకు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కీలక విజ్ఞప్తి
— Padi Kaushik Reddy (@KaushikReddyBRS) May 24, 2026
హుజురాబాద్ నియోజకవర్గ రైతులకు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ముఖ్య విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో రైతులు పొలాల్లో వరి కొయ్యలు, గడ్డి, పంట అవశేషాలను కాల్చడం వల్ల భారీ అగ్ని… pic.twitter.com/ohO0gn7sjH
వరి కొయ్యలు కాల్చొద్దని రైతులకు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విజ్ఞప్తి
ప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో రైతులు పొలాల్లో వరి కొయ్యలు, గడ్డి, పంట అవశేషాలను కాల్చడం వల్ల భారీ అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. హుజురాబాద్ నియోజకవర్గ రైతులకు ఆయన ఓ విజ్ఞప్తి చేశారు. పొలాల్లో కొయ్యలు కాల్చడం వల్ల మంటలు పక్కనే ఉన్న పండ్ల తోటలు, తాటివనాలు, ఈతవనాలు, మోటారు విద్యుత్ వైర్లు దగ్ధమవుతున్నాయని తెలిపారు. ఈ తోటలపై ఆధారపడి జీవనం సాగిస్తున్న రైతులు, గౌడ సోదరులు, వ్యవసాయ కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు.
Also Read: Telangana Heatwave: అమ్మో.. ఇవేం ఎండలురా బాబు.. తలపై చెట్టు కొమ్మతో వినూత్నంగా Watch Video
అలాగే కొన్ని ప్రాంతాల్లో మంటలు వ్యాపించి వరి ధాన్యం నిల్వలు, కోతకు సిద్ధంగా ఉన్న పంటలు కూడా కాలిపోతున్నాయన్న విషయాలను గుర్తుచేశారు. దీంతో రైతులకు లక్షల రూపాయల ఆర్థిక నష్టం జరుగుతోందని, ప్రాణ నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నో నెలలు శ్రమించి పండించిన ధాన్యం క్షణాల్లో బూడిదవుతుండటం బాధాకరం అన్నారు.
వరి కొయ్యలు కాల్చడం వల్ల భూమిలోని సేంద్రియ పదార్థాలు, ఉపయోగకరమైన సూక్ష్మ జీవులు నశించి భూమి సారవంతం తగ్గిపోతుందని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తెలిపారు. దీని ప్రభావంతో భవిష్యత్తులో పంటల దిగుబడి కూడా తగ్గే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు తాత్కాలికంగా సులభమని భావించి కొయ్యలు కాల్చితే, దీర్ఘకాలంలో నేల నాణ్యత దెబ్బతిని పంటలు పండించేందుకు నష్టం జరుగుతుందని.. పంట అవశేషాలను కాల్చకుండా వాటిని సేంద్రియ ఎరువులుగా, పశువుల మేతగా లేదా ఇతర అవసరాలకు వినియోగించడంపై ఫోకస్ చేయాలని సూచించారు. చిన్న నిర్లక్ష్యం వల్ల సంవత్సరాల కష్టం క్షణాల్లో బూడిదవుతోందని అన్నారు.
గ్రామ ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండి అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తగా ఉండాలని, ఎక్కడైనా మంటలు కనిపిస్తే వెంటనే అగ్నిమాపక శాఖకు, స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. ప్రకృతి సంపదను, పంటలను, భూమి సారాన్ని, రైతుల జీవనాధారాలను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని పాడి కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు.
ట్రెండింగ్ వార్తలు























