రాష్ట్రంలో ఇప్పటివరకు 7 జిల్లాల్లో 16 మంది వడదెబ్బతో మరణించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ విషయంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Telangana Heatwave: వడగాల్పులతో 16 మంది మృతి.. రూ.4 లక్షల ఆర్ధిక సాయం.. 3 రోజులు మరింత తీవ్రంగా హీట్ వేవ్
Telangana Minister Ponguleti Srinivas Reddy | రాష్ట్రంలో వడదెబ్బ కారణంగా ఇప్పటివరకు 16 మంది మృతి చెందారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మృతుల కుటుంబాలకు 4 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు.

- రాష్ట్రంలో భీకర వడగాల్పులు, 7 జిల్లాల్లో 16 మంది మరణించారు.
- మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు.
- రానున్న 3 రోజులు వడగాల్పులు, ప్రజలు జాగ్రత్తలు పాటించాలి.
- ప్రభుత్వ ఆసుపత్రులలో హీట్ స్ట్రోక్ కేసులకు ప్రత్యేక వార్డులు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత రికార్డు స్థాయికి చేరడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలో కొనసాగుతున్న భీకర వడగాల్పుల (హీట్ వేవ్) నేపథ్యంలో రాష్ట్ర రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు వడదెబ్బ కారణంగా 7 జిల్లాల్లో 16 మంది మరణించడంపై మంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా అందజేయనున్నట్లు ఆయన ప్రకటించారు.
3 రోజుల పాటు వడగాల్పులు
రాష్ట్రంలో జిల్లాల కలెక్టర్ల నివేదిక ప్రకారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నలుగురు, వరంగల్ అర్బన్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ముగ్గురు చొప్పున జోగులాంబ గద్వాల్, సూర్యాపేట, రంగారెడ్డి జిల్లాల్లో ఒక్కరు చొప్పున ఏడు జిల్లాల్లో 16 మంది వడదెబ్బతో మృతి చెందారని అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. రానున్న 3 రోజుల పాటు రాష్ట్రంలో వడగాల్పుల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు.
అన్ని జిల్లాల కలెక్టర్లు, యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రజల ప్రాణ రక్షణే ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని, ఎండల కారణంగా రాష్ట్రంలో ఇకపై ఒక్క ప్రాణం కూడా కోల్పోకూడదనే లక్ష్యంతో పనిచేయాలని అధికారులకు స్పష్టం చేశారు. ఎండ తీవ్రత, వాతావరణ మార్పులపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు గంట గంటకు హెచ్చరికలు జారీ చేయాలని ఆదేశించారు.
Also Read: Telangana Heatwave: అమ్మో.. ఇవేం ఎండలురా బాబు.. తలపై చెట్టు కొమ్మతో వినూత్నంగా Watch Video
తీవ్రమైన ఎండలలో ప్రజలు కూడా స్వయం నియంత్రణ పాటించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, చిన్నారులు ఈ వాతావరణంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వ్యవసాయ, నిర్మాణ రంగ కార్మికుల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని, హీట్ వేవ్పై గ్రామస్థాయిలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ఎండదెబ్బ (హీట్ స్ట్రోక్) కేసులకై ప్రత్యేక వార్డులు, అవసరమైన ఓఆర్ఎస్ (ORS) ప్యాకెట్లు, మందులను సిద్ధంగా ఉంచాలని స్పష్టం చేశారు.
వాతావరణ శాఖ తాజా నివేదిక ప్రకారం ఈనెల 26వరకు కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, ములుగు, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో ఎండ తీవ్రత, తీవ్రమైన ఉష్ణోగ్రతలు, వడగాల్పులు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించిందని ఈ జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.
తెలంగాణలో 46 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు!
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతున్నాయి. వేసవి తాపానికి ప్రజలు అల్లాడిపోతున్నారు. తెలంగాణలో ఎండల తీవ్రత అసాధారణంగా పెరిగింది. రాష్ట్రంలోని దాదాపు 15 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఇప్పటికే 45 డిగ్రీల మార్కును దాటేశాయి. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శనివారం అత్యధికంగా 46.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదై రికార్డు సృష్టించింది. ఉదయం 8 గంటల నుంచే ఎండ సెగలు ప్రారంభమవుతుండటంతో జనం ఇళ్ల నుంచి బయటకు రావడానికే భయపడుతున్నారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్లోనూ ఇదే విధమైన పరిస్థితి నెలకొంది. ఏపీలోని కృష్ణా జిల్లా కానుమోలులో అత్యధికంగా 45.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 13 జిల్లాల్లోని సుమారు 95 మండలాల్లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటి నమోదవుతున్నాయి. తీవ్రమైన ఉష్ణోగ్రతలకు తోడు వడగాల్పులు తోడవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రానున్న కాలంలో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 నుంచి 46 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. మధ్యాహ్నం సమయంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
Before You Go
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
Frequently Asked Questions
తెలంగాణలో వడదెబ్బతో ఎంతమంది మరణించారు?
మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయం అందుతుంది?
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు, వడదెబ్బతో మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 4 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా అందజేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
రాష్ట్రంలో వడగాల్పులు ఇంకెన్ని రోజులు కొనసాగుతాయి?
వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం, రానున్న 3 రోజుల పాటు తెలంగాణలో వడగాల్పుల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది.
తీవ్రమైన ఎండల నేపథ్యంలో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, పిల్లలు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
తెలంగాణలో అత్యధిక ఉష్ణోగ్రత ఎంత నమోదైంది?
తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శనివారం అత్యధికంగా 46.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని దాదాపు 15 జిల్లాల్లో 45 డిగ్రీలు దాటింది.
ట్రెండింగ్ వార్తలు























