Telangana Politics Mind Game: తెలంగాణలో అప్పుడే ముందస్తు మైండ్ గేమ్! కేటీఆర్ 78 సీట్ల వెనుక అసలు వ్యూహం.. రేవంత్ 117 సీట్ల కౌంటర్!
Prediction Politics: తెలంగాణలో మైండ్ గేమ్ రాజకీయాలు నడుస్తున్నాయి. మాకు ఇన్ని సీట్లంటే..మాకు ఇన్ని సట్లని ప్రచారం చేసుకుంటున్నారు.

BRS vs Congress Surveys Telangana: తెలంగాణ రాజకీయాలు ఎప్పుడూ ముందస్తు వ్యూహాలు, మైండ్ గేమ్లతో హీటెక్కుతుంటాయి. వచ్చే సాధారణ ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ.. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ అగ్రనాయకత్వం అప్పుడే సీట్ల లెక్కలపై సవాల్-ప్రతిసవాళ్లకు దిగాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్కు 78 సీట్లు వస్తాయి.. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చేయించుకున్న ఇంటెన్సివ్ సర్వేలోనే ఈ విషయం తేలింది అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బాంబు పేల్చారు. దీనికి కౌంటర్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం రైతు ఆశీర్వాద సభ సాక్షిగా హాట్ కామెంట్స్ చేశారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2029 మే లేదా జూన్లో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏకంగా 117 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుని తీరుతుందని, కావాలంటే రాసి పెట్టుకోమంటూ సవాల్ విసిరారు. ఈ ఇద్దరు నేతల ప్రకటనల వెనుక లోతైన రాజకీయ వ్యూహాలు, క్యాడర్లో భరోసా నింపే ప్రయత్నాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
కుంగుతున్న క్యాడర్లో జోష్ కోసమేనా?
వరుసగా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పరాజయం పాలవడం.. కీలక నేతలు పార్టీ వీడిపోతుండటంతో బీఆర్ఎస్ కేడర్ కొంత కన్ఫ్యూజన్లో పడింది. ఇలాంటి తరుణంలో పార్టీ శ్రేణులకు, నియోజకవర్గ ఇన్ఛార్జ్లకు ధైర్యం కల్పించడం కేటీఆర్కు అత్యంత అవసరం. అందుకే, కాంగ్రెస్ ప్రభుత్వం సగం పదవీకాలం ముగిసేసరికే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైందని, ఇంటెలిజెన్స్ వర్గాలు , ప్రభుత్వ అంతర్గత సర్వేల ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే బీఆర్ఎస్ 78 సీట్లతో మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని కేటీఆర్ ప్రకటించారు. ప్రజలు మళ్లీ కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారనే వాతావరణాన్ని సృష్టించడం ద్వారా.. పార్టీ ఫిరాయింపులకు బ్రేక్ వేయడంతో పాటు క్షేత్రస్థాయి క్యాడర్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపాలనేది కేటీఆర్ ప్రధాన వ్యూహంగా కనిపిస్తోంది.
రేవంత్ 117 సీట్ల లెక్క - అసంతృప్తిని నొక్కేసే ముందస్తు వ్యూహం!
మరోవైపు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అంతే వ్యూహాత్మకంగా వ్యవహరించారు. భవిష్యత్తులో నియోజకవర్గాల సంఖ్య 119 నుండి 182కి పెరుగుతుందని అంచనా వేస్తూ.. అందులో కాంగ్రెస్ 117 సీట్లు క్లీన్ స్వీప్ చేస్తుందని జోస్యం చెప్పారు. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఫేక్ సర్వేల ప్రచారాన్ని తిప్పికొట్టడానికి ఆయన ఈ మైండ్ గేమ్ను ఎంచుకున్నారు. ఆరు గ్యారెంటీలు, రుణమాఫీ, రైతు భరోసా నిధుల విడుదల వంటి సంక్షేమ పథకాల ద్వారా ప్రజాధారణ తమకే ఉందని నిరూపించే ప్రయత్నం చేశారు. 36 నెలల ముందే ఫలితాలను ఊహిస్తున్నానంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యానం.. పాలనాపరమైన లోపాలపై వస్తున్న విమర్శల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వ మార్పుపై ప్రతిపక్షాలు ఆశలు పెట్టుకోకుండా, తమ ప్రభుత్వం సుస్థిరంగా ఐదేళ్లు కొనసాగుతుందనే బలమైన సందేశాన్ని కాంగ్రెస్ శ్రేణుల్లోకి పంపడమే రేవంత్ లక్ష్యం.
నిజంగానే సర్వేలలో వ్యతిరేకత ఉందా?
ప్రభుత్వాలు మారిన కొత్తలో ఆశించిన స్థాయిలో హామీలు అమలు కానప్పుడు కొంతవరకు ప్రజా వ్యతిరేకత రావడం సహజం. కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలు, రైతు బంధు నిధుల ఆలస్యం వంటి అంశాలపై కాంగ్రెస్ను కార్నర్ చేయడానికి బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. అయితే, ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్ మళ్లీ పుంజుకుని 78 సీట్లు సాధించేంత సీన్ ఉందా? లేదా కాంగ్రెస్ అంచనా వేస్తున్నట్లు 117 సీట్లు వస్తాయా? అనేది కేవలం ఊహాజనితమే. రాజకీయాలు ఎప్పుడు ఎలా మారిపోతాయో అంచనా వేయడం కష్టం. ఇరు పార్టీల అధినేతలు మాత్రం తమ పార్టీలకు గెలుపు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనే భ్రమను లేదా నమ్మకాన్ని ప్రజల్లో ఉంచడానికి ఈ మైండ్ గేమ్ను సునిశితంగా వాడుకుంటున్నారు.
తెలంగాణ పాలిటిక్స్లో మారిన నెరేటివ్
ఈ రాజకీయ సమరాన్ని గమనిస్తే.. తెలంగాణలో పట్టు కోల్పోకూడదని కాంగ్రెస్, కోల్పోయిన వైభవాన్ని తిరిగి తెచ్చుకోవాలని బీఆర్ఎస్ తీవ్రంగా శ్రమిస్తున్నట్లు స్పష్టమవుతోంది. కేటీఆర్ ప్రకటన పార్టీ ఉనికిని కాపాడుకునే రక్షణ వ్యూహం అయితే, రేవంత్ రెడ్డి ప్రకటన తామే సుప్రీం అని నిరూపించుకునే అగ్రెసివ్ అటాక్ . ఈ ఇద్దరు నేతలు అప్పుడే ప్రారంభించిన ఈ ముందస్తు సర్వేల యుద్ధం, రాబోయే రోజుల్లో క్షేత్రస్థాయి రాజకీయాలను మరింత ఆసక్తికరంగా మార్చడం ఖాయం. అంతిమంగా ఓటరు దేవుడు ఎవరి వైపు ఉన్నాడనేది కాలమే నిర్ణయిస్తుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















