BRS Aggressive Politics: బీఆర్ఎస్ యువనేతల దూకుడు.. ఆవేశంలో మునిగిపోతున్న ఆలోచన! లాభమా..నష్టమా?
Balka Suman Violent Comments: తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ యువనేతల దూకుడు తీరు ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారుతోంది. కేటీఆర్ , బాల్క సుమన్ వ్యాఖ్యల వల్ల పార్టీకి మైలేజ్ రాకపోగా.. వివాదం అవుతోంది.

Telangana BRS vs Congress: రాజకీయాల్లో దూకుడు ఉండాలి, కానీ అది ప్రజల్లో విశ్వసనీయతను పెంచేలా ఉండాలి తప్ప.. ఆవేసంతో పార్టీని ఆత్మరక్షణలో పడేసేలా ఉండకూడదు. ప్రస్తుతం తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం భారత రాష్ట్ర సమితి ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు ఇదే. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ యువ నాయకత్వం అనుసరిస్తున్న తీరు, చేస్తున్న వ్యాఖ్యలు పార్టీకి మైలేజీని ఇవ్వడం కంటే వివాదాలకే ఎక్కువ దారితీస్తున్నాయి.
దూకుడునే నమ్ముకుంటున్న బీఆర్ఎస్ యువనేతలు
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం భారత రాష్ట్ర సమితి పరిస్థితి కత్తి మీద సాము లా మారింది. పదేళ్ల అధికారానికి దూరం కావడాన్ని జీర్ణించుకోలేకనో లేక పట్టు కోల్పోతామన్న భయమో కానీ, పార్టీలోని కీలక యువనేతలు అనవసరమైన ఆవేశంతో వివాదాలను కొనితెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ , మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ వంటి నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ప్రజా సమస్యల కంటే వ్యక్తిగత దూషణలు, హింసాత్మక పిలుపులకే మీడియాలో ప్రాధాన్యత లభిస్తుండటంతో.. పార్టీ అసలు ఎజెండా పక్కదారి పడుతోంది.
దూషణలకు దిగుతున్న కేటీఆర్
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని , కేంద్ర మంత్రి బండి సంజయ్ను ఉద్దేశించి చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు హుందాగా లేవనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా బండి సంజయ్ కుమారుడికి సంబంధించిన సులను ప్రస్తావించడం, సీఎంపై వ్యక్తిగత విమర్శలు చేయడం ద్వారా ఆయన సొంత పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపవచ్చు కానీ, తటస్థ ఓటర్లలో మాత్రం ప్రతికూలతను పెంచుతున్నాయి. కేటీఆర్ ప్రజా సమస్యలపై, హామీల అమలుపై చేస్తున్న పోరాటం కూడా ఈ వివాదాస్పద వ్యాఖ్యల వెనుక మరుగున పడిపోతోంది. రాజకీయాల్లో ఆలోచనకు ఉన్న విలువ ఆవేసానికి ఉండదు అనే సత్యాన్ని యువ నాయకత్వం విస్మరిస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన తాజా వ్యాఖ్యలు బీఆర్ఎస్ను మరింత ఇరకాటంలో పడేశాయి. మిలిటెంట్ తరహాలో దాడులు చేద్దాం, ప్రభుత్వ కార్యాలయాలను తగులబెట్టండి అంటూ ఆయన ఇచ్చిన పిలుపు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. సింగరేణి ప్రాంతంలో రాజకీయ పట్టు నిలుపుకోవడం కోసం ఇలాంటి హింసాత్మక రాజకీయానికి తెరలేపడంపై మేధావి వర్గం తీవ్రంగా మండిపడుతోంది. ఒక బాధ్యతాయుతమైన పదవిలో పనిచేసిన వ్యక్తి ప్రజా ఆస్తుల ధ్వంసానికి పిలుపునివ్వడం అంటే ప్రజాస్వామ్య విలువలకే గొడ్డలిపెట్టు అని భావిస్తున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న భావన ఎక్కువగా వినిపిస్తోంది. పార్టీలోని సీనియర్ నేతలు మౌనంగా ఉండగా, యువనేతలు మాత్రం మీడియా అటెన్షన్ కోసం చేస్తున్న ఈ అతి దూకుడు పార్టీని ప్రజలకు దూరం చేస్తోంది. ప్రతిపక్ష హోదాలో ప్రభుత్వంపై పోరాటం చేయాల్సిందే, కానీ అది నిర్మాణాత్మకంగా ఉండాలి. భాషా పరమైన హుందాతనాన్ని కోల్పోవడం వల్ల కేటీఆర్ వంటి నేతల క్రెడిబిలిటీ దెబ్బతినే ప్రమాదం ఉంది. ప్రజా సమస్యలపై గళం విప్పినప్పుడు అది వార్తల్లో నిలవాలంటే, దానికి వ్యక్తిగత దూషణలు తోడవ్వకూడదని అంటున్నారు.
ప్రభుత్వంపై వ్యతిరేకతను సానుకూలంగా మల్చుకోవాలి!
రాజకీయాల్లో నిలబడాలంటే ఓటర్ల నమ్మకం చాలా ముఖ్యం. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తనవైపు తిప్పుకోవాల్సిన బీఆర్ఎస్, తన వివాదాస్పద వ్యాఖ్యలతో ప్రభుత్వానికి ఎదురుదాడి చేసే అవకాశం ఇస్తోంది. బాల్క సుమన్ వ్యాఖ్యల వల్ల పోలీసులు కేసులు పెట్టడం, జైలుకు పంపడం వంటి పరిణామాలు పార్టీకి సానుభూతిని తీసుకురావడం కంటే హింసావాద పార్టీ అనే ముద్రను వేసేలా ఉన్నాయి. బీఆర్ఎస్ అధిష్టానం ఇప్పటికైనా మేల్కొని యువనేతలకు దిశానిర్దేశం చేయకపోతే, రాబోయే రోజుల్లో పార్టీ మరిన్ని కష్టాలను ఎదుర్కోవాల్సి రావచ్చు. ప్రజలు నాయకుడి నుండి ఆశించేది సమస్యల పరిష్కారం మరియు మెరుగైన భవిష్యత్తుపై భరోసా. కానీ, ప్రతిరోజూ మీడియాలో బూతులు, శాపనార్థాలు, హింసాత్మక పిలుపులు వినాల్సి వస్తే.. సాధారణ జనం ఆ పార్టీకి క్రమంగా దూరమయ్యే అవకాశం ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు




















